భవిష్యత్తుకు ఓ ఆకారం అంటూ ఉంటే అది స్త్రీ రూపంలోనే ఉంటుంది.
– శ్రీఅరవిందులు
శక్తి..
నూటికి నూరుపాళ్లు స్త్రీ లింగమే.
అనంత తత్వానికి ప్రతీక. ఆమెకు
ఎవరో వచ్చి సాధికారత ఇవ్వలేదు.
తానే సృష్టించుకుంది. తానే అధికారం తీసుకుంది. సృష్టించడం అనేది ఆమెకే తెలిసిన విద్య. విధాత బొమ్మను మాత్రమే చేయగలడు. ప్రాణం పోసేది మాత్రం ఆమే.. మూలపుటమ్మే.
ఆమె విజ్ఞాన స్వరూపం.. సరస్వతిగా.
అధికార స్వరూపం.. పార్వతిగా.
సంపద స్వరూపం.. లక్ష్మిగా.
ఈ మూడు పునాదులపైనే ప్రపంచమంతా నడుస్తున్నది. కాదుకాదు.. అమ్మలగన్న అమ్మే నడిపిస్తున్నది. సృష్టి, పునః సృష్టి, ఆలనపాలన ఆమె బాధ్యతలే. పురుషుడు ఫక్తు సహాయకుడే. అతను కరెంటు తీగ అయితే, ఆమె విద్యుత్తు. అతను కలం అయితే ఆమె సిరా. అతను వాహనం అయితే ఆమె ఇంధనం. అతను గల్లాపెట్టె అయితే ఆమె ధనం.
ఆమె స్వతహాగా పరిపూర్ణ.
అతను అచ్చమైన అరసున్నా.
శక్తి తోడైతేనే పురుషుడికి పూర్ణత్వం సిద్ధిస్తుంది.
మూడు మూర్తులకును మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు దుదినభేదమై యొప్పారు
బ్రహ్మమనగ నీవ ఫాలనయన..
అంటాడు పోతన భాగవతంలో.
ముగ్గురు మూర్తులు కనిపిస్తారు. కానీ ఉన్నది ఒక్క మూర్తే. మూడు లోకాలుగా కనిపిస్తాయి. కానీ ఉన్నది ఒకటే పదార్థం. మూడు కాలాలుగా లెక్కలేసుకుంటాం. కానీ ఉన్నది ఒకటే స్వరూపం. ఆమె.. అమ్మే! సత్యం, సత్యం, పునఃసత్యం. సత్యం సత్యం.. నసంశయః ముల్లోకాలను ఆ తల్లి పాలించిన విధానం, ముగ్గురు మూర్తులను సమన్వయం చేసుకున్న తీరు, త్రికాలాలను నేత్రద్వయంతో నడిపించే పద్ధతి.. అచ్చమైన పాలన పాఠాలు.. ‘శక్తి మేనేజ్మెంట్’ అని పిలుచుకోవచ్చు. ‘నవదుర్గ నాయకత్వం’గా అభివర్ణించవచ్చు. పాలకులలో శక్తి అంశ ఉన్నప్పుడే.. ఇదంతా సాధ్యం అవుతుంది. రెచ్చగొట్టి విభజించే, విభజించి పాలించే అసురపాలన మనకొద్దు. పన్నాగాలతోనో, పదవీకాంక్షతోనో ఏ దురాత్ములో ఆ దుస్సాహసం చేసినా.. అమ్మ వమ్ము చేస్తుంది. ధర్మాన్నే గెలిపిస్తుంది.
