‘శ్రీ కైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్’ అంటూ పోతన శ్రీమంతమై, తెలుగు వెలుగైన తన ‘భాగవత’ రచనకు శ్రీకారం చుట్టిన హృద్యమైన ఈ ఆద్య- ప్రారంభ, పద్య ప్రసూనా- (పుష్పా)నికి ఉన్న ఆరు దళాలలో ‘భక్తపాలన కళా సంరంభకున్’ అన్న తృతీయ దళ పరిమళమే, దంతావళ (గజ) రాజు చింతను అంతమొందించిన శ్రీకాంతుని ఈ వింత గొలిపే కమనీయ కథా కలాపం- గజేంద్ర మోక్షణం! ఆపదలో చిక్కి దిక్కు తెలియక అసహాయులై కరణ కళేబరాలతో- దేహేంద్రియ సమర్పణ పూర్వకంగా, శరణన్న భక్తులను ఆదుకొని అక్కున చేర్చుకోవడంలో భగవంతుడు చూపే మక్కువను, ఆయన పడే సంరంభానికి- తొట్రుపాటుకు, చేసే హడావిడికి, సందడికి, భక్తిరసం కట్టలు తెంచుకొని పారిన ఈ ఘట్టం ఎంతో అట్టహాసంగా పట్టం కడుతుంది!
ఘోరాటవిలో మడుగులోని మకరితోటి పోరాటంలో ఆరాటపడి, అలసిపోయి, పసచెడి కొస ఊపిరితో ఊగిసలాడుతున్న కరి (ఏనుగు)- ‘నీవే తప్ప ఇతఃపరం బెరుగ.. రావే ఈశ్వర! కావవే వరద!’ అంటూ పరిపరి విధాల హరిని ప్రార్థించింది. పోతన ఉవాచ: ఇభ (గజ)రాజు ఇలలో వలచి తలచిన సమయంలో విష్ణువు గగన తలంలో అల- అల్లంత దూరాన ఎక్కడో వైకుంఠపురంలో విలసిల్లుతున్నాడు. అందునా, నగరి- అంతఃపురంలో ప్రధాన భవనానికి దక్షిణాన ఉన్న మందార వృక్షాల వనంలోని అమృత సరస్సును ఆనుకొని కాంతులీను ఇందు- చంద్రకాంత మణుల వేదిక మీద కలువ పూల పానుపుపై చెలువు (సొగసు) మీర దేవేరి ఇందిరతో ఇందీవర శ్యాముడు శ్రీకాంతుడు ఏకాంతంలో సరసాలాడుతున్నాడు. ఆ రసపట్టులో ఎవరు ఎంత మొరపెట్టినా, గీపెట్టి ఎంతగా తలుపు తట్టినా, ఎట్టి దుస్థితిలో ఉన్నా.. పట్టించుకునే పరిస్థితి కాదది. కానీ, ‘ఆపన్న ప్రసన్నుండు’ కాన స్వామి ఆ సుధాస్వాదన సమయంలో కూడా గజేంద్రుని ‘పాహి పాహి’ (రక్షించు రక్షించు) అన్న వ్యథాభరితమైన ఆర్తనాదం విన్నాడు. వారణ (గజ) పతి ఆపద నివారణకై భోగిరాజశయనుడు విశ్వపతి వేగిరపడ్డాడు. ఈ సన్నివేశాన్ని మహాకవి ఒక మత్తేభవృత్తంలో ఇలా చిత్రించాడు, చిత్తగించండి:
విష్ణువు వైకుంఠంలో ఉన్నప్పటి స్థితిగతులను కల్పనా చాతురితో అనల్ప రమణీయంగా శబ్దశిల్పంగా మలచి లబ్ధప్రతిష్ఠుడయ్యాడు రససిద్ధకవి పోతన. ఈ వరుసలో అమాత్యుడు పోతన కల్పించిన పూతరేకులు, చూతఫలాల వంటి పలు పద్యాలు శ్రుతి మధురంగా అతి రసవత్తరంగా సాగాయి. ఆదిదంపతుల అమలిన సింగారంతో రంగరింపబడిన భక్తి రసమహోజ్జల తరంగాల వంటి ఈ పద్యాలు అంగరంగ వైభవంతో భావుక భక్తులకు కొంగుబంగారమై అలరారుతున్నాయి!
