తినే ఆహారం.. పీల్చే గాలి.. తాగే నీరు.. నివసించే నేల.. సకలం భగవంతుడి సృష్టే! మనిషి మనుగడలో అడుగడుగునా దైవీశక్తి అండగా ఉంటుంది. అణువణువులోనూ నిండిన పరమాత్మ చైతన్యాన్ని అనుక్షణం గుర్తు చేసుకోవడం మన విధి. ఆ శక్తిని గౌరవించడం కృతజ్ఞతా పూర్వకసంస్కారం. అందుకే నిద్ర లేచింది మొదలు తిరిగి నిద్రపోయే వరకు ప్రతి అడుగులోనూ ఓ శ్లోకం చదవాలంటూ నిర్దేశిస్తాయి శాస్ర్తాలు.
అసలు ఇన్నేసి శ్లోకాలు ఎందుకు చదవాలి? ఏదో ఒకటి చదివితే సరిపోదా అంటే, నిజమే… సరిపోదు. అనంతమైన విశ్వంలో నిబిడీకృతమైన ఉన్న పరమాత్మ చైతన్యాన్ని ఎంతని స్తోత్రం చేయగలం? ఆ స్వామి మనకు ఇచ్చిన లెక్కలేనన్ని వరాలకు ఏమని కృతజ్ఞత చెప్పగలం? మనం వేసే ప్రతి అడుగూ, మాట్లాడే ప్రతి మాటా, తినే ప్రతి మెతుకూ, చివరికి తీసుకునే శ్వాస కూడా పరమాత్మ మనకు ఇచ్చిన వరాలే. పరమాత్మ శక్తి మనకు తోడు లేకపోతే ఒక్క అడుగూ వేయలేం. అందుకే, అనుక్షణం దైవాన్ని తలుచుకుంటూ, మనల్ని మనమే ఉద్ధరించుకునే మార్గం.. శ్లోకంతో స్మరించుకోవడం. స్తోత్రంతో అర్చించడం.
మనసు నిరంతరం ఏదో ఒకటి చింతించకుండా ఉండదు. అది దాని స్వభావం. పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది. అది ప్రకృతి నియమం. అదేవిధంగా, మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే అందులో చెడు ఆలోచనలు చేరుకుంటాయి. అనేక విషయ వాసనలతో నిండిపోతుంది. అందుకే, మెలకువగా ఉండే ప్రతి క్షణాన్నీ దైవనామ స్మరణతో నింపాలి. స్తోత్ర పారాయణం ద్వారా మనసును అంతర్ముఖం చేసుకోగలిగితే, విషయ చింతన తగ్గుతుంది. పరమాత్మ సన్నిధికి మార్గం సుగమం అవుతుంది. మనం చదివే ప్రతి శ్లోకానికీ, చేసే ప్రతి స్తోత్రానికి అంతిమ
పరమార్థం ఇదే.
మహాభారత యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు మొదలైన వీరులు అర్జునుడిపై వేసిన బాణాలు అత్యంత శక్తిమంతమైనవి. కేవలం శ్రీకృష్ణుడి అనుగ్రహం కారణంగా వాటి శక్తి పూర్తిస్థాయిలో పనిచేయలేదు. ఈ రహస్యం తెలియక శత్రుపరాజయం అంతా తన శక్తిసామర్థ్యాల వల్లే జరిగిందని అర్జునుడు భావిస్తాడు. యుద్ధం చివరి రోజు సాయంత్రం.. కురుక్షేత్రం నుంచి అర్జునుడు శిబిరానికి బయల్దేరుతాడు. అల్లంతదూరంలో శిబిరం ఉందనగా, కృష్ణుడు రథాన్ని ఆపి, అర్జునుడిని అందులోంచి దిగమంటాడు. పరమాత్మ మాట కాదనలేక రథం దిగుతాడు అర్జునుడు. ఆ వెంటనే కృష్ణుడు కూడా రథం దిగుతాడు. ఇద్దరూ కొద్ది దూరం నడవగానే, భయంకరమైన శబ్దం చేస్తూ రథం ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగి రథం దగ్ధమైపోతుంది. ఇది చూసి అర్జునుడు భయంతో కంపించిపోతాడు. ఎందుకిలా జరిగిందో అర్థం చేసుకోలేకపోతాడు. అప్పుడు, కృష్ణుడు చిరునవ్వులు చిందిస్తూ… ‘అర్జునా! ఇంతకాలం నేను రథంలో ఉన్న కారణంగా శత్రువీరులు నీపై ప్రయోగించిన అస్త్రశస్ర్తాలు నిన్నేమీ చేయలేకపోయాయి. వాటి శక్తి ఈ రథాన్ని ఆవహించి, నా కారణంగా అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు నేను రథాన్ని విడిచిపెట్టాను. అస్ర్తాలు వాటి పని అవి నిర్వహించాయి’ అంటాడు. భగవానుడి శక్తికి మరోసారి నివ్వెరపోతాడు అర్జునుడు.
