ఒకసారి రమణ మహర్షి ఎదుట ఓ భాగవత పండితుడు పోతన భాగవతంలోని దశమ స్కంధం పారాయణం చేయసాగాడు. కథ కృష్ణుడు మథుర వెళ్లిపోతున్న ఘట్టానికి చేరుకుంది. గోకులం విడిచి వెళ్తున్న కృష్ణుడి కోసం గోపికలు విలపిస్తున్న సందర్భానికి సంబంధించిన పద్యాల దగ్గరికి వచ్చేసరికి రమణులు ఉద్విగ్నులయ్యారు. కండ్ల నుంచి ఉబికి వచ్చిన కన్నీళ్లను తుడుచుకుంటూ, ఆ పండితుడిని పారాయణం ఆపేయమన్నారు. ‘జ్ఞానం గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. భక్తి దగ్గరికి వచ్చేసరికి తట్టుకోలేం. అదంతే!’ అన్నారు రమణులు. తరచూ పోతన భాగవత పద్యాలు చదివించుకునేవారు మహర్షి. వాటిపై భక్తులకు వివరణ ఇస్తుండేవారు. ఎప్పుడు, ఎవరు భాగవతం చదివినా రమణ మహర్షి భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు. l మనోజ్ఞ