‘స్థానాభిలాషీ తపసి స్థితోహం త్వాం ప్రాప్తవాన్ దేవ! మునీంద్ర గుహ్యమ్ కాచం విచిన్వన్నపి దివ్య రత్నం స్వామిన్ కృతార్థోస్మి వరం న యాచే॥“దేవాధిదేవా! రాజ్యాధికారం పొందుటకే నేను తపస్సుకు పూనుకున్నాను. కానీ, ఎందరో మహాయోగులకు, మునీంద్రులకు కూడా అందరాని నీవు నా ముందు నిలిచి కనువిందు చేశావు. స్వామీ! నేను ధన్యుడనయ్యాను. గాజు ముక్క కోసం యత్నించు వానికి అప్రయత్నంగా, అయాచితంగా అనర్ఘరత్నం లభించింది. వరదా! నేనిక ఏ వరమూ కోరను.”
ప్రాజదువుల (వేదాల) ప్రతిరూపమైన పాంచజన్య శంఖ స్పర్శ ప్రభావం వలన జీవ-ఈశ్వర నిర్ణయాన్ని ధ్రువీకరించుకున్న ధ్రువుడు దృఢమైన భక్తి భావంతో వేదవాక్యాలచే విశ్వవిఖ్యాతుడైన విక్రముని- గరుడ గమనుని ఇంకా ఇలా వినుతించాడు. ‘ఆర్త బాంధవా! అబ్జయోని (బ్రహ్మదేవుడు) నిన్ను ఆశ్రయించి, నీవు అనుగ్రహించిన విజ్ఞానంతోనే ఈ లోకాన్ని ఆలోకించాడు (చూచాడు). పరమపురుషా! నీ పావన పాదమూలం కైవల్య (ముక్తి) కల్ప పాదపానికి (వృక్షానికి) ఆలవాలం (పాదు). ముకుందా! మునివందిత పాదారవిందా! నీవు ఒక్కడివైనా నీ మాయాశక్తిచే పెక్కు భంగులుగా భాసిస్తావు (సర్వప్రాణి హృదయ అంతర్వర్తి అయిన అచ్యుత పరమాత్మను ఇలా గుర్తించడమే అధ్యాత్మ యోగం!).
మాధవా! రమాధవా! నీ మాయచేత మోహితులైన మావంటివారు మాత్రమే నీ నుంచి కోర్కెలు ఆశించి నిన్ను కొలుస్తారు. మధుసూదనా! అట్టివారు మహామూర్ఖులు గదా!! జన్మ మరణాల నుంచి విముక్తి కలిగించు నిన్ను విష సమానమైన విషయ (శరీర) సుఖం ఇమ్మని కోరువాడు.. కామధేనువు కనిపిస్తే పొలం దున్నమన్న కామందు (రైతు) వంటి కాపురుషుడు (మూఢుడు) కాదా? (‘చేతిలోని చింతామణిని సమర్పించి బదులుగా గాజుముక్కను గ్రహించినట్లు కాదా?’ చందన వృక్షాన్ని ఇంధనం (వంటచెరకు)గా వాడటం వంటిది కాదా?) ఈ స్పర్శ సుఖం నరకంలో కూడా లభిస్తుందిగా! (అనగా ఆ సుఖమే నరకమని నిశ్చితార్థం! మనుష్య భాషకి, మనీషి (మహర్షి) భాషకి అదే భేదం) పద్మనాభా! నీ పద స్మరణం వలన, అనురాగసుధలు చిందే నీ కథల శ్రవణం వలన ప్రాప్తించే పరమ సుఖం నిజానంద రూపమైన నిర్వాణంలో- అపవర్గం (మోక్షం)లో కూడా నిండుగా మెండుగా ఉండదని అంటారు గదా, ఇక తుచ్ఛమైన స్వర్గ సుఖం గురించి చెప్పేదేముంది స్వామీ?’ అని ప్రస్తుతించాడు ధ్రువుడు.
