‘ప్రధానాంశ స్వరూపాయ దేవసేనా చ నారదా
మాతృకాశ పూజ్యతమాసా షష్ఠీచ ప్రకీర్తితా॥
ప్రకృతి మాత అయిన ఆదిపరాశక్తి ఆరవ అంశావతారమే ‘షష్ఠీదేవి’. స్కందుడి భార్యగా సురాసుర సంగ్రామంలో దేవతలకు జయం చేకూర్చినందున ఆమెకు ‘దేవసేన’ అనే పేరు వచ్చింది. శిశువులకు, బాలికలకు ఆమె అధిష్టాత్రి, బలవర్దిని, విష్ణుమాయా స్వరూపిణి. అంతేకాదు, ఆమె ఆయుఃప్రద, పిల్లలకు పెంపుడు తల్లి వంటిది. రక్షణకారిణి, యోగ మాయారూపంలో పురిటింట శిశువుల పక్కనే ఉండి సంరక్షించే జగన్మాత.
పూర్వం ప్రియవ్రతుడు, మాలినీదేవిలకు లేకలేక కలిగిన బిడ్డ మృతశిశువు కావడంతో వారు పుత్రశోకం భరించలేక ప్రాణాలను త్యజించడానికి సిద్ధపడ్డారు. ఆ బాలుని శరీరాన్ని ఖననం చేయకుండానే రోదిస్తున్న సమయంలో ఒక దివ్యవిమానం ఆకాశమార్గాన వచ్చింది. అందులో కోటికాంతులు, తెల్లని వస్ర్తాలతో, పుష్పమాలికలతో వెలిగిపోతూ ‘దేవసేన’ వారికి దర్శనమిచ్చింది. ఆ తల్లి వారి మృత శిశువుని చేతుల్లోకి తీసుకొని పునర్జీవితుడ్ని చేసింది. ‘ముల్లోకాలకు రాజువైన నీవు సకల లోకాలలో నాకు పూజలు జరిపిస్తూ, మీరు కూడా జరుపుతూ ఉండండి’ అని వారిని ఆజ్ఞాపించింది. అప్పట్నించీ ఆ రాజు ప్రతీ శుక్లపక్ష షష్ఠినాడు ఇంటింటా ‘షష్ఠీదేవి మహోత్సవాలు’ జరిపించాడు. పురిటిండ్లలో 6వ, 11వ, అన్నప్రాసనల రోజు, ఇంకా ప్రతి శుభకార్యంలోను ‘షష్ఠీపూజలు’ భారతీయులకు అలా ఆచారమైనాయి.
తల్లిగర్భంలో శిశువు పడింది మొదలు, 14 ఏండ్ల ప్రాయం వచ్చేవరకు అనేక గండాలు ఉంటాయి. వీటన్నిటినీ దాటించడానికే దైవాంశమైన ‘మాతృకాశక్తులు’ ఉంటాయి. వాటికి అధిష్టాన దేవతే ‘దేవసేన’. ఈ దేవసేనాపతి సుబ్రహ్మణ్యుడు. ‘దేవసేనా సమేత సుబ్రహ్మణ్యస్వామి’ పూజతో వంశవృద్ధి కలుగుతుంది. సత్సంతానమూ పొందవచ్చు. ఆమె పురిటింటి దేవతకూడా. ఆమెకు ప్రత్యేకమైన జ్ఞానపూజా స్తోత్రమంత్రాలున్నాయి. ‘దేవీ భాగవతం’లోని ‘నవమస్కంధం’లో షష్ఠీదేవి ఆరాధన ఉంది. ఆమె కటాక్షం కోసం పూర్వం ఒక ఏడాది దాక ప్రతినెలా శిశువుకు పుట్టినరోజులు జరిపేవారు. కొందరు దానిని కొనసాగిస్తున్నారు.
శిశువు జన్మదశ ఎంతో సున్నితమైంది. ఒక జీవుడు పుట్టిన దగ్గర్నుంచి రెండవ ఏడు వచ్చేవరకు పసిబిడ్డ శరీరం అతిసున్నితంగా ఉంటుంది. ఆ సమయంలో బాహ్య దుష్టశక్తుల నుంచి పలు ప్రమాదాలు పొంచి ఉంటాయి. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మన శాస్త్రమూ చెప్పింది. రెండవ యేటివరకు శిశు సంరక్షణ చేయగలిగే శక్తి ‘షష్ఠీదేవి’కి మాత్రమే ఉంటుంది. పుట్టినప్పుడు ప్రతి జీవినీ కొన్ని బాలగ్రహాలు వెంటాడుతూ పీడిస్తుంటాయని, పుట్టినప్పటి నుంచి 14వ ఏడు వరకు ఈ మాతృకగ్రహాల బాధ నుంచి బయటపడాలంటే ‘దేవసేనా సహిత సుబ్రహ్మణ్యస్వామి’ని ఆరాధించాలని ‘మహాభారతం’లో మార్కండేయ మహర్షి ఉద్బోధించాడు. స్త్రీ గర్భవతి అయిప్పట్నుంచి ప్రతి మాసం శుద్ధదశమినాడు ఈ పూజ చేస్తూ, బిడ్డ పుట్టిన 6వ రోజు, 11వ రోజు, 21వ రోజు ఆ అమ్మవారును కొలవడం వల్ల పిల్లలకు ఆయుష్షు పెరుగుతుంది. షోడశ సంస్కారాలప్పుడూ ఆమెను పూజించటం శుభదాయకం. జలంలో, స్థలంలో, అంతరిక్షంలో తిరుగుతూ ఈ తల్లి శిశువులను సంరక్షిస్తుంటుంది.
ప్రకృతిలోని అన్ని రూపాలలో దేవసేన శ్రద్ధగా కొలువై ఉండి, సదా శిశువులను కాపాడుతుంటుంది. మన కంటికి కనబడకపోయినా శిషు స్థానంలో చుట్టూ శక్తిరూపంలో ఉంటుందట. ఎప్పుడైతే ఆ తల్లిని ప్రార్థిస్తామో అప్పుడు సుబ్రహ్మణ్యస్వామి వద్ద నవయవ్వన రూపంలో ఉన్న ఆ తల్లి వృద్ధ రూపిణిగా మారి శిశువునకు ఆయువు, ఆరోగ్యం, క్షేమం వృద్ధి అయ్యేలా చేస్తుంది. సాలగ్రామంలో, మంగళ కలశంలో, వటవృక్ష మూలంలో షష్ఠీదేవిని ఆవాహన చేసి ఆరాధించవచ్చు. ఈ తల్లిది అత్యంత దయాహృదయం. ఈ కరోనా సంక్లిష్ట పరిస్థితుల నుంచి కూడా మనందరిని కాపాడాలని మనసారా ఆమెను ప్రార్థిద్దాం.
వేముగంటి శుక్తిమతి
99081 10937