కార్తిక మాసంలో వనభోజనాలు ఉసిరి చెట్టు కింద చేయాలంటారు ఎందుకు?- రేపాక కృష్ణ. సిరిసిల్ల
‘కార్తిక మాసంలో వనభోజనాలు చేసిన వారు సకల పాపాలనుంచి విముక్తి పొంది, విష్ణులోకాన్ని పొందుతారు’ అని స్కాందపురాణం చెబుతున్నది. అనేక ఔషధ గుణాలను కలిగి ఉండే ఉసిరి చెట్టునే ధాత్రీ వృక్షమని అంటారు. దామోదరుడైన విష్ణుమూర్తికి ఇది ఎంతో ప్రీతికరమైనది. ఈ చెట్టును భూదేవి స్వరూపంగా కూడా కొలుస్తారు. దేవదానవుల యుద్ధంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడి, వాటినుంచి ఉసిరి చెట్టు పుట్టిందని పురాణాల ద్వారా తెలుస్తున్నది. కార్తిక మాసంలో లక్ష్మీదేవి, నారాయణుడు ఉసిరి చెట్టును ఆశ్రయించి ఉంటారని విష్ణుపురాణ కథనం. ఈ మాసంలో ఉసిరి చెట్టును పూజించి దాని నీడలో వనభోజనాలు చేయడం ద్వారా అశ్వమేధ యాగం చేసిన ఫలితంతోపాటు క్షేత్రాలన్నిటిలో విష్ణుమూర్తిని అర్చించిన ఫలం దక్కుతుందని కార్తిక పురాణం చెబుతున్నది. వనభోజనానికి ముందు ఉసిరిచెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్నిగానీ, విగ్రహాన్ని గానీ, సాలగ్రామాన్ని గానీ ఉంచి ఉసిరి పత్రితో పూజించాలి. ఎనిమిది దిక్కుల్లో దీపాలను వెలిగించి, చెట్టు చుట్టూ ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి. తర్వాత చెట్టునీడలో వనభోజనాలు చేయాలి.
ఉసిరి అనేక ఔషధ గుణాలను కలిగిన వృక్షం. ఉసిరి ఉత్పత్తులు వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయని చరక సంహిత చెబుతున్నది. అపర సంజీవనిగా పేరున్న ఉసిరి జీర్ణశక్తిని పెంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఉసిరి చెంత వనభోజనాల వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అంతేకాదు, పదిమందితో కలిసి చేసే వనభోజనాలు మనిషిలో సామాజిక స్పృహను పెంచుతాయి.
-డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370