పురుషో రామచరితం శ్రవణైరుపధారయన్
ఆనృశంస్యపరో రాజన్కర్మబన్ధైర్విముచ్యతే ॥
‘ఓ పరీక్షిత మహారాజా! శ్రీరామచంద్రుని లీలా గుణగణ వైభవాన్ని గురించి ఎవరైతే వింటారో వారి మదిలోని ఈర్ష్యలన్నీ తొలగి కర్మబంధనాలనుండి విముక్తిని పొందుతారు’ (శ్రీమద్భాగవతం: 9.11.23).
శ్రీరామచంద్రుని లీలా వర్ణనలే రామచరితం. ఇది విన్నవారు ‘ఈర్ష్య’ అనే జబ్బునుండి ఉపశమనాన్ని, అదే సమయంలో ముక్తినీ పొందుతారు. దేవాదిదేవుడైన శ్రీరామచంద్ర ప్రభువు ఆదర్శవంతమైన రాజుగా, ధర్మబద్ధమైన పరిపాలనను స్థాపించడానికే లోకంలో అవతరించారు. వారి దివ్యావిర్భావ తిథియే ‘శ్రీరామనవమి’. ఆయన వైభవాన్ని విని, లోకమంతా తరించేలా పురుషోత్తముడైన ఆ శ్రీరామచంద్ర ప్రభువు అనేకానేక లీలలనుకూడా గావిస్తుంటారు.
ఆనాటి రామరాజ్యం ఎలా వుండేదో శ్రీమద్భాగవతం ఎంతో హృద్యంగా కండ్లకు కట్టింది.‘భగవంతుడైన శ్రీరామచంద్రుని పాలనలో ప్రజలకు ఎలాంటి దైహిక- మానసిక క్లేశాలు లేవు. వ్యాధులు, దుఃఖం, శోకం, భయం, అలసట, నష్టం వారి దరిదాపులకైనా రాలేదు’ (శ్రీమద్భాగవతం: 9.10.53). శరణన్న వారెవరినైనాసరే తాను రక్షిస్తానని శ్రీరాముడు లోకానికి చాటి చెప్పాడు. “ఎవరైనా నన్ను ఒక్కసారైనా నిజంగా శరణు వేడి, ‘స్వామీ! ఈ రోజు నుండి నేను నీ వాడను. నాకు అభయమివ్వమని’ ప్రార్థిస్తే, వారికి ఆ క్షణం నుండి అభయమిచ్చి సర్వదా సంరక్షిస్తాడు (రామాయణం, యుద్ధకాండ: 18.33). రామనామాన్ని జపిస్తూ అందరం ఈ పండుగ వేళ స్వామిని శరణు వేడుదాం.
రాజైనవాడు భగవంతుని ప్రతినిధివలె వ్యవహరించటంలో తగిన శిక్షణ పొందినవాడైతే రాజ్యం సుభిక్షంగా వుంటుంది. పాలకులు ప్రజలంతా శ్రీకృష్ణుని లేదా శ్రీరాముని దివ్యనామాలను జపించేలా ప్రోత్సహించాలి. ప్రజల్లో ఆదర్శ జీవనానికిగల స్ఫూర్తిని కలిగించటంలో ‘శ్రీరామచరితం’ ఎంతగానో తోడ్పడుతుంది. అప్పుడే లోకం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లుతుంది. అదే ఈ లోకానికి శ్రీరామరక్ష.
హరే కృష్ణ!
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984