శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది. అమరులను, అసురులను వేరు చేసి రెండు వరుసలుగా కూర్చోపెట్టింది. వదిన.. మరుదుల వావివరుసలు కలుపుతూ అసురులకు వేరు వరుస ఏర్పర్చడం వారిని వంచించడానికే! ఇదే అమృతోత్పాదన సాధనలో ఆధ్యాత్మపరంగా గీతలోని ‘దేవాసుర సంపద్విభాగ’ యోగానికి సంకేతం. ఎప్పటికైనా దైవీ సంపద (శుభవాసనల) వల్లనే అమృతప్రాప్తి- ముక్తి! అసుర సంపద (అశుభ వాసనల)కు సంసార బంధనమే గతి! ఇదే గీతాబోధకు అంతిమ ఫలశ్రుతి!
‘దైత్యులారా! తొందరపడి చిందర వందర అవకండి. తడవు (ఆలస్యం) చేయకుండా వస్తా. హడావుడి పడకండి కడదాకా నెమ్మదిగా కూర్చోండి’ అంటూ మోహిని మాయమాటలతో, మందహాసాలతో, మర్మస్థానాల మరుగు తొలగిస్తూ, మరులు గొల్పుతూ వారిని వంచించి మైమరపించింది. ఇటు, ‘ఆలసించక ఆరగించండి’ అంటూ అమరులకే అమృతం పంచింది. మోహిని మీది మోహంతో ఆమె చూపులకు కరిగిపోయి దానవులు ‘దాసోహం’ అని కుదురుగా కూర్చున్నారే కానీ, ‘ఎదురు మాట్లాడితే బెదిరిపోయి తిరిగి చూడదేమో! అలుకతో ఆ కులుకులాడి బదులు పలకదేమో!’ అని జంకుతూ ‘ఓ కుందరదనా- సుందరీ! మందుతో మాకు తొందరగా విందు చెయ్యి’ అని గట్టిగా మందలించలేకపోయారు ఆ మందమతులు. మదిర, మదిరాక్షి- ఈ ఇద్దరిలో మదిర (మద్యం)ను పానం చేస్తేనే మత్తు. కానీ, మదిరాక్షి- కామిని ధ్యానం, దర్శనం చేతనే ఉన్మత్తతతో గమ్మత్తుగా చిత్తు చేస్తుంది.
పరీక్షిన్మహారాజా! మోహిని అమృతాన్ని అమరులకే పోయడం గమనించి రాహువనే రాక్షసుడు రహస్యంగా దేవ రూపంతో దేవతల వరుసలో సూర్యచంద్రుల సరసన చేరాడు. ఒక బిందువు వాని నోట్లో పడిందో లేదో ఇందు (చంద్ర)సూర్యులు అరవిందానన మోహినికి కంటిసైగ చేశారు. వెంటనే అరవిందాక్షుడు- విష్ణువు చక్రంతో ఇంద్రశత్రువు తల ఖండించాడు. అమృతంతో తడిసి అమరమైన ఆ తలను అరవింద భవుడు- బ్రహ్మ ఆకాశంలో ఒక ఛాయా గ్రహంగా నెలకొల్పి ఆదరించాడు. రాహువు మొండెం నేల మీద కూలిపోయింది. కనుక, కబంధం (మొండెం) కేతువు కాదని భాగవత మతం. ‘రాహుచ్ఛాయా స్మృతః కేతుః’ రాహువు ఛాయే కేతువుగా పరిణమించిందని పండితుల మతం.
పోతనామాత్యుడు మూలాన్నే అనుసరించి అనువదించాడు. తనను పట్టించారని పగపూని ఆగ్రహంతో ఆ గ్రహం గగనతలంలో అమావాస్య, పూర్ణిమలలో ఆదిత్య చంద్రులను గ్రహణ రూపంగా ఈనాటికీ పట్టి పీడిస్తున్నది. ఈ పురాణగాథ ఎలా ఉన్నా అగాథమైన అధ్యాత్మశాస్త్ర రీత్యా బ్రహ్మాండంలోని చంద్ర సూర్యులే శరీరం (జీవుని)లోని మనోబుద్ధులు. సూర్య చంద్రులకు గ్రహణం పట్టినా అది అల్పకాలికం. కొంత తడవుకాగానే వారు విడివడతారు. కానీ, మనిషి మనోబుద్ధులకు అవిద్య- అజ్ఞానం అనే గ్రహణం పడితే ఎంత ప్రమాదం? ‘బుద్ధి నాశాత్ ప్రణశ్యతి’ అని గీతా వచనం. బుద్ధి నశిస్తే మానవత్వమే మంట కలుస్తుందన్నమాట! బుద్ధి నాశనమంటే యోగ్యబుద్ధి- సన్మతి, సుమతి నశిస్తుందని తాత్పర్యం. బుద్ధికి ఫలమైన ప్రజ్ఞలోపిస్తే- పాడైపోతే స్థితప్రజ్ఞుడు గతప్రజ్ఞుడు అవుతాడని హెచ్చరిక!
