తిథి, వార, నక్షత్రాలతో నిమిత్తం లేకుండా వచ్చేవారు అతిథులు. భోజన సమయానికి వచ్చినవారు అభ్యాగతులు. వారు కూడా అతిథులే! ఇంటికి వచ్చే అతిథి సాక్షాత్తూ భగవంతుడే అని చెప్తున్నది ఆర్ష ధర్మం. దేవుడే అతిథి రూపంలో వచ్చి, ఆయనకు సేవలు చేసే భాగ్యం కల్పిస్తాడని మన పూర్వికులు భావించేవారు. అతిథిని దేవుడితో పోల్చడం ఎందుకు? అంటే, మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆడంబరాలున్నా దేవుడికి నేరుగా సమర్పించలేం. దేవుడు అనుగ్రహించిన దానికి కృతజ్ఞతగా అతిథిలో దేవుణ్ని దర్శించి, యథాశక్తి వారిని తృప్తిపరచడం మన సంప్రదాయంగా వస్తున్నది.
‘మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ’ అని వేదవాక్కులు. తల్లిదండ్రులతో రక్తసంబంధం, గురువుతో జ్ఞాన సంబంధం ఉంటుంది. కానీ, అతిథి దైవసంబంధి. అందుకే ఎవరైనా ఇంటికి రాగానే సాదరంగా ఆహ్వానించి, కాళ్లకు నీళ్లిచ్చి, క్షేమ సమాచారాలు తెలుసుకోవాలి. ఆతిథ్యం అంటే శక్తికి మించి సత్కారాలు చేయడం, రకరకాల పిండి వంటలతో పరమాన్నాలు వడ్డించాల్సిన పనిలేదు. వచ్చిన అతిథిని ఆత్మీయంగా ఆదరించడమే ప్రధానం. ఉన్నదాంట్లో ఉన్నతంగా అతిథ్యం ఇవ్వడం ముఖ్యం. ‘ఈ ప్రపంచంలో మనదంటూ ఏదీ లేదని, ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరూ బ్రహ్మ స్వరూపులే’ అని పేర్కొంటుంది యోగవాశిష్ఠం. ఇద్దరి రూపాల్లో తేడా ఉందేమో కానీ, ఇద్దరిలోనూ అంతర్యామి భగవంతుడే!
అతిథిని ఎలా ఆదరించాలో అనేక పురాణగాథలు తెలియజేస్తున్నాయి. రంతిదేవుడు అనేక దానధర్మాలు చేసేవాడు. గొప్ప తపశ్శాలి. ఆహార పదార్థాలు వదిలిపెట్టి కేవలం మంచినీళ్లు తాగుతూ తపస్సు చేస్తుండేవాడు. ఒకసారి రంతిదేవుడు కుటీరంలో ఉండగా, ఒకవ్యక్తి అతిథిగా ఆయన దగ్గరికి వచ్చాడు.
అప్పుడు అతనితో ‘అన్నం లేదు కొన్ని మధురాంబులున్నవి త్రావుమన్న’ అని ఆప్యాయంగా ఆతిథ్యం ఇస్తాడు రంతిదేవుడు. రాకరాక తన ఇంటికి వచ్చిన కుచేలుడిని శ్రీకృష్ణుడు ఆదరించిన విధానం స్నేహధర్మానికి తలమానికంగా నిలిచింది. స్నేహితుడికి అనితరమైన ఆతిథ్యాన్ని ఇవ్వడమే కాకుండా, అష్ట ఐశ్వర్యాలూ అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. వివేకానందుడు అమెరికా వెళ్లినప్పుడు ఆయన రూపాన్ని అందరూ చులకనగా చూశారు. కానీ, ఒక మహిళ మాత్రం స్వామివారికి ఆతిథ్యం ఇచ్చింది. ఆమె ఇంట్లో అతిథిగా ఉంటూనే వివేకానందుడు అమెరికాలో తన ప్రసంగాలు కొనసాగించారు. ఆతిథ్య ధర్మాన్ని చెట్ల ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరో నాటిన మొక్కలు, పెద్దయ్యాక పూలను, కాయలను మనకందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే, సమస్త ప్రాణికోటి ఈ భూమిపైకి వచ్చిన అతిథులే! తన వనరులన్నీ మనకు ఇచ్చి, బతుకడానికి అవకాశాలు కల్పించి.. భూదేవి మనందరికీ ఘనమైన ఆతిథ్యాన్ని ఇస్తున్నది. అతిథిగా అవనిపైకి వచ్చిన మనం.. మరో అతిథిని ఇతోధికంగా ఆదరించడం కర్తవ్యంగా భావించాలి.
పూర్వం వాహన సౌకర్యాలు అంతగా ఉండేవి కావు. ఒక ఊరి నుంచి మరో ఊరికి ఎండ్లబండ్లలో, కాలినడకన వెళ్లేవారు. భోజన వేళకు ఏదైనా గ్రామానికి చేరుకొని, ‘బాటసారులకు భోజనాలు పెట్టేవారు ఎవరైనా ఉన్నారా?’ అని అడిగివెళ్లేవాళ్లు. ఎండపూట ఎవరైనా అతిథులు భోజనానికి వస్తారని కొన్ని కుటుంబాల్లో ప్రత్యేకంగా వంటలు పక్కనపెట్టేవారు కూడా! కాలంతోపాటే సంప్రదాయాల్లోనూ మార్పులు వచ్చాయి. పూటకూళ్ల ఇండ్లు మొదలయ్యాయి. హోటళ్లు పుట్టుకొచ్చాయి. వాటిసంగతి అటుంచితే, అయినవారింటికి కూడా భోజనవేళకు వెళ్తే ఇబ్బందిగా భావిస్తారనుకొని, హోటల్లో ఎంగిలిపడాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. కానీ, అతిథిని గౌరవించడం, వారికి భోజన సత్కారాలు చేయడం మన పురోగతికి దోహదం చేస్తుందని గుర్తెరగాలి. ఇంటికి వచ్చిన శత్రువునైనా ఆదరించాలని మన సంస్కృతి చెప్తున్నది. ఇంట్లో ఆహారపదార్థాలు తక్కువగా ఉంటే, యజమాని ఉపవాసం ఉన్నా.. అతిథిని సంతృప్తిపరచాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. ప్రాణాధారమైన అన్నపానాలను అతిథికి భక్తిశ్రద్ధలతో సమర్పించడాన్నే అతిథి యజ్ఞం అంటారు. ఇంటికి వచ్చిన వ్యక్తి సంతృప్తి చెందితేనే యజ్ఞఫలం దక్కుతుంది. అతిథి ఆశీస్సులు అందుకోవడం అంటే, భగవంతుడి అనుగ్రహం పొందడమే!