రక్షాబంధన్ ప్రాముఖ్యాన్ని తెలియజేయండి?- జి.జనార్దన్ యాదవ్, నిజామాబాద్
శ్రావణ పౌర్ణమిని రక్షాబంధనంగా, రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ పండుగ వెనుక పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. పురాణాల ప్రకారం.. ఒకసారి దేవతలకు, రాక్షసులకు పుష్కర కాలం యుద్ధం జరుగుతుంది. ఈ సమరంలో దేవతల గెలుపు కోరి శ్రావణ పౌర్ణమినాడు లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి.. శచీదేవి తన భర్త దేవేంద్రుడికి రాఖీ కడుతుంది. ఆ రక్ష ప్రభావంతో ఇంద్రుడు యుద్ధంలో గెలుస్తాడు. ద్వాపర యుగంలో ఒక సందర్భంలో శ్రీకృష్ణుడి చేతికి గాయమైనప్పుడు ద్రౌపదీదేవి తన చీర చెంగును చింపి రక్ష కడుతుంది. ఆ రక్షే తర్వాత వస్ర్తాపహరణ ఘట్టంలో ద్రౌపదికి రక్షణగా నిలిచిందన్న కథ కూడా ప్రచారంలో ఉంది. ఇక చారిత్రక అంశాలను పరిశీలిస్తే.. గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ భార్య రోక్సానా తన భర్త మేలు కోరి భారత ఉపఖండం వాయవ్య భాగాన్ని పాలిస్తున్న రాజు పురుషోత్తముడికి రాఖీ కడుతుంది. సోదరి సౌభాగ్యం కోరి పురుషోత్తముడు అలెగ్జాండర్ను ప్రాణాలతో విడిచిపెట్టాడని చెబుతారు. ఇలా రక్షాబంధనం వెనుక అనేకానేక కథలు ప్రచారంలో ఉన్నాయి. లౌకికంగా ఆలోచిస్తే.. సోదరి, సోదరులు ఒకరి మేలు మరొకరు కోరుకునే సందర్భం ఇది. తమకు అండగా సోదరులు ఉన్నారన్న ధీమా ఆడపిల్లలకు కలిగించే పండుగ రాఖీ పౌర్ణమి. తోడబుట్టిన వారికన్నా ఆత్మీయులు మరెవరూ లేరన్న సత్యాన్ని చాటే పండుగ ఇది. అనుబంధాలను పెంపు చేస్తూ, బాధ్యతను గుర్తు చేసే వేడుక రాఖీ పౌర్ణమి.
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః
తేనత్వామభిబధ్నామి రక్షే మా చలమాచల॥
‘ఎంతో బలవంతుడైన బలిచక్రవర్తినే బంధించిన విష్ణుశక్తితో ఉన్న రక్షాబంధనాన్ని నీకు కడుతున్నాను. దీని శక్తితో నువ్వు చల్లగా వర్ధిల్లుతూ ఉండాలి’ అని పై శ్లోకానికి అర్థం. బలిచక్రవర్తిపై అభిమానంతో విష్ణుమూర్తి అతని దగ్గరే చిక్కుకుపోతాడు. శ్రీహరిని విడిపించడానికి బలి చక్రవర్తికి లక్ష్మీదేవి రక్షాబంధనం కట్టిందని భవిష్య పురాణం చెబుతున్నది. ఈ శ్లోకం చదువుతూ సోదరులకు రాఖీ కట్టాలి.
-డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370