ముగురమ్మల మూలపుటమ్మ.. సహజ నాయకురాలు. మాతృప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. అమ్మతనపు పాలనలో నాయకుడు లేదా నాయకురాలు తన బృందంలోని ప్రతి ఒక్కరినీ బిడ్డలానే చూస్తారు. తప్పు చేసినప్పుడు బిడ్డను తల్లి దండించినట్టే దండిస్తారు, తల్లి శిక్షించినట్టే శిక్షిస్తారు. మహాకవి కాళిదాసు వృత్తాంతమే ఇందుకు ఉదాహరణ. భోజ మహారాజు ఆస్థానంలో ముగ్గురు దిగ్గజ కవులు.. దండి, భవభూతి, కాళిదాసు. వారిలో ఎవర్ని ‘మహాకవి’ అని సంబోధించాలి? అనే సందేహం కలిగింది భోజరాజుకు. ఎవరికివారు మహాపండితులే. ఆ ముగ్గురి ప్రతిభను బేరీజు వేయగల తూకంరాయి ఎవరి దగ్గర ఉంటుంది? అందులోనూ నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవాలి. దీంతో భోజుడు ఆ బాధ్యత ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మీద పెట్టాడు. ముగ్గురినీ తీసుకుని ఆలయానికి వెళ్లాడు. తన సందేహాన్ని మూల మూర్తికి నివేదించాడు. కొద్దిసేపటికి ‘కవిర్దండి’ అనే పలుకులు వినిపించాయి. నిజమే, కవి అంటే.. దండే!
‘భవభూతిస్తు పండితః’.. పాండిత్యమంటే భవభూతిదే అనే పలుకూ వెలువడింది. ఒకరికి కవి అనే కితాబు అందింది. మరొకరికి పండితుడనే ముద్ర లభించింది. తన దగ్గరికి వచ్చేసరికి.. ఎలాంటి స్పందనా లేకపోయేసరికి కాళిదాసుకు కోపం వచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయాడు. కళ్లు ఎర్రబడ్డాయి. మాటలు తడబడుతున్నాయి. శరీకంలో చిన్నగా వణుకు. గొంతులో కాఠిన్యం. ‘మరి నేనెవర్నే?’ అన్నాడు తీవ్రస్వరంతో. సింహవాహిని అయిన అమ్మ దర్శనం కోసం త్రిమూర్తులు సైతం సింహద్వారం వద్ద ఎదురుచూస్తుంటారట. ఆమెతో మాట్లాడాల్సి వస్తే.. ఎక్కడ తమ నోటి ఎంగిలి ఎగిరిపడి ఆమెను తాకుతుందో అనే భయంతో గంగా జనకుడు సైతం నోటికి చేయి అడ్డు పెట్టుకుని మాట్లాడతాడట. అలాంటి వ్యక్తిని మర్యాదలేకుండా ఏకవచనంతో సంబోధించడం ఏమిటి? ఆ స్థానంలో మరొకరు ఉంటే.. కాళిదాసు బూడిదైపోడూ! యమభటులు వచ్చి రౌరవాది నరకాలకూ తరలించరూ? కానీ, అమ్మ పాలనలో అంత కర్కశత్వం ఉండదు. ‘త్వమేవాహం త్వమేవాహం. త్వమేవాహం న సంశయః’ అని పలికింది అంబ. ‘నువ్వే నేను. నేనే నువ్వు. సందేహమే వద్దు’ అని ప్రకటించింది. ‘నీ అక్షరం.. బీజాక్షరం’ అని చెప్పకనే చెప్పింది. కాళి దాసుకు తాను చేసిన తప్పూ తెలిసొచ్చింది. కన్నీళ్లతో మహంకాళి పాదాల మీదపడ్డాడు. ఎదుటి మనిషి తన తప్పు తాను తెలుసుకునేలా చేసే శక్తి ఒక్క ప్రేమకే ఉంది. ముజ్జగాల పాలన సూత్రాల్లో అది కీలకం.
మహాదాత..
నాయకత్వం అంటే.. నలుగురితో పంచుకోవడం! నైపుణ్యం, డబ్బు, పలుకుబడి, ప్రతిభ.. పంచుకున్నకొద్దీ పెరుగుతాయి. నాయకుడి చేతికి ఎముక ఉండకూడదు. అమ్మవారి నాయకత్వ శైలి కూడా అలాంటిదే. ఒకప్పుడు కాంచీపురాన్ని ఆకాశరాజు పాలించేవాడట. ఆయనకు సంతానం లేదు. ఆ భాగ్యం కోసం తపస్సు చేశాడు. కామాక్షమ్మ ప్రత్యక్షమైంది. ‘ఎలాంటి బిడ్డ కావాలి?’ అని అడిగింది. ‘వినాయకుడు’ అని జవాబిచ్చాడు.
