అమరావతి: భక్తులకు కొంగుబంగారంగా, ఆంధ్రప్రదేశ్లో చిన్న తిరుపతిగా విరాజిల్లుతున్న పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఓ భక్తుడు భారీ విరాళాన్ని వస్తు రూపేణా అందజేసి స్వామివారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. హనుమాన్ జంక్షన్కు చెందిన పర్వతనేని పాండురంగారావు అనే భక్తుడు రూ.17లక్షల వ్యయంతో బంగారు పూతతో తయారు చేయించిన ఊయాలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. దీంతో పాటు బంగారు పాదుకలను స్వామివారికి సమర్పించుకున్నారు.
ముందుగా వాటిని ఆలయ జంట గోపురాల వద్ద నుంచి అనివెట్టి మండపం మీదుగా తూర్పు రాజ గోపురం నుంచి ప్రధానాలయంలోకి తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ జరిపి బంగారు ఊయలను, పాదుకలను స్వామివారికి సమర్పించారు. అనంతరం దాత పాండురంగారావు స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.