సాధారణంగా కార్తిక మాసంలో 365 వత్తులు వెలిగిస్తారు అయితే, ఇటీవల లక్ష వత్తులు పేరుతో రెడీమేడ్గా దొరుకుతున్న ఒత్తులను వెలిగిస్తున్నారు! ఇలా ఒకేసారి లక్ష వత్తులను వెలిగించవచ్చా?- బండపల్లి శ్రీనిధి, నేరేడ్మెట్
ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే శయన ఏకాదశి నుంచి కార్తిక మాసం శుక్ల పక్షంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఆ సమయాన్నే చాతుర్మాస్యాలని అంటారు. పవిత్రమైన కార్తికమాసంలో యోగనిద్ర నుంచి మేల్కొనే వైకుంఠవాసిని ప్రార్థిస్తూ దీపారాధనలు చేయాలని విష్ణుపురాణం చెబుతున్నది. కార్తిక మాసంలో 365 వత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. దీనివల్ల ఏడాదంతా దీపాలు వెలిగించిన ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు. అయితే, లక్ష వత్తులు వెలిగించే ఆనవాయితీ కూడా ఈ నెలలో కనిపిస్తుంది. వీటిని అప్పటికప్పుడు దుకాణంలో కొనుగోలు చేసి వెలిగించడం సరికాదు! చాతుర్మాస్యాల్లో (నాలుగు నెలల్లో) ప్రతిరోజూ హరినామ స్మరణ చేస్తూ పత్తితో స్వయంగా వత్తులు చేయాలి. అలా సిద్ధం చేసిన లక్ష వత్తులను కార్తిక శుక్ల ద్వాదశి నాడు గానీ, పౌర్ణమి నాడు గానీ స్వయంగా వెలిగించాల్సి ఉంటుంది. స్త్రీలు రుతు సమయంలో, ఇతర సందర్భాల్లో తెలిసీ తెలియక చేసిన దోషాల నుంచి విముక్తి పొందడానికి లక్షవత్తుల నోము తోడ్పడుతుందని పార్వతీదేవి అడిగిన సందేహానికి పరమేశ్వరుడు సమాధానంగా చెప్పినట్లు స్కాందపురాణ కథనం.
-డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370