‘గణపతిలాంటి బిడ్డనివ్వాలా?’ అని రెట్టించి అడిగింది. ‘కాదు.. గణపతినే’ స్పష్టంగా చెప్పాడు ఆకాశరాజు. ‘తన ముద్దుల బిడ్డను అడుగుతాడేమిటి?’ అని విసుక్కోలేదు ఆ తల్లి. ‘తథాస్తు’ అంటూ వరమిచ్చింది. సాక్షాత్తు బాల గణపతే అతని ఇంట తుండీర యువరాజుగా జన్మించాడు. ఆ తల్లికి హద్దులు తెలియవు. పరిమితులు ఉండవు. కాబట్టే, లోకనాయకి అయ్యింది. కామాక్షి పరదేవత పుణ్యాన కాంచీపురంలో పంటలకు కొదవ ఉండేది కాదట. దీంతో రాజు నిత్యాన్నదానం చేసేవాడట. ఓరోజు రాజుగారి భార్య భోజనం వండుతుండగా.. ఆమె చేతి బంగారు ఉంగరం.. పాయసంలో పడిపోయింది. ఆ పాయసాన్ని ఓ ముత్తయిదువ రూపంలో భోజనానికి వచ్చిన కామాక్షికి వడ్డించారు. ఆమె ఇష్టంగా ఆరగించారు. పాయసంతోపాటు బంగారమూ కడుపులోకి వెళ్లిపోయింది. బంగారాన్ని వడ్డించిన రాజుకు.. బంగారాన్నే కానుకగా ఇవ్వాలనే ఉద్దేశంతో కనక వృష్టి కురిపించిందట ఆ తల్లి.
సమన్వయ మూర్తి..
ఓ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే.. కొన్నిసార్లు ఒక వ్యక్తి సరిపోకపోవచ్చు. ఒక్కరి శక్తి చాలకపోవచ్చు. నాలుగు ఆలోచనలు కలవాలి. మేధోమథనమంటూ జరగాలి. సామూహిక కృషి మొదలుపెట్టాలి. ఈ మహత్కార్యానికి ఎవరో ఒకరు పూనుకోవాలి. అనుచరులలో, సహచరులలో ఉత్సాహం నింపాలి. వ్యూహం సిద్ధం చేయాలి. ఆచరణ మొదలుపెట్టాలి. సమర్థతను బట్టి విధులు కేటాయించాలి. అధికార బదిలీ చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే.. నాయకత్వ స్థానంలో ఉన్నవారే కర్త, కర్మ, క్రియ. అమ్మవారి సమర్థ నాయకత్వంలో జరిగిన త్రిపురాంతక సంహారం.. సమష్టి విజయానికి, నాయకత్వ బలానికి, పదునైన వ్యూహ రచనకు నిలువెత్తు తార్కాణం. కాబట్టే, ముగురమ్మల మూలపుటమ్మ.. చాలా పెద్దమ్మ.. త్రిపురాంతకిగా జగత్ ప్రసిద్ధురాలైంది. ఇదొక మహాద్భుత ఘట్టం. తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి. ముగ్గురూ బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేశారు. అజరామరత్వాన్ని ప్రసాదించమని అడిగారు. కుదరదు పొమ్మన్నాడు విధాత. ముగ్గురికీ మూడు లోకాలనైనా సృష్టించి ఇవ్వమని వేడుకున్నారు. ఈ సారి తప్పలేదు. బంగారు, వెండి, ఇనుము నగరాలను సిద్ధం చేయమని మయుడిని ఆదేశించాడు బ్రహ్మ. తక్షణం శత్రుదుర్భేద్యంగా కట్టి ఇచ్చాడు దేవశిల్పి. కానీ రాక్షసులు అసుర ప్రవృత్తికొద్దీ.. మహర్షులను హింసించేవారు. దైవ దూషణ చేసేవారు. దీంతో జగన్మాత త్రిపురాసుర సంహారానికి వ్యూహం పన్నింది. ఆ మూడు నగరాలూ ఒకే కక్ష్యలో వచ్చే సమయాన్ని ముహూర్తంగా నిర్ణయించింది. శివుడికి సంహార బాధ్యత అప్పగించింది. భూమిని రథంగా మార్చింది. సూర్య చంద్రులను చక్రాలను చేసింది. నాలుగు వేదాలను గుర్రాలుగా ప్రసాదించింది. మేరు పర్వతాన్ని ధనుస్సుగా సిద్ధం చేసింది. విష్ణువును అస్త్రం చేసింది. మూడు నగరాలూ ఒకే వరుసలో రావడమే ఆలస్యం.. ‘శివా గురిపెట్టు’ అని ఆదేశించింది. రెప్పపాటు సమయంలో శత్రు సంహారం పూర్తయింది. ఇంతటి సమన్వయ శక్తి.. శ్రీశక్తి నాయకత్వానికే సాధ్యం. త్రిపురాలు ఎక్కడో లేవని.. మన అజ్ఞాన, అహంకార, దుర్గ్గుణాలే అంటారు పండితులు. అమ్మ తనదైన యోగబలంతో ఆ అసురగుణాల్ని తుత్తునియలు చేస్తుందనేది ఆధ్యాత్మిక కోణం. ఆగమశాస్త్ర ప్రకారం కూడా.. త్రిపుర సంహారమూర్తి అయిన శివుడి విగ్రహానికి ఎడమ భాగంలో మహాదేవి ఉండాల్సిందే. అప్పుడే, ఆ శిల్పానికి పరిపూర్ణత.
