చలి దండిగా ఉండే కాలం. ప్రచండ భాస్కరుడి ప్రభ తగ్గే సమయం. పిండి వెన్నెల ఒకవైపు.. మంచు తెరలు మరోవైపు.. ధనుర్మాస పాశురాలు ఇంకోవైపు.. మొత్తంగా చేమంతుల నేస్తం హేమంతంలో ఎన్నో ప్రత్యేకతలు. ఈ విశేషాలకు శ్రీకారం చుట్టే మాసం మార్గశిరం. విష్ణుమూర్తి రూపమైన మార్గశిర వైభవానికి స్వాగతం.
అన్ని కాలాలూ భగవంతుడి స్వభావ స్వరూపాలే. అయినా వాతావరణంలో ఏర్పడే మార్పులను బట్టి మార్గశిర (మార్గశీర్షం) మాసాన్ని ప్రత్యేకమైనదిగా చెబుతారు. సౌరమానంలో దీనిని ధనుర్మాసం అంటారు. చాంద్రమానంలో పౌర్ణమినాడు చంద్రుడు ఉండే నక్షత్రం ఆధారంగా ఆయా నెలలకు పేర్లను నిర్ణయించారు. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చిన కారణంగా దీనిని మార్గశిరం అన్నారు. భగవద్గీతలో ‘మాసానాం మార్గశీర్షోహం’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మాసాల్లో తానే మార్గశిరాన్ని అని పరమాత్మ పేర్కొనడం ద్వారా ఈ మాసంలో నిర్వహించే ఎలాంటి సత్కార్యాలైనా ఆయనకే చెందుతాయని భావించాలి.
నిజానికి భూమి తన కక్ష్యలో తాను తిరుగుతూ… సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో సూర్యుడికి దగ్గరగా, దూరంగా జరిగే కాలాల్లో భూమిపై ప్రసరించే సూర్యకాంతి తీవ్రతలో మార్పులు చోటుచేసుకుంటాయి. వీటికి అనుగుణంగా భూమిపై వాతావరణంలో వ్యత్యాసాలు ఉంటాయి. ఆ మార్పులను ఆరు రుతువులుగా విభజించారు మన పూర్వికులు. ఈ రుతువుల ప్రభావం మనుషులతోపాటు పశుపక్ష్యాదులు, మొక్కలపైనా ఉంటుంది. వసంతం మొదలు శిశిరం వరకు ఆరు రుతువులు సూర్యుడి ఆధారంగా భూ వాతావరణంలో జరిగే మార్పులకు ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ క్రమంలో హేమంత రుతువులో మార్గశిరం, పుష్య మాసాలు వస్తాయి. ఈ రుతువులో మంచు కురుస్తూ, వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రకృతి అంతా తనను తాను మార్చుకునే విధానం స్పష్టంగా కనిపిస్తుంది. దట్టమైన పొగమంచుతో ఉషోదయ భానుబింబం మనోజ్ఞంగా దర్శనమిస్తూ సౌందర్య ఆరాధకులకు కనువిందు చేస్తుంది. సాయంకాలం పొలాలపై మంచుతెరలు పరచుకొని ప్రకృతి వింత అందాలు సంతరించుకుంటుంది.
ఈ కాలంలో రాత్రులు దీర్ఘంగా ఉంటాయి. ఈ విషయాన్ని కవులు అందంగా ప్రస్తుతించారు. ‘సూర్యుడి భార్య అయిన సంధ్యాదేవి చలికి భయపడి సమాగమనాన్ని కోరుకుంటూ త్వరగా ఇంటికి చేరుకుంటుందని’ వర్ణించడం కావ్యాల్లో కనిపిస్తుంది. అంతేకాదు ఒకరి కౌగిళ్లలో ఒకరు ఒదిగిపోతూ సుఖపారవశ్యంలో మునిగిపోయే యౌవనవంతులైన దంపతులకు తప్ప హేమంతంలో అందరికీ వెచ్చని దుప్పట్లు అవసరమవుతాయని వర్ణించారు. హేమంత వెన్నెల రాత్రులు భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచి, వారి సంసారంలో స్థిరత్వం ఏర్పడటానికి దోహదం చేస్తాయి. బంధాలను బలపరుస్తాయి. ఇవన్నీ ఎలా ఉన్నా హేమంతంలో ప్రకృతి అంతా ఆహ్లాదకరంగా మారడంతో మానసిక శాంతి కూడా అలవడుతుంది.
‘చంద్రమా మనసోజాతః’.. మనఃకారకుడైన చంద్రుడు ఈ కాలంలో నిర్మల ఆకాశంలో ప్రకాశవంతంగా వెలుగొందుతూ ఉంటాడు. ఈ కారణంగా మానసిక స్థితి సమంగా ఉంటుంది. మార్గశిర పౌర్ణమి నాడు షోడశ కళలతో అలరారే నిండు చంద్రుడు మృగశిర నక్షత్రంలో, తన ఉచ్ఛరాశి అయిన వృషభంలో సంచరించడం వల్ల ఈ కాలంలో శ్రద్ధతో ఆచరించే దైవారాధనలు మనోధైర్యాన్ని, దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తాయి.
