తిరుమల : దీపావళి పండుగ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 4న ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది. ఏటా ఆశ్వయుజ మాసం అమావాస్య (దీపావళి) రోజున యథాప్రకారంగా వేంకటేశ్వరస్వామి వారికి సుప్రభాతం మొదలుకొని మొదటిగంట నివేదన వరకు కైంకర్యాలు జరుగుతాయి. అనంతరం ఉదయం 7 నుంచి ఉదయం 9 గంటల వరకు బంగారువాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుంది.
ఆస్థానంలో భాగంగా మలయప్పస్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వభూపాల వాహనంలో గరుడాళ్వార్కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన విష్వక్సేనులవారిని స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణాభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తర్వాత స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు.
దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుంది. కాగా, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. దీపావళి ఆస్థానం కారణంగా నవంబర్ 4న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం వర్చువల్ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.