మన జీవన రథానిదీ ఇదే కథ. భగవంతుడి శక్తి మనల్ని ఆవహించినంత కాలం ఏ ప్రారబ్ధ కర్మా మనల్ని బాధించదు. పాక్షికంగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయే కానీ, పూర్తిగా నాశనం చేయవు. అదే భగవచ్ఛక్తి మనకు దూరమైతే… విషయవాంఛలు, ప్రారబ్ధకర్మల విషాగ్ని మనం దగ్ధం చేయకతప్పదు అనే సందేశాన్ని ఈ కథ అందిస్తున్నది. అందుకే, నిత్యజీవితంలోని ప్రతి అడుగులో ఫలానా శ్లోకం చదవమంటూ, మనలో అనుక్షణం దైవికమైన శక్తిని వృద్ధి చెందే ఉపాయాన్ని సూచించాయి శాస్ర్తాలు.
దైవారాధన, శక్తి ఉపాసన అంటే… పెద్దపెద్ద మంత్రాలు మాత్రమే చదవాల్సిన అవసరం లేదు. ‘అమంత్రం అక్షరం నాస్తి- మంత్రం కాని అక్షరం లేద’ని చెబుతాయి శాస్ర్తాలు. మన వాక్కు ద్వారా బయటికి వచ్చే శబ్దంలోని శక్తిని గుర్తించి, ఉపాసించగలిగితే అంతకుమించిన తపస్సు మరొకటి ఉండదు. అందుకనే, ప్రతి మనిషీ ఉపాసన చేసేందుకు వీలుగా నిత్యజీవితంలోని ప్రతి సందర్భంలోనూ దైవప్రార్థన పేరుతో శబ్ద బ్రహ్మోపాసన చేసేలా వీలు కల్పించారు సనాతన రుషులు.
పిడుగు పడుతున్న వేళ..
అర్జునః ఫల్గుణః పార్థ కిరీటి శ్వేతవాహనః
బీభత్స ర్విజయః కృష్ణః సవ్యసాచీ ధనుంజయః॥
అర్జునుడి పది పేర్లు ఈ శ్లోకంలో ఉన్నాయి. శ్లోకంలో చెప్పినవి కేవలం పది పేర్లు కాదు. అవి పదిరకాలైన శక్తులు. ఆ శక్తులు అర్జునుడికి ఉన్నాయి కాబట్టే, ఆ పేర్లతో ప్రసిద్ధి పొందాడు. అర్జునుడు నరుడికి ప్రతీక. అంటే, ప్రతి మనిషీ ఈ పది రకాలైన శక్తుల్నీ జాగృతం చేసుకోవాలన్న సూచన చేస్తుందీ శ్లోకం. అప్పుడు ఏ పిడుగూ మనిషిని ఏమీ చేయలేదు అని విశ్వాసం.
ప్రయాణ సమయంలో..
యశ్శివోనామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం॥
మనం ఏది తలిస్తే అదే జరుగుతుంది అంటారు పెద్దలు. తథాస్తు దేవతలు ఉంటారని చెబుతారు ఇంకొందరు. ఏది ఏమైనప్పటికీ, మనలో కలిగే భావనలే మనల్ని నడిపిస్తాయి. అందుకు అనుగుణంగా ఫలితాలను ఇస్తాయనేది సుస్పష్టం. అందుకే, ఏ పని ప్రారంభించినా తొలుత మంగళం జరగాలని కోరుకుంటూ, దైవాన్ని ప్రార్థించే శ్లోకం ఇది. ‘శివుడు, శక్తి నా ప్రయాణంలో నన్ను ఆవహించి, అన్నిటా నాకు విజయాన్ని కలిగించాల’ని శ్లోక భావం.