భక్తి శాస్త్రంలో మిన్నగా ఉన్న ఈ మాట భగవత్ కథా శ్రవణాన్ని, పదస్మరణను స్తుతించడానికి అన్న మాటగా, హుందాగా భావించాలి కానీ, బ్రహ్మానందాన్ని న్యూన (తక్కువ) పరచే నిందావాక్యంగా మాత్రం తలపరాదని శ్రీధరస్వామి వ్యాఖ్యానం. అద్వైతం పరమార్థమైనా భక్తి కొరకు కల్పితమైన ద్వైతం ఇందు ప్రభ (పండు వెన్నెల) వలె, అద్వైతం కన్నా అత్యంత సుందరం, అపరిమిత ఆనందప్రదం! అట్టి భక్తి ముక్తి కంటే వందరెట్లు వరిష్ఠ (శ్రేష్ఠ) మని భాగవత హృదయం. అందుకే, భాగవత భక్తులందరూ త్రివర్గాన్నే (ధర్మ, అర్థ, కామాలనే) కాక అపవర్గాన్ని (మోక్షాన్ని) కూడా ఆదరించక అనన్య భక్తినే హృదయ అరవిందాలలో అందలమెక్కించి ఆనందాన్ని అనుభవించారు. కథామృత పానంలో ఆసక్తి లేకుండా కేవల యోగయాగాదులందే అనురాగం కలవారికి దేహగేహాదుల యందు ఉన్న అభిమానం పోదు.
ధ్రువ ఉవాచ- ‘గదాధరా! నీ కథాసుధారసాన్ని మనసారా, ముదమార సదా గ్రోలుతూ, వ్యథా భరితమైన దుస్తర సంసార సాగరాన్ని సులభంగా సంతరించ (దాట) గలిగే విధంగా నీ సేవాసక్తులైన సత్పురుషుల సాంగత్యాన్ని ప్రసాదించు.. రాజీవ నేత్రా! రమా కళత్రా!
‘త్రివిక్రమా! నీ తేజోమయ పరబ్రహ్మ స్వరూపానికి రాజీపడని నిశ్చల నియమంతో నమస్కరిస్తున్నా! జనార్దనా! నీవు జీవుని కన్నా విలక్షణుడవు. నిత్య ముక్తుడవు. జీవుడు నీ దయ ఉంటేనే ముక్తుడు కాగలడు. నీవు నిర్మలుడవు. జీవుడు మలినుడు. నీవు సర్వజ్ఞుడవు. జీవుడు అల్పజ్ఞుడు. నీవు చైతన్యమూర్తివి. జీవుడు జడుడు. నీవు నిర్వికారివి, తాను వికారవంతుడు. నీవు సకలైశ్వర్య సంపన్నుడవు. అతను ఐశ్వర్యహీనుడు. నీవు గుణాతీతుడవు, జీవుడు గుణాలకు బద్ధుడు. దేవా! ఆద్యుడవు, అనంతుడవు, అద్వితీయుడవు, ఆనందమాత్రుడవు అయిన నీకు నమోవాకాలు. నీరజాక్షా! నిష్కాములకు నీవే పెన్నిధివి, పరమావధివి. సర్వాంతర్యామి అయిన నీ పాద సేవనమే పరమార్థ ఫలం. అయినా, దూడకు పాలిస్తూ ఆవు.. తోడేళ్ల వంటి క్రూరమృగాల బారి నుంచి దానిని కాపాడునట్లు నీవు సకాముల కోర్కెలు సఫలం చేస్తూనే వారి సంసార భయాలను సమసింప (నశింప) చేస్తావు.’ ఇలా సత్సంకల్పుడు, సుజ్ఞాని అయిన సునీతి సుతుడు ధ్రువుడు శ్రీహరిని ప్రస్తుతించాడు.
తే॥ నీకు మ్రొక్కెద అత్యంత నియమ మొప్ప
భవ్యచారిత్ర! పంకజ పత్రనేత్ర!
చిరశుభాకర! నిత్య లక్ష్మీ విహార!
యవ్యయానంద! గోవింద! హరి! ముకుంద!
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006