చలి తీవ్రంగా ఉండే హేమంత రుతువులో సూర్యోదయానికి ముందుగానే స్నానాదికాలు ముగించడం మంచిదని చెప్పారు పెద్దలు. అంతేకాదు క్షారగుణాన్ని హరించే పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు పెరుగు మొదలైన పదార్థాలను మనం తీసుకునే ఆహార పదార్థాలతో ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిదని సూచించారు.
సౌరమానం ప్రకారం.. సూర్యుడు నెలకు ఒకసారి ఒక్కో రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు. దానినే సంక్రమణం అంటారు. సూర్యుడు సంచరించే రాశి ఆధారంగా సౌరమానంలో నెలల పేర్లు పేర్కొన్నారు. సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసంగా చెబుతారు. మార్గశిరంలోనే ధనుర్మాసం వస్తుంటుంది. ఈ నెలలో ఉషోదయానికి ముందే స్నానాదులు ముగించుకొని విష్ణు సహస్రనామాలు పఠించడం విశేష పుణ్యప్రదమని పెద్దల మాట. అలాగే ధనుర్మాసంలో సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన వల్ల సంతాన అనుకూలత ఏర్పడుతుందని విశ్వసిస్తారు.
సుషుప్తి- ఆనంద ప్రాప్తి
బ్రాహ్మీ ముహూర్తంలో మానసికంగా ఏం జరుగుతుంది? మన మెదడులో జరిగే ప్రకంపనాలను ‘డెల్టా’, ‘తీటా‘, ‘ఆల్ఫా‘, ‘బీటా’లుగా వ్యవహరిస్తారు. ‘డెల్టా’ స్థితిలో మెదడు నాలుగు కన్నా తక్కువ ప్రకంపనలు (సైకిల్స్) సృజించుకుంటుంది. ఈ స్థితిలో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. దీనినే సుషుప్తి అవస్థగా చెబుతారు. నిద్రలో ఇది మూడోస్థితి. భగవత్ ధ్యానంలో ఉండే యోగులు ఈ స్థితిలో నిరతానందంలో రమిస్తూ ఉంటారు. ‘తీటా’స్థితిలో మెదడు 4 నుంచి 8 ప్రకంపనలను సృజిస్తుంది. ఈ స్థితిలో దార్శనికత, సృజనాత్మకత, సమస్యలను పరిష్కరించే సామర్థ్యంలాంటివి హెచ్చుగా ఉంటాయి. ‘ఆల్ఫా’స్థితిలో మెదడు 8 నుంచి 13 ప్రకంపనలను సృజిస్తుంది. ఈ స్థితిలో ఆత్మ విశ్వాసం నిండుగా ఉండి ఆందోళన తక్కువగా ఉంటుంది. ఇక బీటా స్థితిలో 13 ప్రకంపనల కన్నా హెచ్చుగా మెదడు స్పందిస్తుంది. ఆందోళన విపరీతంగా ఉండి నిలకడలేమితో గమ్యం లేని గమనాన్ని ఆశ్రయిస్తాం.
మెదడు సృజించే ప్రకంపనలను నియంత్రించడానికే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొనాలని సూచించారు పెద్దలు. గాఢనిద్రలో మెదడు పూర్తి విశ్రాంతి తీసుకొని డెల్టా స్థితికి చేరుతుంది. ఆ సమయంలో చేసిన ఆలోచనలు, చదివే చదువు పూర్తిగా ఫలవంతం అవుతాయని మానసిక శాస్త్రజ్ఞులు కూడా విశ్లేషిస్తారు. విద్యార్థులు తెల్లవారుజామునే నిద్రలేచి చదువుకుంటే విషయం బాగా గుర్తుంటుందని చెప్పడం వెనుక కూడా కారణం ఇదే!
నిజానికి ఈ నియమాలు వ్యక్తి వ్యక్తిత్వాన్ని వికసింపజేయడానికి నిర్దేశించినవి. అంధ విశ్వాసాలకు దూరంగా శాస్త్రీయ భావనకు తీసుకెళ్తూ సామాజిక బంధాలను పెంచడానికి ఉపయుక్తమయ్యేవి మాత్రమే! దైవారాధనల వల్ల సద్గుణాలను సంతరించుకోవడం.. తద్వారా నైతిక విలువలు పెంచుకోగలుగుతాం.
ఆధ్యాత్మిక శోభ
మార్గశిరంలో పర్వదినాలు అనేకం. మార్గశిర శుక్ల షష్ఠి ‘సుబ్రహ్మణ్య షష్ఠి’గా చేసుకుంటారు. శుక్ల ఏకాదశి నాడే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి గీతోపదేశం గావించాడు. అందుకే ఆనాడు ‘గీతా జయంతి’ చేసుకోవడం ఆనవాయితీ. దత్తాత్రేయస్వామి అవతరించింది మార్గశిర పౌర్ణమి రోజే! మార్గశిర కృష్ణ అష్టమి కాలభైరవ అష్టమిగా జరుపుకొంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించడంతో విష్ణు ఆలయాల్లో పాశురాలు ప్రతిధ్వనిస్తుంటాయి. శైవ ఆలయాల్లో తిరువెంబావై గీతాలు వినిపిస్తుంటాయి.
-పాలకుర్తి రామమూర్తి