‘గురువును మించిన శిష్యుడు’ అనే మాటను చాలామంది వినే ఉంటారు. సాధారణంగా ఈ మాటను చాలా సందర్భాల్లో ప్రయోగిస్తూ ఉంటాం. అయితే, యథాలాపంగా ఉపయోగించినా, గురువును మించిన శిష్యుడు అనిపించుకోవడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఈ నానుడి పుట్టడం వెనుక ఓ అద్భుతమైన గాథ ఉంది. ఓ గురువు చూపించిన అపురూపమైన వాత్సల్యం ఉన్నది. ఒక శిష్యుడు ప్రదర్శించిన అకుంఠిత దీక్ష ఉన్నది. గురువు మెచ్చిన శిష్యుడే తదనంతర కాలంలో గురువును మించిన శిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. గురువు ఆశీర్వాదంతోనే శిష్యుడు వినమ్రంగా గురువును మించిపోతాడు. అది గురువుకు ఆనందకారకమే అవుతుంది. దీనికి చక్కని ఉదాహరణ అర్జునుడు.
ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడు ఎంచుకున్న ఆయుధం అర్జునుడు. పాండవ మధ్యముడిగా, ఇంద్రాంశ సంభూతుడిగా జన్మించిన పార్థుడిని సవ్యసాచిగా మలిచిన ఘనత ద్రోణాచార్యుడిదే. అర్జునుడి సూక్ష్మబుద్ధిని ఆదిలోనే గ్రహించిన ద్రోణుడు శిష్యుడిని విలు విద్యలో సాటిలేని మేటిగా తీర్చిదిద్దాడు. తనను సర్వోన్నత విలుకాడుగా నిలిపిన గురువుకు అర్జునుడు అరుదైన గురుదక్షిణ సమర్పించాడు. తన గురువుకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటూ ద్రుపదుని ఓడించి, బంధించి ద్రోణుడి పాదాల ముందు పడేశాడు. అదే పాండవులకు గొప్ప ప్రతిష్ఠ తెచ్చింది. కౌరవులు ఆ పని చేయలేకపోయారు.
పాండవుల శక్తిసామర్థ్యాలు, మంచితనం గుర్తించిన ధృతరాష్ర్టుడు ధర్మరాజునే యువరాజుగా అభిషిక్తుని చేశాడు. పాలనాదక్షతలో ధర్మరాజు పాండురాజునే మించిపోసాగాడు. భీమసేనుడి బల పరాక్రమాలు, గదా యుద్ధపాటవం లోకమంతా వ్యాపించాయి. ధనుర్విద్యలో అర్జునుడిని మించినవాడు లేడనే మాట ఎల్లలు దాటి ప్రపంచమంతా విస్తరించింది. నకుల, సహదేవులు కూడా స్వచ్ఛమైన నడవడితో కీర్తిప్రతిష్ఠలు సాధించారు. పాండవులు, కౌరవులు అందరూ ద్రోణాచార్యుడి దగ్గరే విద్యలు నేర్చినా అర్జునుడి చతురత గురువుకు బాగా నచ్చింది. అనతికాలంలోనే గురువు మెచ్చిన శిష్యుడన్న పేరు సాధించాడు. అందుకే, అర్జునుడు కోరకపోయినా ద్రోణుడు అతనికి ప్రయోగ, ఉపసంహారాలు సహా బ్రహ్మాస్ర్తాన్ని ప్రదానం చేశాడు.
అగస్త్య మహర్షి శిష్యుడైన అగ్నివేశుని నుంచి తాను పొందిన బ్రహ్మాస్ర్తాన్ని అర్జునుడికి అనుగ్రహించాడు. దాన్ని సామాన్యులపై ప్రయోగించకూడదని, ప్రజలను పీడించే దుర్మార్గులపై ప్రయోగించవచ్చని చెప్తాడు. ‘ధర్మ రక్షణలో భాగంగా ఎవరితో యుద్ధం చేయడానికైనా వెనుకాడొద్దు. చివరికి నాతో యుద్ధం చేయవలసి వచ్చినా సందేహించవద్దు. ఇదే నీ బంధువులు అందరిముందు నేను నిన్ను కోరుకుంటున్నాను’ అని హితవు పలుకుతాడు ద్రోణుడు. గురువు మెచ్చిన శిష్యుడు కనుకనే అర్జునుడు తదనంతర కాలంలో కురుక్షేత్ర రణరంగంలో ద్రోణునికి ఎదురుగా నిలిచి యుద్ధం చేసి ధర్మస్థాపన చేయగలిగాడు.
అర్జునుడి ఖ్యాతి అసమానమైనది. అతనికి గురువు అనుగ్రహం లభించిన కారణంగానే గురువును మించిన శిష్యుడిగా ప్రసిద్ధి చెందాడు. భాగవతంలో కనిపించే భక్త ప్రహ్లాదుడు, భక్త ధ్రువుడు కూడా అంతే. వారి గురువైన నారద మహర్షిని మించిన కీర్తిని వీరిద్దరూ గడించారు. లోక శ్రేయస్సును కలిగించాలని కోరుకునేవారు ముందుగా గురుప్రీతిని సాధించాలి. అప్పుడు వారు గురువును మించిన శిష్యుడిగా లోకోత్తరమైన కార్యాలు చేసి సుప్రసిద్ధులవుతారు. కాబట్టి గురుదేవుడి ఆశీస్సులే శిష్యుడికి కీర్తిప్రదాయకం, విజయకారకం, మంగళదాయకం. సర్వదా శిష్యుడు గురుదేవుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నించాలి.
-డా॥ వైష్ణవాంఘ్రి సేవక దాస్, 98219 14642