రాజ్యంలోని ప్రజలు ఎలా ఉన్నారో చూద్దామని రాజు, మంత్రి మారువేషాల్లో బయలుదేరారు. నడక దారిలో మంత్రి ‘ఏదైనా సరే, చూసే కండ్లను బట్టి ఉంటుంది మహారాజా!’ అన్నాడు. ‘అలాగా’ అని ఆలోచిస్తూ నడవసాగాడు రాజు. వారికి దారిలో పొలం పక్కన మామిడి చెట్టు కింద కూర్చుని ఉన్న ఓ రైతు కనిపించాడు. అతని భార్య పెరుగు కలిపిన చద్దన్నం అతని దోసిళ్లలో పెట్టింది. రైతు ఉల్లిపాయ నంజుకుంటూ, చద్దన్నం తృప్తిగా తిన్నాడు. అతను తినడం పూర్తయ్యాక రాజు ‘ఎలా ఉంది నీ జీవితం?’ అని ప్రశ్నించాడు. రైతు చిరునవ్వుతో ‘నిత్య కల్యాణం పచ్చ తోరణంగా ఉంది మహారాజా’ అని బదులిచ్చాడు.
రైతు భార్య సమీపంలో ఉన్న కాలువలో పాత్రలు కడగడానికి వెళ్లింది. రాజు మళ్లీ రైతుతో ‘మరి మీ సంసారం ఎలా ఉంది?’ అని అడిగాడు. దానికి అతను ‘ఇంటికి దీపం ఇల్లాలు అని పెద్దోళ్లు ఊరకే చెప్పలేదు కదా అయ్యా. అందులోనూ పేదోడికి పెండ్లామే ఆస్తి కదా!’ అని బదులిచ్చాడు.
మరికొంత దూరం పోయాక, మరో రైతు కానుగ చెట్టు కింద కూర్చుని కనిపించాడు. ఆకలిగా ఉన్న అతను తన భార్య తెచ్చే చద్దన్నం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు.
అతనితో ‘నీ జీవితం ఎలా ఉంది?’ అని ప్రశ్నించాడు రాజు. ‘దరిద్రుడి చేనుకి రాళ్ల వానలా ఉంది నా బతుకు!’ అని నిష్టూరపోయాడు. ‘మరి నీ సంసారం సంగతి ఏమిటి?’ అని అడిగాడు. దానికి అతను కోపంగా ‘నేను కష్టపడి తెచ్చిస్తే, వండి పెట్టేదానికి కష్టం ఆమెకు’ అని సమాధానం ఇచ్చాడు.
రాజు, మంత్రి ఇద్దరూ మరికొద్ది దూరం నడిచాక దారిలో ఆ రెండో రైతు భార్య ఎండకు చెమటలు కార్చుకుంటూ రావడం కనిపించింది. పాలు తాగే బిడ్డను చంకన పెట్టుకుని, నెత్తిన ఉన్న చద్దన్నం గిన్నె గట్టిగా పట్టుకుని గబగబా నడుస్తున్నది. కడుపు నిండిన వాడి ఆలోచనకు, నిండని వాడి ఆలోచనకు తేడా తెలుసుకున్న రాజు మెచ్చుకోలుగా మంత్రి వైపు చూశాడు.