సనాతన ధర్మం మానవ రూపం ధరించి నడిచి వస్తే ఎలా ఉంటుందని ఎవరైనా ప్రశ్నిస్తే.. ముక్తకంఠంతో అశేష భారత ప్రజానీకం చెప్పే మాట శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి అని. నడిచే దైవంగా, మహాస్వామిగా భక్తుల నీరాజనాలందుకున్న పరమాచార్యుల జీవనం ప్రతి భారతీయుడికీ మార్గదర్శకం. కేవలం పీఠాధిపతిగా మాత్రమే ఆయన తన బాధ్యత నిర్వహించలేదు, ఈ సమాజానికి, దేశానికి ఏం కావాలో తెలుసుకున్నారు. భారతదేశం స్వతంత్ర వాయువులు తీసుకోవటానికి ముందే ఈ దేశ భవిష్యత్తు ఎలా ఉండాలో ఆలోచించిన దేశభక్తుడు ఆయన. దేశ ప్రజలకు మతపరమైన రక్షణ హక్కుగా ఉండాలని తపించారు. తన భక్తులతో విజ్ఞాపనలు పంపించి, ఆ హక్కును చట్టబద్ధం చేయించారు.
నవీనయుగంలో నిజమైన సన్యాసి పరమాచార్యులు. ఆశ్రమ ధర్మాలను చివరిశ్వాస వరకు తు.చ. తప్పకుండా పాటించారు. ఈ విషయంలో ఆయనకు పట్టింపులు తప్ప సడలింపుల్లేవు. కొన్ని దశాబ్దాల పాటు కేవలం పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకొని, జితేంద్రియత్వం సాధించారు. ఆసేతు హిమాచలం పాదచారిగా పర్యటించి, భారతీయ ధర్మదేవత విశ్వవిరాట్ స్వరూపాన్ని తిలకింపజేశారు. మహాస్వామిలో అనేక పార్శాలున్నాయి. ఆధ్యాత్మిక భావనతో చూసేవారికి ఆయనలో ఆదిశంకరులు కనిపిస్తారు. తత్వవేత్తలకు గొప్ప వేదాంతి కనిపిస్తారు. జిజ్ఞాసువులకు ఆయన్ను మించిన విజ్ఞాన సర్వస్వం మరొకటి లేదనిపిస్తుంది. ఎలాంటి సందేహాన్ని అయినా తీర్చగల దిట్ట వారు. దేశంలో అందరు పీఠాధిపతులను సమన్వయం చేసిన యోగీశ్వరుడు. వారందరికీ మార్గదర్శి. అన్నిటినీ మించి, సన్యాసి అంటే ‘పరమాచార్య’ మాత్రమే అన్నంతగా, కదిలే సంయమిగా తన జీవితంలోని ప్రతి అడుగునూ ధర్మమార్గంలో వేసిన మహనీయుడు.
ఈ కాలంలో ఎవరైనా పీఠం బాధ్యత, మఠం నిర్వహణ గురించి మాట్లాడాల్సి వస్తే నిస్సంకోచంగా పరమాచార్య మార్గాన్ని ఉటంకించాల్సిందే. ఇందులో ఏ మినహాయింపూ లేదు. కేవలం పదమూడేండ్ల వయసులోనే పీఠాధిపత్యం తీసుకున్నప్పటికీ, పూర్వ పీఠాధిపతులను మించి మఠాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించారు. ఆదిశంకరుల అవతారం అయితే తప్ప ఇది మరొకరికి సాధ్యం కాని ప్రతిభ. స్వామి కేవలం ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, చారిత్రకుడు, శాస్త్ర పరిశోధకుడు, జ్యోతిశ్శాస్త్రవేత్త కూడా. నిండు నూరేండ్లు మహోన్నతమైన ధార్మిక జీవితాన్ని గడిపారు. అడుగుపెట్టిన ప్రతిచోటా ధర్మ ప్రబోధాలు సలిపి, సనాతన ధర్మ పునరుద్ధరణకు జీవితాన్ని అంకితం చేశారు. అందుకే భక్తుల పాలిట నడిచే దేవుడిగా నిలిచారు.
కంచి పీఠాధిపత్యం వహించిన తర్వాత పరమాచార్య అప్పటివరకు ఉన్న మఠ కార్యక్రమాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. ధర్మ ప్రచారం చేస్తూనే మఠ కార్యక్రమాల మార్గాన్ని ఆధ్యాత్మిక, సామాజిక రంగాల వైపు మళ్లించారు. రెండుసార్లు దేశమంతా కాలినడకన పర్యటించారు. దేశవ్యాప్తంగా వేదపాఠశాలలు ఏర్పాటు చేశారు. ప్రజారోగ్యం కోసం వైద్యశాలలు నెలకొల్పారు. ధర్మప్రబోధమే దీక్షగా స్వీకరించిన స్వామివారు కేవలం మతపరమైన ఉపదేశాలకే పరిమితం కాకుండా, శిష్యుల వ్యక్తిత్వం మెరుగుపడేందుకు సహకరించే సలహాలను, సూచనలను ఇస్తుండేవారు. హైందవేతరులను కూడా తన శిష్యులుగా మార్చుకున్న మహనీయమూర్తి పరమాచార్యులు ఒక్కరే. తాను సన్యాసదీక్ష తీసుకొని, ఒక పీఠాధిపతిగా ఉన్నారు కాబట్టి, ప్రత్యక్షంగా స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేకపోయినా, స్వతంత్ర భావాలను ప్రచారం చేశారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా విదేశీ వస్త్ర బహిష్కరణ పిలుపు నుంచి స్వామి ఖద్దరునే ధరించారు. ఒక యోగి, దేశభక్తుడు, సామాజిక సేవకుడు, ఆధ్యాత్మిక చింతనాపరుడు, ధర్మవర్తనుడు… అన్నీ కలగలసిన సమున్నత వ్యక్తి శ్రీ చంద్రశేఖరులు. ఈ దేశం సగర్వంగా ఎలుగెత్తి, ఛాతీవిరిచి చెప్పుకోదగిన భారతమాత ముద్దుబిడ్డ. సనాతన ధర్మానికి శాశ్వతమైన దివిటీ పరమాచార్య.
-డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, 90320 44115