అర్ధ పురుషేశ్వరి..
మనం అర్ధనారీశ్వర తత్వాన్ని సగం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. స్థూలంగా చూస్తే.. అతనిలో ఆమె సగం కాదు, ఆమెలోనే అతను సగం. అమ్మలోనే అయ్య ఉన్నాడు. అయ్యలో అమ్మ లేదు. ఈ ఘట్టానికి మూలాలు భృంగి వృత్తాంతంలో ఉన్నాయి. ప్రమథగణ ముఖ్యడైన భృంగి పరమేశ్వరుడి భక్తుడు. స్త్రీ అనే తేలికభావమో, మరో కారణమో తెలియదు కానీ.. అమ్మవారంటే కాస్త చిన్నచూపు. అమ్మవారి ఉనికిని విస్మరించి శివుడికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారాలు సమర్పించాడు. అమ్మ మనసు చివుక్కుమంది. అయినా, మౌనంగానే ఉండిపోయింది. ఆ తర్వాత మరోసారి.. అదే ఘట్టం పునరావృతం అయ్యేదే. ఉద్దేశపూర్వకంగానే అమ్మవారు శివుడికి అతిదగ్గరగా కూర్చున్నారు. శివుడి చుట్టూ ప్రదక్షిణ చేయలేని పరిస్థితి. దీంతో భ్రమరంగా మారిపోయి.. శివుడి చుట్టూ తిరిగాడు. దీంతో అమ్మవారి ఆవేశం హద్దులు దాటింది. ఆ భ్రమరం కాళ్లు పీకేసింది. ఎంతైనా భక్త వత్సలుడు కదా! భృంగి బాధపడుతుంటే చూస్తూ కూర్చుంటాడా శివదేవుడు. మూడో కాలు ప్రసాదించాడు. దీంతో అమ్మవారికి పంతం పెరిగింది. నిజానికి ఇక్కడ భృంగి పురుషాహంకారం ఒక సాకు మాత్రమే.. ఆలూమగల మధ్య అభేదాన్ని చూడలేని మూర్ఖులకు ఓ సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు ఆ తల్లి. ఘోర తపస్సు చేసి.. శివుడిని ప్రసన్నం చేసుకున్నారు. అర్ధనారీశ్వరతత్వాన్ని ఆమోదించేలా చేశారు. ఆ హోదా.. అయాచితం కాదు. ఆమె పోరాడి సాధించుకున్నది. మహిళలోని పట్టుదలకు ఇదొక తార్కాణం. ఆధునిక మహిళకు ఇదొక స్ఫూర్తిదాయక ఘట్టం. ఆకాశంలో సగం తనదేనంటూ మురిసిపోతే సరిపోదు. పోరాడి సాధించుకోవాలి. పుం-స్త్రీ తత్వం ఆదిదంపతులకే పరిమితం కాదు. విష్ణుశక్తి లక్ష్మి, బ్రహ్మశక్తి సరస్వతి, రామశక్తి సీతాదేవి, సూర్యశక్తి ఛాయాదేవి, అగ్నిశక్తి స్వాహాదేవిగానూ మనం ఆమోదించాలి.