ఉదయం నిద్రలేవగానే…
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనమ్
త్రిశక్తులూ మన చేతిలోనే ఉంటాయి. ఆ శక్తుల్ని గ్రహించి, గమనించుకోవాలనే సందేశాన్ని అందిస్తుందీ శ్లోకం. మనలో ఉండే ప్రాణశక్తి, ఉపాసన ద్వారా చైతన్యశక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. అటువంటి శక్తి ప్రచోదనం ద్వారా, పరాశక్తిని ఉపాసన చేయడానికి పునాది ఈ శ్లోకంతోనే మొదలవుతుంది.
పాదాన్ని నేల మీద ఉంచడానికి..
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే
విష్ణుపత్నీ సమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే॥
కోటానుకోట్ల మానవ సమూహాన్ని భరిస్తున్న భూమి పట్ల మనం చూపాల్సిన కృతజ్ఞతను ఈ శ్లోకం ప్రకటిస్తుంది. అడుగులతో తొక్కి బాధించినా, మన జీవనానికి అవసరమైన అన్నం సహా అనేక ఓషధుల్నీ తన నుంచి ఆవిర్భవింపజేస్తుంది భూమాత. ఆ తల్లిని మించిన శాంతమూర్తి సృష్టిలో మరెవరూ లేరు. ‘నీరు, పర్వతాలతో నిండిన భూమాతా! నా పాదాలతో తొక్కుతున్న పాపానికి మన్నించమ’ని పై శ్లోకం ద్వారా వేడుకోవాలి. మాతృమూర్తి పట్ల, మాతృభూమి పట్ల మన కర్తవ్యం, కృతజ్ఞత.. నిద్రలేవడంతోనే గుర్తు చేస్తుందీ శ్లోకం.
స్నానం చేసేటప్పుడు
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు॥
భౌతికంగా కంటికి కనిపించే అన్ని అశౌచాలను ప్రక్షాళన చేసే సామర్థ్యం కేవలం నీటికి మాత్రమే ఉంది. దీంతోపాటు, కంటికి కనిపించని పాపాన్ని పోగొట్టుకోవడానికి చేసే ప్రయత్నం కూడా నీటితో శుద్ధి చేసుకున్న తర్వాతే మొదలవుతుంది. బాహ్యంగానూ, అంతరంగంలోనూ స్ఫటికంలా స్వచ్ఛంగా ఉండే అవకాశం కల్పించే జలశక్తి మనల్ని ఆవహించేందుకు చేసే ఉపాసన విధిని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. సమస్త నదుల శక్తిని నీటిలో ఆవాహన చేయడం వల్ల ఆ పుణ్యతీర్థాల్లో స్నానం ఆచరించిన ఫలితం లభిస్తుంది.
భోజనానికి ముందు..
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం॥
జఠరాగ్ని సవ్యంగా ఉన్నప్పుడే మనం తీసుకునే ఆహారం జీర్ణమై, శక్తిగా మారుతుంది. లేకపోతే అధికంగా నెయ్యి పోసిన హోమగుండం మాదిరిగా చప్పబడిపోతుంది. రుషులు చేసిన అసంఖ్యాక యజ్ఞాల్లో నెయ్యి అధికంగా తీసుకున్న కారణంగా అగ్నిదేవుడికే జఠరాగ్ని సమస్య వచ్చిందట. కృష్ణార్జునుల సాయంతో ఖాండవ వనాన్ని దహించి, తన బాధ తీర్చుకున్నాడు అగ్ని. మనదీ అదే పరిస్థితి. మనలో జఠరాగ్ని రూపంలో ఉండే శక్తిని ఉద్దీపనం చేసుకోవడం, మనలోనే ఉండే ఆత్మారాముడికి నివేదన చేయడం ఈ శ్లోకం ఉద్దేశం.
