గాంధీజీ భారత స్వాతంత్య్ర సమరసేనాని మాత్రమే కాదు… అత్యంత సరళ జీవితానికి అరుదైన చిరునామా కూడా. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అందరూ ఖద్దరు ధరించాలని ఆయన దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా మద్రాసు నుంచి మదురైకి రైలులో వెళ్తున్నారు. అప్పుడు రైలుపెట్టెలో జనం విదేశీ వస్ర్తాల్లో కనిపించారు. గాంధీజీ వారికి ఖద్దరు ధరించాలని సూచించారు. అయితే ఖద్దరు ధర ఎక్కువని, తమలాంటి పేదలకు ఖద్దరు వస్ర్తాలు తొడుక్కునే స్తోమత లేదని వారు జవాబిచ్చారు. దాంతో ఆ మరుసటి రోజునుంచి గాంధీజీ గోచీ, సెల్లాకే పరిమితమైపోయారు. ‘అర్ధనగ్న ఫకీర్’గా దేశాన్ని స్వాతంత్య్ర తీరానికి చేర్చారు.
కాగా, గాంధీజీ సరళ జీవితం ఆచరణ సాధ్యమే అని నిరూపించినప్పటికీ, మారుతున్న ప్రపంచంతోపాటే భారతదేశం కూడా జీవనశైలి పరంగా, సాంకేతికంగా, మౌలిక వసతుల పరంగా కాలానుగుణంగా ఎంతో మారుతూ వచ్చింది. దాంతో ఒక్క భారతదేశమే కాదు, ప్రపంచం అంతటినీ రకరకాలైన వస్తువులు ముంచెత్తుతున్నాయి. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడటంతో సుదూరాలకు ప్రయాణాలు సాధ్యమైపోయాయి. కానీ, ఈ తరహా అత్యాధునిక జీవనశైలి కారణంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. వాహనాల పొగ, ప్లాస్టిక్ తదితరాలతో భూమిని, నీటిని, ఆకాశాన్ని మనం కాలుష్యమయం చేసేస్తున్నాం. మరి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న జీవనశైలి పరమైన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. క్రీ.శ. రెండో శతాబ్దానికి చెందినట్లుగా భావిస్తున్న ఉమాస్వాతి అనే జైనమత పండితుడు మనిషి చాలా సరళంగా, భూమికి భారంగా మారకుండా జీవించడానికి, ధార్మికమైన ఏడు ప్రమాణాలు సూచించాడు. వాటిని సాధ్యమైనంత వరకు ఆచరిస్తే కొంతలో కొంతైనా పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది.
మొదటిది, ఒక పరిమిత ప్రదేశాన్ని దాటి వెళ్లకపోవడం. దీనివల్ల ప్రయాణానికి సంబంధించిన కాలుష్యం తగ్గిపోతుంది. రెండోది, ఈ పరిమిత ప్రదేశాన్ని కూడా వీలైనంత తగ్గించుకోవడం. ఇక మనం వస్తుపరంగా ఏ రకమైన అభివృద్ధి చేసినా, దాని కారణంగా పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. దీనికి ఉమాస్వాతి సూచించిన… పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలనే మూడో ప్రమాణం పనికివస్తుంది. నాలుగో ప్రమాణం జీవ కారుణ్యానికి సంబంధించింది. దీనివల్ల మనిషితోపాటు ఇతర జీవుల మనుగడ సాధ్యమవుతుంది. క్రమం తప్పకుండా ఉపవాసం ఉండాలనే నియమం అయిదోది. ప్రస్తుతం మన జీవితాల్లో చాలా మార్పులు వచ్చాయి. ఫోన్లు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఇలా ఎన్నో వస్తువులను అవసరం ఉన్నా లేకపోయినా పోగుచేసుకుని, వాడుకోవడం మామూలు విషయమైపోయింది. ఫలితంగా భూమ్మీద సాధారణ వ్యర్థాలతోపాటు ఎలక్ట్రానిక్, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. అయితే, మనం తక్కువ వస్తువులను ఉపయోగించుకుం టూ, సరళంగా జీవనయాత్ర సలపవచ్చు. ఇదే ఉమాస్వాతి చెప్పిన మనిషి ఆచరించాల్సిన ఆరో నియమం. ఇక పెద్దలను, అతిథులను గౌరవించడం అనాదిగా కొనసాగుతున్న భారతీయ సంప్రదాయం. కాబట్టి, ఎవరైనా సాధువు ఆశ్రయాన్ని కోరి వస్తే ఉచితంగా సదుపాయాలు కల్పించాలని ఉమాస్వాతి ఏడో ప్రమాణంగా సూచించాడు.
అయితే, ఎంత నియమ నిష్ఠలతో ఉన్నప్పటికీ మనం మనుషులం. ఎప్పుడైనా ఈ ప్రమాణాలను అతిక్రమించాలనే కోరిక బలంగా కలుగుతుంటుంది. అలాంటప్పుడు వెంటనే ఉపవాసానికి కూర్చోవాలని సూచిస్తాడు ఉమాస్వాతి. అలా కోరిక సమసిపోయే వరకు ఉపవాస దీక్షలోనే ఉండాలనేది ఆయన బోధ. నిజానికి ప్రకృతి చాలా సరళంగా ఉంటుంది. కానీ నాగరికతలో పురోగతి, అభివృద్ధి పేరుతో మనిషే దానిని రోజురోజుకూ సంక్లిష్టం చేస్తున్నాడు. ఈ క్రమంలో స్వర్గానికి, ఆనందానికి చిరునామాగా పేర్కొనే సరళత్వానికి దూరమవుతున్నాడు. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే మనిషి అంతరాంతరాల్లో ఎంతో సరళమైపోవాలని వేదాంతం బోధిస్తున్నది. కాబట్టి, దేవుడి గురించి తెలుసుకోవాలనుకున్నా, భూమిని కాలుష్యం నుంచి కాపాడుకోవాలనుకున్నా మనిషి సరళ జీవితానికి మళ్లాల్సిందే.
-చింతలపల్లి హర్షవర్ధన్