బుద్ధి ఇంధనం. జ్ఞానం అగ్ని స్వరూపం. ఈ రెండిటినీ అనుసంధానం చేయడమే దీపావళి. దైవీశక్తితో బుద్ధిని ప్రచోదనం చేయగలిగితే.. మనసనే మందిరంలో ముసురుకున్న చీకట్లు తొలగిపోతాయి. గుండె గుడిలో వెలిగే గోరంత దీపం కొండంత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. బాహ్యంగా వెలిగించే లక్షలాది దీపాలు కంటికి వెలుగులు పంచితే, అంతరంగంలో చిరుదివ్వె వెలుగు మానవ జన్మను చరితార్థం చేస్తుంది. దీపావళి సందర్భంగా వేవేల దీపకాంతుల నడుమ భౌతికంగా అడుగువేద్దాం. ఆ వెలుగులను మదినిండా నింపుకొందాం.
దీపావళి అనే శబ్దానికి ‘దీపాల సమూహం’ అని అర్థం. ఆశ్వయుజ అమావాస్య నాడు మాత్రమే దీపాలను
వెలిగించి దీపావళి జరుపుకొంటాం. కార్తిక మాసంలోనూ లక్షలాదిగా దీపాలు వెలిగించి ఉత్సవం చేసుకున్నా..
ఆ పర్వదినాలను దీపావళిగా వ్యవహరించం. అందుకు కారణాన్ని గమనిస్తే దీపావళి పండుగ చేసుకోవడంలో ఒక మహత్తర సూత్రం ఇమిడి ఉన్నది.
అంధకారం దూరం
బృహదారణ్యక ఉపనిషత్లోని ‘తమసోమా జ్యోతిర్గమయ’ మంత్రం దీపావళి విశిష్టతను తెలియజేస్తుంది.
‘చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడం’ దీని అర్థం. మానవ జీవితం అంతా ఈ సూత్రంపైనే నిలిచి ఉన్నది. తల్లి గర్భంలో ఉన్న శిశువు గర్భ నరకం చీకటిలోంచి ప్రపంచపు వెలుగులకు ప్రవేశించటంతో మానవ జన్మ మొదలవుతుంది. నరకాసురుని రూపంలో వచ్చిన అంధకారాన్ని, తమస్సును, అతని వల్ల అనుభవించిన నరకబాధల నుంచి బయటపడి దివ్యమైన ఆనందపు వెలుగులోకి ప్రవేశించిన సందర్భంలో దీపాలను వెలిగించి ‘దీపావళి’ జరుపుకొన్నారు. ఇక్కడ చీకటి, వెలుగు ఈ రెండిటికీ ప్రాధాన్యం కనిపిస్తుంది. అందుకనే నరకాసుర సంహారం జరిగిన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి పండుగగా చేసుకుంటారు. మర్నాడు దీపావళి జరుపుకొంటారు.
దీపేన సాధ్యతే సర్వం
దీపానికి ఉన్న శక్తి అనంతమైనది. ఒక దీపం అనేక దీపాలను వెలిగిస్తుంది. అఖండమైన వెలుగులను నింపుతుంది. ‘దీపేన సాధ్యతే సర్వం’ అన్నట్లుగా దీపసాధనతో సమస్త కామ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. ముఖ్యంగా దీపావళి నాటి దీపకాంతుల సంబరాలలో అణువణువూ దేవీతత్త్వం గోచరిస్తుంది. ‘యాదేవీ సర్వభూతేషు కాంతి రూపేణ’ సంస్థితా అన్నట్లుగా ప్రతిప్రాణిలో మాత్రమే కాక ప్రతి దీపంలోనూ దీపదేవిగా, దీపలక్ష్మిగా.. దేవి భాసిల్లుతూ ఉంటుంది.
లోకైక దీపాంకురాం
నింగిలో ఉండే చంద్రదీపపు కాంతి నేల మీదికి రావడం వల్ల ఆకాశంలో అమావాస్య ఏర్పడిందా అన్నరీతిగా దీపావళి ప్రభవిస్తుంటుంది. నింగిలో కారుచీకట్లున్నా.. దీపకాంతులు భువిపై నిండుపున్నమిని తీసుకువస్తాయి. దీపాన్ని సర్వదేవతాత్మకంగా భావించినప్పటికీ లక్ష్మీరూపంగా పూజించడం ఆనవాయితీగా వస్తున్నది. లక్ష్మీదేవి స్తుతిలో కూడా అమ్మవారిని ‘లోకైక దీపాంకురాం’ అన్నారు. ఈ లోకానికి ఏకైక దీపంగా లక్ష్మీదేవిని కీర్తించారు. అందుకని దీపావళి నాడు దీపలక్ష్మిగా అమ్మవారిని అర్చిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దీపాన్ని దేవతా రూపంగా పూజించడం దీపారాధనలో భాగంగా పేర్కొన్నారు పెద్దలు. తమ తమ ఆసక్తి, భక్తిని అనుసరించి ఏ మార్గంలో దీపారాధన చేసినా చెడు కర్మలను తొలగించుకొని తరించవచ్చు.
గురుదేవ మహాదీపం
కంటికి కనిపించే చీకట్లను దీపాలను వెలిగించి తొలగించుకోవచ్చు. కానీ, కంటికి కనిపించని చీకట్లను తొలగించుకోవడం ఎలా? ముఖ్యంగా కలియుగంలో అజ్ఞానం, తామస లక్షణం వంటి చీకట్లతో నిండిన మనసులో వెలుగులు నింపడం కోసం మహాదీపాన్ని ఆశ్రయించమని దేవతలు సూచించారు. ఆ దీపమే గురుదీపం. ‘గుకారశ్చాంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్’- గు అంటే చీకటి, రు అంటే దానిని అడ్డగించేవారు గురువు అని అర్థం. హలం పట్టుకున్నా, కలం పట్టుకున్నా గురువు మార్గదర్శనం తప్పనిసరి. అందులోనూ ఆధ్యాత్మిక మార్గంలో గురుకృప లేకపోతే దేవతానుగ్రహం లభించదనే అంశం గురుచరిత్ర తెలియజేస్తున్నది. అందుకే దీపాన్ని వెలిగించే సమయంలో మన జీవితంలో తొలిసారి వెలుగులు తీసుకువచ్చిన తల్లి, జ్ఞానదీపాన్ని వెలిగించిన గురువును తలుచుకుని తర్వాత ఇష్టదైవాన్ని స్మరించాలి. దీపావళి ఆనందాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపే పండుగ. రాత్రి తర్వాత పగలు, చీకటి తర్వాత వెలుగు, కష్టం తర్వాత సుఖం, దుఃఖం తర్వాత సంతోషం వస్తాయని తెలియజేసే దివ్యరవళి దీపావళి.
మాతాజీ శ్రీ రమ్యానంద
భారతీ స్వామిని