హైదరాబాద్ : భద్రాద్రిలో సీతారామ స్వామి కల్యాణ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా సీతారామచంద్రస్వామి వారల ఎదుర్కోలు మహోత్సవం మిథిలా మైదానంలో శనివారం సాయంత్రం కనుల పండువగా నిర్వహించారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అంతకు ముందు స్వామివారలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలు జరుగనున్నాయి. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
రేపు జరుగనున్న కల్యాణోత్సవ వేడుక పెద్ద భక్తులు రానుండగా.. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎండాకాలం కావడంతో చలువ పందిళ్లు, షామియానాలు, కూలర్లను ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియంను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తుల కోసం 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. శ్రీరామనవమి రోజున తలంబ్రాలకు 50 కౌంటర్లు, లడ్డూలకు 30 కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని తీరొక్క పూలు, విద్యుద్దీపాలతో అలంకరించారు. వేడుకల నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.