రాజ శ్యామల..
పాలకులకు పాలకురాలు జగన్మాత. మహామంత్రులకు వ్యూహాలు నేర్పగల యోధ రాజ రాజేశ్వరి. లక్షమంది చాణక్యులైనా ఆమె కాలిగోటికి సరిపోరు. అఖండ భూమండల పాలననూ తానే చక్కబెడుతుంది. సమర్థుల పాలనలో సకాల వర్షాలు, ముక్కారు పంటలు ఆ అమ్మ చలువే. రాజధాని నలుదిక్కులా విస్తరించినా, ధనాగారం కాసులతో కళకళలాడుతున్నా.. ఆ చేతి కటాక్షమే. రాజ శ్యామలను ఉపాసించిన ప్రభువుకు తిరుగు ఉండదు. ప్రత్యర్థులు దరిదాపుల్లోకి కూడా రాలేరు. ఆ రాజ్యాన్ని ఆమె.. తల్లి బిడ్డను రక్షించుకున్నట్టు కాపాడుతుంది. శ్రీకృష్ణుడిని పురమాయించి.. పాలకుడి ద్వారా వ్యూహ రచన చేయిస్తుంది. శత్రుభయం ఉండదు. ధనుర్ధారి రాముడిని సరిహద్దులలో కాపలా పెడుతుంది. చొరబాట్లకు తావులేదు. అన్నపూర్ణను పెద్ద ముత్తయిదువగా ఇంటింటికి పంపుతుంది. అన్నానికి కొదవే ఉండదు. దేశంలో ఒక్క తెలంగాణకు మాత్రమే రాజశ్యామల కటాక్షం దక్కింది. అందుకే ఈ అగ్రస్థానం.
అన్నపూర్ణేశ్వరి..
అమ్మ బిడ్డ కడుపును చూస్తుంది. ఆకలిని గ్రహిస్తుంది. రుచిని, అభి రుచిని అర్థం చేసుకుని.. నచ్చిన పదార్థాలను వండి వడ్డిస్తుంది. అదే అమ్మ బిడ్డ అనారోగ్యంతో ఉన్నప్పుడు పత్యం పెడుతుంది. ఆ పసివాడికి అయిష్టమని తెలిసినా.. ఔషధగుణాలు ఉన్న ఆహారం తినిపిస్తుంది. అవసరమైతే బెదిరిస్తుంది. కన్నెర్రజేస్తుంది. నోట్లో కుక్కేస్తుంది. బిడ్డ శ్రేయస్సు తనకు ముఖ్యం. జగదాంబ నాయకత్వశైలి కూడా అలాంటిదే. చాంగటి కోటేశ్వరరావు తన ప్రవచనంలో ఒక నిజ జీవిత గాథను ప్రస్తావిస్తారు. ఓ అగ్రహారంలో తాడేపల్లి రాఘవ నారాయణశాస్త్రి అనే పెద్ద మనిషి ఉండేవారట. ఆయన అమ్మవారి ఉపాసకుడు. కానీ పరమ దారిద్య్రం. పేదరికాన్ని కూడా ఆ తల్లి ప్రసాదించిన ఐశ్వర్యంగానే భావించేవారు. నిత్యం ఇరవై ఏడు పర్యాయాలు లలితా సహస్రనామం చదివేవారు. చివరన నైవేద్యం పెట్టేవారు. ఇంట్లో ద్రవ్యాలు నిండుకున్నప్పుడు పటిక బెల్లపు ముక్క పెట్టేవారు. అదీ లేకపోతే, మంచినీళ్లనే నివేదించేవారు. ఓ రోజు పూజ తర్వాత నీరసంతో స్పృహతప్పి పడిపోయారు. మరుక్షణమే.. పూజాగదిలోంచి అమ్మవారు బయటికి వచ్చి.. నారాయణశాస్త్రికి పాయసం తినిపించారట. అది కలో, కల్పనో కాదనడానికి సాక్ష్యంగా.. నేల మీద పాయసం ఆనవాళ్లు, అడుగున కొంచెం పాయసం మిగిలి ఉన్న వెండి గిన్నె అక్కడ ఉన్నాయట. అప్పటినుంచీ ఆ ఇంటి ఆర్థిక స్థితి మారిపోయిందట. ఆయన సంకల్పానికి తిరుగులేకుండా పోయింది. ఆయన ఆశీర్వదిస్తే జరిగితీరాల్సిందే. అదీ అమ్మవారి మాతృప్రేమ.
