(నేటి అలంకారం: భవానీదేవి)
భవానీ భావనాగమ్యా భవారణ్య కుఠారికా
భద్రప్రియా భద్రమూర్తిః భక్తసౌభాగ్యదాయినీ॥
ఇవి శరన్నవరాత్రి రోజులు. పవిత్రమైన దేవీ నవరాత్రుల సందర్భంగా లలితా సహస్ర నామాలతో ఆ మాతృశక్తిని అర్చిస్తుంటాం. లలితా సహస్రనామాలన్నీ అమ్మవారి అపారశక్తి తత్తాన్ని వ్యక్తపరుస్తాయి. అమ్మవారిని ‘భవానీ’మాతగా ధ్యానిస్తూ చెప్పుకొనే పైశ్లోకంలో ప్రతీ మాట అపారమైన మాతృశక్తిని వ్యక్తం చేస్తున్నదే. దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరించి అర్చించడం ఆనవాయితీ. అయితే, ఆయా పురాణాలను అనుసరించి ఈ అలంకారాలు ఉంటాయి. అన్ని రూపాలూ అమ్మవారివే కాబట్టి, ఏ రూపంలో కొలిచినా ఆమె కటాక్షిస్తుంది. మానవ జీవితానికి శక్తితోపాటు భద్రత కూడా అవసరం. ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత, కుటుంబ భద్రత ఇలా ప్రతి విషయంలోనూ భద్రత ముఖ్యం. ఈ భద్రతను కలుగజేసే శక్తి భవానీదేవి. అదే దృష్టితో పలు ఆలయాల్లో అమ్మవారిని నవరాత్రుల్లో ఆరోనాడు భవానీదేవిగా అలంకరించి సేవిస్తారు.
‘భవాని’ శబ్దం భవుడికి సంబంధించింది. భవుడు అంటే శివుడు. అంటే అమ్మవారు సాక్షాత్తు శివశక్తే! ఏకాదశ రుద్ర రూపాల్లోని భవుడు జలతత్తానికి ప్రతీక. జలాన్ని ప్రవహింపజేసే శక్తి భవాని. భవారణ్యాన్ని ఖండించే కుఠారంగా (గొడ్డలిగా) లలితా సహస్రనామం ఆమెను కీర్తిస్తున్నది. భవం అంటే సంసారం అని అర్థం. సంసారం అరణ్యం వంటిది! అది మనిషలోని తాపత్రయాలకు మూలం. ఇవి మనిషిలోని భక్తిని తొలగించే ప్రమాదం ఉంటుంది. ఈ సంసార తాపత్రయాలు నిర్మూలించే శక్తి భవానీదేవి. అలాంటి అమ్మ భక్తులకు గొప్ప సౌభాగ్యాలను సమకూర్చే భద్రమూర్తి. మన దృష్టిలో భాగ్యం అంటే కేవలం ధనధాన్యాలు, భౌతిక అవసరాలు మాత్రమే అనుకుంటాం. మనసుకు, ఆరోగ్యానికి, ఆలోచనలకు కూడా భాగ్యం కావాలి. అటువంటి మహాభాగ్యాన్ని ప్రసాదించే భవానీమాతను మనసారా పూజిద్దాం.
– గన్నమరాజు గిరిజామనోహరబాబు