‘అయ్యో! నా తండ్రీ! అప్పుడే నీకు నూరేండ్లు నిండాయా నాయనా!’ అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి. శ్మశానంలో చెట్టుకింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున ఏడుస్తున్న వాళ్లను చూసి, చెట్టు మీద ఉన్న ఓ ముసలి గద్ద జాలిపడింది.
‘అమ్మా! ఎందుకలా ఏడుస్తున్నారు? ఊరుకోండి! మృత్యువుకు మన, తన అని ఉండదు. గర్భంలో జీవి ప్రవేశించినప్పటి నుంచీ ఎప్పుడు తీసుకుపోదామా అని ఎదురుచూస్తూనే ఉంటుంది! క్షణక్షణానికి ఇగిరిపోతున్న నీళ్లలో ఉండే చేపల్లాంటివాళ్లం మనం. భీరుడు, శూరుడు, జడుడు, బలవంతుడు, బలహీనుడనే భేదాలేవీ లక్ష్యపెట్టదు మృత్యువు. ఎటువంటి వాళ్లనైనా కబళిస్తుంది. లేవండి, పొద్దు గుంకుతున్నది. రాక్షసులూ, భూతాలూ శవాలను తినడానికి వస్తాయిక! చచ్చిన పిల్లవాడితో కలిసి అందరూ చావాలనుకుంటున్నారు ఏమిటి? బాగుంది వరుస! శవాన్ని వదిలిపెట్టి పొండి. ఏడిస్తే పోయినవాళ్లు వస్తారా? వెళ్లండి! ఇంకొంచెం సేపు ఆలస్యం చేస్తే రాక్షసులు మిమ్మల్ని కూడా పీక్కుతింటారు’ అని వేదాంత ధోరణిలో చెప్పింది. వాళ్లు భయపడ్డారు. గుండెలు రాయి చేసుకొని శవాన్ని అక్కడే వదిలేసి ఇండ్లకు బయల్దేరారు.
‘అయ్యయ్యో! గద్ద మాటలు విని భయపడుతున్నారా? చందమామ లాంటి ఈ పసివాణ్ని ఇలా పారేసి పోవడానికి మీకు మనసెలా వస్తున్నది! కాళ్లెలా ఆడుతున్నాయి? వెళ్లకండి. విధి దయతలిస్తే ఈ పసివాడికి మళ్లీ ప్రాణం వస్తుందేమో! ఇంకా సూర్యాస్తమయం కాలేదు. భయపడకండి’ అన్నది ఒక నక్క ఎక్కడినుంచో హఠాత్తుగా వచ్చి.
‘ఈ బుద్ధిలేని నక్కమాటలు నమ్ముతున్నారా? పసివాడి శవం చూడండి ఎలా వికృతంగా తయారైందో! ఇంకేం ప్రాణం వస్తుంది. అడియాసలు మానండి. వెళ్లండి. దానాలూ, పుణ్యకార్యాలూ చేసి ఈ పసివాడికి ఉత్తమగతులు కల్పించండి’ అంది గద్ద.
‘ఏడిచావ్! నోరు మూసుకో! ఏదో మహా తెలిసినట్టు వాగుతున్నావు’ అని నక్క గద్దను ఆక్షేపించి, చనిపోయిన పిల్లవాడి బంధువుల వైపు తిరిగి ‘గద్ద చాలా క్రూరమైంది. దాని మాటలు వినకండి. ఈ చిట్టితండ్రిని చూస్తుంటే నాబోటిదానికే కన్నీళ్లు ఆగటం లేదు. మరి మీరెలా వెళ్లిపోవాలనుకుంటున్నారో తెలియడంలేదు. ప్రయత్నిస్తే దైవబలం కలిసిరావచ్చు. ఈ పసివాడు ప్రాణాలతో లేచిరావచ్చు. అంతగా బతక్కపోతే అప్పుడే పోదురుగాని’ అంది నక్క.
‘నేను పుట్టి కొన్ని వందల సంవత్సరాలైంది. చనిపోయిన వాళ్లెవరూ తిరిగి బతికిరావడం చూడలేదు. ఒకటి మాత్రం నిజం. చచ్చినవాళ్లు మరో గర్భంలో పుట్టి మళ్లీ వస్తారు. అంతేకాని ఈ శరీరంతో రారు. ఈ నక్కకు బుద్ధిలేదు. శవమట.. బతుకుతుందట! ఎవరైనా వింటే నవ్విపోతారు!’ అపహాస్యం చేసింది గద్ద.
ఆ మాటలు నిజమే అనుకుని వెక్కివెక్కి ఏడుస్తూ వాళ్లు వెనక్కి తిరిగారు. ‘ఆగండాగండి! వెళ్లకండి. మనిషి జన్మ ఎత్తి కూడా మీకెందుకు బుద్ధిలేకుండా పోయిందో నాకు అర్థం కావడంలేదు! సృంజయుడి కొడుకు మరణిస్తే నారదుడు అతణ్ని బతికించాడా లేదా? హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణుడిని బతికించాడా లేదా? అలాగే మీ ఏడుపు విని ఏ సిద్ధుడో, దేవతో కరుణించి ఈ పసివాడికి ప్రాణాలు ఇవ్వకూడదా? ఎందుకలా వెళ్లిపోతున్నారు?’ అని నక్క అడ్డం వచ్చింది. వాళ్లు మళ్లీ వచ్చి శవం చుట్టూరా కూర్చుని గట్టిగా ఏడ్వటం మొదలుపెట్టారు. ఇంతలో సూర్యుడు అస్తమించాడు.
సూర్యాస్తమయం కాకుండానే వాళ్లను పంపించి వేస్తే హాయిగా ఆ శవాన్ని పీక్కుతినవచ్చని ఆశపడింది గద్ద. బాగా చీకటిపడే దాకా వాళ్లను ఆపితే గద్దకు దక్కకుండా ఆ శవాన్ని తానే ఆరగించవచ్చని ఆశపడింది నక్క. చచ్చినవాడు తిరిగిరాడని ఆ రెంటికీ తెలుసు. చీకటిపడగానే ఇంక చేసేదేం లేక ఆశ వదులుకొని గద్ద వెళ్లిపోయింది. సరిగ్గా ఆ సమయంలోనే ప్రేతవనంలో విహరించడానికి వచ్చాడు శివుడు. గొల్లున ఏడుస్తున్నవాళ్లను చూసి జాలిపడ్డాడు. ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. వాళ్లు ఆశ్చర్యంతో ఆ కరుణామూర్తికి సాష్టాంగపడి ‘దేవా! మా బిడ్డను బతికించు’ అని వేడుకున్నారు. శివుడు ఆ శిశువుకు ప్రాణాలిచ్చి నూరేళ్ల ఆయువు ప్రసాదించాడు. గద్దకూ, నక్కకూ ఆకలి లేకుండా వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు. వాళ్ల వాళ్ల లాభాలు కోరి మాట్లాడే గద్ద, నక్కలాంటి వాళ్లు అనేకులు ఉంటారు. వాళ్ల వైఖరులు తెలుసుకొని మనం ప్రవర్తించాలి.
-ప్రయాగ రామకృష్ణ