TTD News | తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు. అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించారు.
ఈ సందర్భంగా ఈఓ ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా ‘దీపావళి ఆస్థానాన్ని’ శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈఓ ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుడు వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ, భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు.
ఈ ఆస్థానంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఆలయ ప్రధానార్చకుడు కృష్ణశేషాచల దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ దీక్షితులు, బోర్డు సభ్యులు మారుతి ప్రసాద్, న్యూఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, డీఎల్ఓ రెడ్డెప్పరెడ్డి, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ రమేష్ బాబు, పేష్కార్ శ్రీహరి, వీజీఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.