నిద్రకు ఉపక్రమిస్తూ..
రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి॥
ఐదుగురు దివ్య పురుషుల స్మరణతో సాగుతుందీ శ్లోకం. ఈ ఐదుగురు పురుషులు ఐదు శక్తులకు ప్రతీక. జాగ్రదవస్థ నుంచి స్వప్న, సుషుప్తిలోకి జారుకునే మనిషి ఈ శక్తుల్ని చైతన్యవంతం చేసుకోవాలి. అప్పుడే దుస్వప్నాలు రావు. కల అంటే మనసు పొందే విరుద్ధమైన భావన. తనకు తెలియని, తాను అనుకోని, తాను ఊహించని స్థితికి మనసు చేరుకుంటుంది. రకరకాల ఆలోచనలు చేస్తుంది. అవే కలలుగా కలవరపెడతాయి. పై శ్లోకంలో చెప్పుకొన్న ఐదు శక్తుల్ని మనిషి వృద్ధి చేసుకుంటే దుస్వప్నాల వల్ల కలిగే విపరీత ఫలితాలు అంటుకోవు. అంటే, ఏ విధమైన విపరీత భావన మనసులోకి ప్రవేశించదని అర్థం. ఏ వికల్పానికి లోనుకాని మనసు పరమాత్మకు వేదికగా నిలుస్తుంది. అంతిమంగా హృదయాకాశంలో కొలువైన దైవాన్ని దర్శించుకునే పూర్ణత్వం మనిషికి సిద్ధిస్తుంది. నిత్య ప్రార్థన శ్లోకాల రహస్యం ఇదే.
సూర్య నమస్కారం చేస్తూ…
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్
సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తించ దివాకరమ్
స్నానం పూర్తి కాగానే, ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తిని చూస్తూ, ధ్యానించాల్సిన శ్లోకం ఇది. నిద్రలేవగానే చేసే ప్రార్థన ద్వారా త్రిశక్తులు మనల్ని ఆవహిస్తే, సూర్యోపాసన ద్వారా త్రిమూర్తులు మనకు ప్రసన్నులవుతారు. ఈవిధంగా త్రిమూర్తి, త్రిశక్తి ఉపాసన చేసే సులువైన మార్గం మనకు చూపించారు పూర్వికులు. ఇది, ఆధ్యాత్మిక కోణమైతే, భూమ్మీద జీవకళతో, ప్రాణశక్తితో ఉండే ప్రతి ప్రాణికి మూలాధారం సూర్యనారాయణుడు. సూర్యరశ్మి పడకపోతే ప్రాణశక్తి ఉండదు. అటువంటి ప్రాణశక్తిని ఉద్దీపింపజేసుకునే మార్గమే శ్లోకరూపంలో ఉండే ఈ ఉపాసన మార్గం.
ఔషధం తీసుకునేటప్పుడు..
అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్
నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్
శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే
ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః॥
అనారోగ్య నివారణ కోసం మందులు వేసుకోవటం సర్వసాధారణమైన విషయం. కానీ, మందులు వేసుకునేటప్పుడు కూడా శ్లోకం ఏమిటనే సందేహం వస్తుంది. ఇందుకు సమాధానం రుద్ర నమకం చెబుతుంది. ‘ఓషధీనాం పతయే నమో నమః – ఓషధుల్లో ఉండే ఓషధీ గుణాలకు అధిపతి అయినవాడు / ఓషధీ గుణం కలిగించేవాడైన రుద్రుడికి నమస్కారం’ అని దీని భావం. అంటే, మనం తీసుకునే ఔషధాల్లో ఉండే ఓషధీగుణాన్ని వృద్ధి చెందించేవాడు పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహమే ఓషధీశక్తి రూపంలో, మాత్రగా మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. పరమేశ్వరుడిది ఈ శక్తి అని పై శ్లోకం చెబుతుంది. ఇందులో నారాయణుడి నామ స్మరణ చేయడం… మనలో అద్వైత భావ ప్రచోదనకు శిలాన్యాసం చేయడమే తప్ప మరొకటి కాదు.
-డా॥ కప్పగంతు రామకృష్ణ