జ్ఞానప్రసూన..
నాయకత్వ బలమే జ్ఞానం. నాయకులు నిత్య విద్యార్థులు. జగద్ధాత్రి కూడా నిరంతర సాధకురాలే. కాబట్టే, బుద్ధిగా దక్షిణామూర్తి ముందు కూర్చుని గురుగీత విన్నది. సందేహాలు నివృత్తి చేసుకున్నది. సకల విద్యలకు అధిదేవత అయినా.. కించిత్ కూడా అహంభావం లేదు. ఓసారి బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు.. కైలాసానికి వెళ్లారు. ఆ సమయానికి పార్వతీదేవి పర్ణశాలలో తపస్సు చేసుకుంటున్నది. తల్లి పాదాలకు నమస్కరించి తమ సందేహాన్ని వ్యక్తపరిచారు. వేదాల సారాన్ని తెలిపి.. తమకు జ్ఞానభిక్షను ప్రసాదించమని వేడుకున్నారు. శైలపుత్రి చిరునవ్వు నవ్వి.. పరమశివుడి వైపు చూసింది. కళ్లతోనే పెనిమిటివైపు జ్ఞానధారను ప్రవహింపజేసింది. శివుడు దక్షిణామూర్తిగా రుషిపుంగవులకు మహాజ్ఞానాన్ని ప్రసాదించాడు. దక్షిణామూర్తి అవతారాలు అనేకం. మేధా దక్షిణామూర్తి, యోగ దక్షిణామూర్తి, జ్ఞాన దక్షిణామూర్తి మాత్రమే కాదు, అంతిమంగా శాంభవీ దక్షిణామూర్తీ అయ్యాడు. అందుకే స్వామి పదం అయితే.. ఆమె అర్థం అయ్యింది. కాబట్టే ఆదిశంకరులు అమ్మవారిని ‘దక్షిణామూర్తి రూపిణి’ అంటారు.
* * *
కాంచీపురంలో ఓ మూగ భక్తుడు అమ్మవారి దర్శనానికి వెళ్లాడు. అప్పటికే కామాక్షమ్మకు నైవేద్యం సమర్పించారు. ఆలయ ద్వారాలు మూసేశారు. దీంతో అతను నిరాశపడ్డాడు. మనసారా నైవేద్యం ఆరగించిన ఆ తల్లి.. తాంబూల చర్వణం చేస్తూ వీధిలోకి వచ్చింది. ఆ మూగ భక్తుడి తపనను అర్థం చేసుకుంది. తాను నములుతున్న తాంబూలం కాస్తం తీసి.. ఆ మూగవాడి నోట్లో పెట్టింది. అమ్మ ఎంగిలి.. వేయి అమృతభాండాలకు సమానం! తాదాత్మ్యంతో చప్పరించాడు. నోరు పండింది. జీవితమూ పండింది. మాట వచ్చింది. కవిత్వం ప్రవహించింది. ఆశువుగా ఐదు వందల శ్లోకాలు చెప్పాడు. పరమేశ్వరి పరవశించింది. ‘ఏం వరం కావాలో కోరుకో బిడ్డా’ అని అడిగింది. ‘నన్ను మళ్లీ మూగవాడిగా మార్చు తల్లీ’ అని వేడుకున్నాడు. ‘నిన్ను కీర్తించిన ఈ నోటితో ఏం మాట్లాడినా తప్పే. నీ ఎంగిలితో పవిత్రమైన ఈ నోటితో నీ ప్రసాదం కాని ఏ పదార్థం తిన్నా అపరాధమే కదా’ అంటూ తన మనసులో మాట చెప్పాడు. మూకాంబిక ఆ భక్తుడికి ముక్తిని ప్రసాదించింది. మాటలోని అర్థాన్నే కాదు, మౌనంలోని అంతరార్థాన్నీ గ్రహించగలదు ఆ జగన్నాయకి. ప్రపంచానికి కావలసింది.. ఆ నవదుర్గ నాయకత్వమే!