కం॥‘ఒక బొట్టుఁజిక్క కుండగ
సకల సుధారసము నమర సంఘంబులకున్
బ్రకటించి పోసి హరి దన
సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్.’
రాజా! ఒక చుక్క కూడా మిగలకుండా అమృతమంతా చక్కగా అమరులకే పంచిపెట్టి చక్రధరుడు హరి తన మోహినీ వేషం పరిహరించి మొదటి మగసిరి రూపాన్ని పొందాడు. ఇది చూచి దేవతల దాయాదులు (రాక్షసులు) మురారి మాయా మోహితులమై మోసపోయామని పరిపరివిధాల పరితపించారు.
రాజా! ‘సురులు అసురులు ఇద్దరూ సరిసమానంగా ప్రయత్నం, శక్తి సామర్థ్యాలు, అర్థ సంపద, ఆత్మ గౌరవం కలిగిన వారే. ఒకే విధమైన పరిశ్రమ. క్షీరసాగరమూ ఒకటే. మందర మంథానం (కవ్వం), మంథన క్రియా ఒకటే. అమృతసిద్ధి అనే సంకల్పం కూడా ఒకటే. అయినా ఫలంలో వికల్పం (భేదం) వచ్చింది. అచ్యుత భగవానునికి అర్పితులైన అమరులు సఫలురు కాగా అహంకార దర్పితులై, విష్ణువుకు విముఖులైన విబుధారులు- అసురులు విఫలులయ్యారు. కరుణామయుడైన కమలాక్షుని శరణు వేడనివారు కల్యాణా(శుభా)లను కనలేరుగదా!’ అని ఈ మత్తేభవృత్తంలో అమృత మథన కథనానికి సూనృత (సత్య)మైన తాత్పర్యాన్ని అందంగా అందించాడు అమాత్యుడు పోతన.
మ॥‘అమరుల్ రక్కసులుం బ్రయాస బల సత్తార్థాభిమానంబులన్
సములై లబ్ధవికల్పులైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
య్యమరారుల్ బహుదుఃఖముల్ గనిరి తామత్యంత దోర్గర్వులై
కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ గల్యాణ సంయుక్తులే?’
రాజా! సముద్రాన్ని శోధించి (చిలికి), సుధను సాధించి, సురారు (రాక్షసు)ల కన్నుగప్పి వారిని నిరోధించి (అడ్డగించి), అమృతాన్ని అమరులకే విభజించి- పంచి, వారికి తగువిధంగా బోధించి విష్ణువు వైనతేయు (గురుడు)నిపై విరాజిల్లి వైకుంఠానికి వెళ్లిపోయాడు. సంపూర్ణ క్షీరసాగర మథనానికి పరమార్థం.. వేదశాస్త్ర వాఙ్మయం లేక అంతఃకరణమే క్షీరసాగరం. ప్రేమాభక్తి అనే రజ్జువే- తాడే వాసుకి. మనస్సు అనే మందరగిరి కవ్వం ద్వారా సాగరాన్ని శోధించి సారాన్ని సాధించడమే మంథనం. చంచలమైన మనస్సు సంసార సాగరంలో మునిగిపోకుండా కూర్మ భగవానుడి రూపం కాని, నామం కాని ఆధారం కావాలి.
మథనము నిదిధ్యాసనం- ధ్యాన అభ్యాస ప్రక్రియ. ‘దేహాదులు నా స్వరూపం కాదు. నేను కేవల చైతన్యాత్మను’ అని హృదంతరంలో నిరంతర చింతనం. ఇది ఎలా సాధ్యం? అంటే, పాలకడలిలో వనమూలికలు, ఓషధులు వేసిన విధంగా, అంతఃకరణంలో వేదాంత శాస్త్ర స్వాధ్యాయ, శ్రవణాల ద్వారా ఉపనిషద్ మహావాక్యాల, ఇతర అవాంతర వాక్యాల పరమార్థాన్ని మననం చేస్తూ ఉండాలి. ఓషధులు, వనస్పతులనగా ‘అన్న ఉదకాలు’ అని కూడా వ్యాఖ్యాతలు విన్నవించారు. ‘యుక్తాహార విహారస్య’- (గీత) హితకరమైన ఆహారం మితంగా భుజిస్తే శరీరం తేలికగా ఉండి భజన, సాధనలు సులువు అవుతాయి. ఈ సాధన అంతటికీ భగవంతుని అనుగ్రహమే- ఆనుకూల్యతే అత్యావశ్యకమని స్మృతిలో ఉంచుకోవాలి. అంతిమంగా లభించే ఆత్మస్వరూప అనుభవమే అమృతప్రాప్తి! ‘శ్రేయాంసి బహువిఘ్నాని’- ఈ మంచి పనికి మధ్యలో, ఎన్నో మంచి-చెడు అనుభవాలు, సిద్ధులు! వీటికి లొంగితే అసలు ఫలసిద్ధి లేదు. చేదు అనుభవాలు ఎదురైనప్పుడు సతీసమేత సదాశివ ధ్యానం, శరణమే గతి! (సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006