శ్రీశైలం : శ్రీశైల మహాక్షేత్రంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న స్పష్టం చేశారు. శనివారం పరిపాలన భవనంలో రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెలవు దినాలు ప్రకటించడంతో వివిధ ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానంగా స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకున్న సర్టిఫికెట్ను చూపించాల్సి ఉంటుందన్నారు. చంటిబిడ్డల తల్లిదండ్రులు కొద్ది రోజులు శ్రీశైల యాత్ర వేయిదా వేసుకోవాలని సూచించారు.
క్షేత్ర పరిధిలో భక్తులందరూ మాస్క్ ధరించేలా చూడడంతో పాటు అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. క్యూలైన్లు, అభిషేక మండపాలు, యాగశాలలు, లడ్డూ విక్రయశాల, వసతి విభాగాలు, డార్మెటరీ, కేశఖండనశాలలతోపాటు వ్యాపార సంస్థల వద్ద జనం గుంపులు గుంపులుగా ఉండకుండా భక్తులకు సూచనలు చేయాలని సెక్యూరిటీ విభాగాన్ని ఆదేశించారు. దేవస్థానం అధికారులు, సిబ్బందికి యాత్రికులు సహకరించాలని కోరారు. క్షేత్ర పరిధిలో కొవిడ్ నిబంధనల పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారికి జరిమానాలు విధిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఇన్స్పెక్టర్ రమణ తెలిపారు. సమావేశంలో ఎమ్మార్వో రాజేందర్ సింగ్, మండల వైద్యాధికారి సోమశేఖర్, ఈఈ మురళీ, అధికారులు పాల్గొన్నారు.