కూతురు/ కొడుకు పెండ్లి చేసిన తర్వాత ఏడాది వరకు యజమాని తీర్థ యాత్రలు చేయకూడదని అంటారు ఎందుకు? యాత్రలకు వెళ్తే దోషమా ?
పెండ్లి అనేది శుభకార్యం. కూతురుకు గానీ, కొడుకుకు గానీ పెండ్లి చేసిన తర్వాత యజమాని ఒక సంవత్సరం వరకు కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నది శాస్త్రం.
స్నానం సచేలం తిలమిశ్ర కర్మ
ప్రేతాను యానం కలశ ప్రదానం
అపూర్వ తీర్థామర దర్శనంచ
వివర్జయే న్మంగళతోబ్దమేకం’
ఇది శాస్త్ర ప్రమాణం. ఇంట్లో కూతురు/ కొడుకు పెండ్లి చేసిన యజమాని ఏడాదిపాటు కట్టుబట్టలతో స్నానం చేయకూడదు. నువ్వులు ఉపయోగించే కర్మలు చేయరాదు. శవ యాత్రలో పాల్గొనరాదు. కలశాన్ని దానంగా ఇవ్వకూడదు. తీర్థక్షేత్రాలు వెళ్లడం చేయకూడదు. తీర్థ యాత్రలకు వెళ్లిన వాళ్లు తప్పనిసరిగా కట్టుబట్టలతో స్నానం చేసి దేవుణ్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. సచేల స్నానం చేసిన తర్వాతే దైవాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అందుకే ఏడాది వరకు తీర్థయాత్రలు చేయకూడదని పెద్దలు నిర్దేశించారు. కనుక ఈ సమయంలో యాత్రలకు వెళ్లడం దోషమే అవుతుంది.
‘ఊర్ధ్వం వివాహాత్పుత్రస్య తథాచ వ్రత బంధనాత్
ఆత్మనో ముండనం చైవ వర్షం వర్షార్ధ మేవచ
మాస మన్యత్ర సంస్కారే త్రిమాసం చౌల కర్మణి
పిండదానం మృదా స్నానం కుర్యాత్తిల తర్పణం’ అని కొన్ని నియమాలు సూచించారు. వీటిని అనుసరించి కొడుకు/ కూతురు వివాహం చేసిన యజమాని ఒక సంవత్సరం కాలం వరకు జ్ఞాతులు ఎవరైనా కన్నుమూస్తే మృత్తిక స్నానం (మట్టిని పట్టుకొని చేసే స్నానం) చేయకూడదని శాస్త్ర నియమం. లౌకికంగా ఆలోచిస్తే, ఇంట్లో పెండ్లి చేసిన తర్వాత ఆర్థికంగా కొన్ని చికాకులు ఉంటాయి. ఈ నేపథ్యంలో యాత్రలు చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మరింత తలెత్తవచ్చు. ముఖ్యంగా శాస్త్ర నియమానుసారం యాత్రలకు వెళ్లకపోవడమే మంచిది.
డా॥ శాస్ర్తుల రఘుపతి
73867 58370