పాండవుల తరఫున రాయబారిగా హస్తినకు వచ్చాడు కృష్ణుడు. పాండవులకు అర్ధ రాజ్యం ఇవ్వమనీ, కానిపక్షంలో ఐదుగురు అన్నదమ్ములు తమకు ఐదు ఊళ్లు ఇచ్చినా చాలన్నారనీ ధృతరాష్ర్టుడిని కోరుతాడు. దుర్యోధనుడు ససేమిరా అనడంతో ధృతరాష్ర్టుడు మిన్నకుండిపోతాడు. యుద్ధం అనివార్యమైతే జరగబోయే అనర్థాలను వివరిస్తాడు శ్రీకృష్ణుడు. ఎవరెన్ని చెప్పినా దుర్యోధనుడు పట్టువీడకపోవడంతో యుద్ధం తప్పదన్న నిశ్చయానికి వస్తారంతా! శ్రీకృష్ణుడు వెళ్లిపోయిన తర్వాత ధృతరాష్ర్టుడికి భయం ఆవహిస్తుంది. యుద్ధం ఎటు దారితీస్తుందో అని లోలోపల మథనపడుతుంటాడు. ఆ సమయంలో సోదరుడైన విదురుడితో మాట్లాడితే తనకు ఊరట లభించవచ్చని అతణ్ని తన మందిరానికి రమ్మని పిలిపిస్తాడు.
కంటిమీదికి కునుకు రాక కకావికలమవుతున్న ధృతరాష్ర్టుడిని చూసి విదురుడు.. ‘మహారాజా! మీకు నిద్రపట్టడం లేదంటే విచిత్రంగా ఉంది. బలవంతుడితో విరోధం తెచ్చుకున్న బలహీనులకు, పరుల సొమ్ము దోచుకున్నవారికి, కామోద్రేకాలను అదుపు చేసుకోలేని వారికి, దొంగలకు మాత్రమే రాత్రి నిద్రపట్టదని శాస్త్ర వచనం. మీరు అలాంటి వ్యక్తి కాదని తెలుసు. మరెందుకు నిద్రలేమితో బాధపడుతున్నారు?’ అంటాడు.
విదురుడు నాడు ధృతరాష్ర్టుడిని అడిగిన ప్రశ్న.. ప్రతి ఒక్కరు ఎవరికి వారు వేసుకోవాలి. ప్రతి రాత్రి నిద్రకు ఉపక్రమించినప్పుడు గుండెల మీద చెయ్యి వేసుకున్నప్పుడు సమాధానం లభిస్తుంది. అంతరాత్మ చెప్పే సమాధానం అది. ఎవరికి వాళ్లు చెప్పుకొనే సమాధానం. ఆ జవాబును స్వీకరించగలిగిన వ్యక్తికి నిద్రాయోగం తప్పక కలుగుతుంది. అదే జవాబు గుండెలో శూలంలా గుచ్చుకుందంటే ఏదో పొరపాటు చేసినట్టే! ఆ జవాబు చెప్పేది మరెవరో కాదు. అంతరాత్మే! అదిచ్చే జవాబు ఆధారంగా ఎవరికి వాళ్లు తమ తమ వ్యక్తిత్వాలను సులభంగా అంచనా వేసుకోవచ్చు. ఆ జవాబును స్వీకరించే ఆత్మబలం కూడా ఉండాలి. అలా కాకుండా, అంతరాత్మను కూడా మభ్యపెట్టి సమాధానాన్ని దాటవేస్తూ పోతే, చివరికి ఆ వ్యక్తి పతనమవడం ఖాయం.
ఈ అంతరాత్మకు సంజాయిషీ ఇచ్చుకోలేక, అది చెప్పే సమాధానాన్ని స్వీకరించలేక అధోగతిపాలైన ఎందరో పురాణాల్లో మనకు కనిపిస్తారు. తపోధనుడైన రావణుడు అలాగే అంతరాత్మను చంపుకొన్నాడు. తనను తోకకు చుట్టి, సముద్రాల్లో ముంచి, ముప్పుతిప్పలు పెట్టిన వానరరాజు వాలిని ఒక్కవేటున సంహరించిన వీరుడు రాముడే అని తెలిసినా అతనితో వైరం కోరి తెచ్చుకున్నాడు. పైగా, రాముడి కన్నా తానే అధికుడనని అంతరాత్మకు సర్దిచెప్పుకొన్నాడు. సొంత తమ్ముడు విభీషణుడి హిత వచనాలు పెడచెవిన పెట్టాడు. యుద్ధం విరమించమని కుంభకర్ణుడు హెచ్చరించినా లక్ష్యపెట్టలేదు. రాముడి తేజస్సు ముందు తాను నిలబడనని అంతరాత్మ ఘోషిస్తుంటే నిద్రలేని రాత్రులు గడిపాడు. తన తప్పిదాన్ని బలవంతంగా కప్పిపుచ్చుకున్నాడు. చివరికి రాముడి చేతిలోనే హతమయ్యాడు.
అంతరాత్మ చెప్పేమాట ఆలకిస్తే, చాలా సమస్యలకు పరిష్కారం లభించినట్టే! ఏది తప్పు, ఏది ఒప్పు నిర్ధారించగల శక్తి దానికే ఉంది. ఎవరో చెప్పాల్సిన పనిలేదు. ఇంకెవరో ఉపదేశించాల్సిన అవసరమూ లేదు. ఎవరికి వారు సమాధానం చెప్పుకోగలగాలి. అప్పుడు, చేసిన తప్పు తెలుసుకొని, పశ్చాత్తాపం చెందే మహదవకాశం లభిస్తుంది. అవకాశం ఉంటే ఆ తప్పును దిద్దుకునే పరిస్థితులూ ఏర్పడతాయి. వాటిని పునరావృతం చేయకుండా ఉండే బుద్ధి కలుగుతుంది. ‘ద్వేషాన్ని ద్వేషంతో జయించలేం. క్రోధాన్ని శాంతంతో, దుష్టులను మంచిమాటలతో, లోభాన్ని దానగుణంతో, అసత్యాన్ని సత్యంతో జయించాల’న్న విదురుడి మాటలు అక్షర సత్యాలు. ఒక వ్యక్తిలో ఉన్న దుర్గుణాలు ఎదుటివాళ్ల కన్నా, ఆ వ్యక్తికే మరింత బాగా తెలుస్తాయి. ఆ నిజాన్ని ఒప్పుకోలేక తప్పుదారిలోనే ప్రయాణిస్తూ ఆత్మవంచన చేసుకుంటారు చాలామంది. కానీ, ఆ అంతర్మథనంలో వెలువడిన కాలకూటాన్ని పక్కకునెట్టి అమృతాన్ని ఆస్వాదించగలిగితే నిద్రలేని రాత్రులుండవు.
-టి.వి.ఫణీంద్ర కుమార్