కరీంద్రుని ప్రాణాలను కాపాడాలనే కనికరం, ఉత్సాహంతో నిండిన శ్రీహరి ఈ ముచ్చటను శ్రీదేవికి కూడా తెలపలేదు. ఆయుధాలు శంఖచక్రాలను కూడా చేతులలో ధరింపలేదు. అనుచరులను- సేవకులను ఎవరినీ పిలవలేదు. సిద్ధంగా ఉండమని సుపర్ణునికి (గరుడునికి) సూచించలేదు. చెవుల దుద్దులపై వాలుతున్న జుట్టును చక్కదిద్దుకోలేదు. పానకంలో పుడకలాగ వినోదంలో విఘ్నం కలిగిందన్న విషాదం వల్ల ఏర్పడిన వివాదం- ప్రణయ కోపంతో లేచి వెళ్లిపోతున్న లక్ష్మీదేవి వక్షఃస్థలం మీది పైటకొంగును కూడా కంగారుతో విడువక మైమరచి వడివడిగా వినువీధిలో పడిపడిపోతూ ఉన్న ఆర్తత్రాణ పరాయణుని అమాత్యుడు మరో మత్తేభ వృత్తంలో చిత్రీకరించాడు చూడండి..
‘భగవంతుని కొరకు భక్తుడు పడే తపన కన్నా.. భక్తుని కోసం భగవంతుని తపన మిన్న’ అన్న వివాదరహిత భక్తి సిద్ధాంతం ఈ పద్యం ద్వారా పరిపుష్టం గావించబడింది. ఈ పద్యానికి సంబంధించిన ఒక కథ లోకంలో బహుళ ప్రచారంలో ఉంది. శ్రీనాథ, పోతన్నలు బావ బావమరదులని కదా ప్రసిద్ధి! శ్రీనాథుడు రాజాశ్రయం సంపాదించి సంపన్నుడై రాజభోగాలను అనుభవిస్తూ సార్థక నామధేయుడయ్యాడు. పోతన మాత్రం భక్తినే సంపదగా ఎంచి, దారిద్య్రమే వ్రతంగా భావించి తన భాగవతాన్ని నరులకు గాక నారాయణునకే అంకితం గావించిన పుణ్యకీర్తి! నరులలో నారాయణమూర్తి!
‘విశ్వశ్రేయస్సే పరమ లక్ష్యంగా గల ఈ పవిత్ర భాగవత గ్రంథాన్ని మనుజాధములైన- హీన చరిత్రులైన మానవేశ్వరులకు- రాజులకు అంకితమిచ్చి, వారిచ్చే ధనధాన్య వస్తు వాహన గృహ అగ్రహారాలు గ్రహించి, ఆ పడుపు కూటికి ఆశపడి, కళంకిత జీవనం గడిపి, కాలధర్మం చెందిన తర్వాత కాలుని- యముని సమ్మెట దెబ్బలకు లోనుకాకుండా, ఈ బమ్మెర పోతన మాత్రం భాగవతాన్ని శ్రీహరికే సమర్పించాడు’. బావమరది అయిన పోతన భాగవతంలో చేవగల దోషం ఏదైనా ఎత్తి చూపిస్తే ఆయన తనకు లొంగి ఆ గ్రంథాన్ని ఏ ప్రభువుకైనా అంకితమిచ్చి దారిద్య్రం పోగొట్టుకొని తనలాగానే సుఖపడతాడేమో! అన్న సద్భావం- భ్రమతో- ‘బావా! ‘శంఖ చక్రయుగముం జేదోయి సంధింపడు’ అని రాశావే! ఆయుధాలు ధరించక చేతులు ఊపుకొంటూ వెళ్లిన చక్రధారి శ్రీహరి గజేంద్రుని ఎలా రక్షిస్తానని ఎంచాడు?’ అని అధిక్షే(ఆక్షే)పించాడు. శ్రీనాథుడు ఇంటి బయట ఉండగా మేనల్లుడు- ‘మామయ్యా! నీ కూతురు నూతిలో పడ్డది’ అని కేకవేశాడు. అది విన్న శ్రీనాథుడు తత్తరపడి బిత్తర చూపులతో ఉత్తచేతులతోనే వచ్చి బావి చుట్టూ తిరగడం చూచి బావమరది పోతన ‘బావా! రిక్తహస్తాలతో ఏమి చేద్దామని వచ్చావు?’ అంటూ ఫక్కున నవ్వాడట! (సశేషం)
-తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ , 98668 36006