ఓ ఉదయాన భక్తుడు ఒక ఆశ్రమంలోని గురువును కలవడానికి వెళ్లాడు. తనకొక సమస్య ఉందని, ప్రతి క్షణం అది గుర్తుకొచ్చి వేధిస్తున్నదని బాధపడ్డాడు. ఆ భక్తుడిని అనునయిస్తూ, ఆశ్రమంలో రెండు రోజులు ఉండమన్నాడు. భక్తుడు అంగీకరించాడు. అతనికి ఓ చక్కని గది ఏర్పాటు చేయమన్నాడు. అక్కడికే ఆహారం పంపమని నిర్వాహకులను ఆజ్ఞాపించాడు గురువు. వెంటనే ఆశ్రమంలోని
గుమ్మడితోట మధ్యలో భక్తుడికి ప్రత్యేకగదిని ఏర్పాటుచేశారు. మూడుపూటలా గదికే ఆహారం పంపించారు. గురువు తనను ముఖ్యమైన వ్యక్తిగా గుర్తించినందుకు ఆనందించాడు భక్తుడు. ఆశ్రమ దినచర్యలో భాగంగా యోగా, ప్రాణాయామం, సత్సంగాలు పూర్తయ్యేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. మొదటిరోజు రాత్రి భోజనం కాగానే భక్తుడు తన వస్తువులన్నీ సర్దుకొని గురువు దగ్గరికి వచ్చాడు. ఇక తాను ఇంటికి వెళ్లిపోతానని అడిగాడు. ‘రెండు రోజులు ఉంటానన్నావు కదా! ఎందుకు వెళ్లాలని అనుకుంటున్నావు?’ అని అడిగాడు గురువు. ‘ఉదయం గుమ్మడికాయ సాంబారు చేశారు, మధ్యాహ్నం గుమ్మడికాయతో పప్పుచారు, పచ్చడి వడ్డించారు. రాత్రి మళ్లీ గుమ్మడికాయ పులుసు చేశారు’ అని వాపోయాడు. ‘గుమ్మడి ఆరోగ్యానికి మంచిదే కదా!’ అన్నాడు గురువు. ‘ఎంత మంచిదైతే మాత్రం పూటపూటకీ గుమ్మడి వంటలే ఎలా తినేది? సాయంత్రం అల్పాహారంగా కూడా గుమ్మడి గింజలు, గుమ్మడి హల్వా పెట్టారు’ అని బాధగా అన్నాడు. గురువు చిన్నగా నవ్వి ‘ఒకే రకం వంటను మళ్లీమళ్లీ తినడానికి ఇష్టపడటం లేదు కదా! మరి ఒకే సమస్యను పదే పదే తలచుకొని ఎందుకు బాధపడతావు?’ అని ఎదురు ప్రశ్న వేశాడు.
‘నిజమే, ఒకే సమస్యను పట్టుకుని ఎందుకు వేలాడాలి? ఏ సమస్యా ఎల్లకాలం ఉండదు కదా! ఎంత పెద్ద గాయాన్ని అయినా మాన్పించే శక్తి కాలానికి ఉంటుంది’ అని అర్థం చేసుకుని గురువుకు నమస్కరించి అక్కడి నుంచి కదిలాడు భక్తుడు.
-ఆర్.సి.కృష్ణస్వామిరాజు , 93936 62821