గురువుకు ఎప్పుడూ అంత ప్రాధాన్యం ఉండటానికి కారణం, ‘తాను లేకుండా మీకుగా మీరు సరైన మార్గంలో ప్రయాణించలేరు’ కనుక. మీకు తెలిసిన విషయం దిశగా కృషిచేయడం సాధ్యమవుతుంది. కానీ, తెలియని దారిలో ఎలా వెళ్లగలరు? సృష్టిలోని అన్ని అంశాల్లోనూ, శక్తి సంబంధమైన వాటి సహజ ధోరణులనూ చూడగలిగే ఎరుక మనిషికి ఉండాలి. అప్పుడు ‘గురువు లేకుండా’నైనా ‘ముందడుగు’ వేయగలరు. ‘గురు సాన్నిధ్యం’ ఏ కొందరికో లభిస్తుంది, అనేకులకు లభించదు. దేనివల్ల కొందరికే ఈ అవకాశం లభిస్తుంది? ఉదాహరణకు.. నేను ఒక టార్చిలైట్ ఇచ్చినా, మీరు దానితో ఇంటికి కచ్చితంగా చేరగలుగుతారని లేదు. మురుగ్గుంటలోనో, గుంటలోనో పడకుండా మీకు టార్చిలైట్ వెలుగు చూపిస్తుంది, అంతే. కానీ, ‘దాన్ని ఎలా వాడాలి, సరైన మార్గం ఏది? ఎటువైపు వెళ్లాలి?’.. వంటి నిర్ణయాలు మాత్రం మీ చేతుల్లోనే ఉంటాయి. ఎంతోమంది టార్చితో కూడా వారి మరణం దిశగానే నడిచారు. కారణం ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. గురువు లభించినా, ‘మీరు ఏం చేస్తారన్నది’ చివరికి మీకే వదిలి వేయబడుతుంది.
ఒక ఉదాహరణ. మొత్తం భూగోళం మీది యూదులందరికీ నేత అయిన జాషువా గోల్డ్బర్గ్, భగవంతునితో కలిసి తన వార్షిక విందుకు వెళ్లారు. అక్కడ భగవంతుడు వచ్చి ఆయన టేబుల్ వద్ద కూర్చున్నాడు. కొన్ని బ్రెడ్ ముక్కలు విందులో వడ్డించారు. భగవంతుడు సంప్రదాయానుసారం ‘గ్రేస్’ చెప్పి, తినడం మొదలుపెట్టాడు. జాషువా తినడం లేదు. భగవంతుడు ఆయన వైపు చూసి, ‘జాషువా, కుమారా! నీవెందుకు తినడం లేదు?’ అని అడిగాడు. ‘తండ్రీ,! మిమ్మల్ని ఒక ప్రశ్న వేయవచ్చా?’. ‘తప్పకుండా’. ‘ప్రియమైన తండ్రీ! నిజంగా మేము ఎన్నుకోబడిన వారమా?’. ‘సందేహమెందుకు? మీరు ఎన్నుకోబడినవారే’ సమాధానమిచ్చాడు. జాషువా మళ్లీ, ‘తండ్రీ! మేము నిజంగా, నిజంగా ఎన్నుకొనబడినవారమా?’. ‘అవును జాషువా! సందేహం ఎందుకు మొదలైంది? మీరు ఎన్నుకోబడినవారే’. జాషువా మళ్లీ అదే ప్రశ్న అడిగాడు, ‘ప్రియమైన తండ్రీ! మేము నిజంగా, నిజంగా, నిజంగా ఎన్నుకొనబడిన వారమా?’. ‘అవును, అవును, అవును. మీరు నిజంగానే ఎన్నుకొనబడినవారు’ అన్నాడు దేవుడు. అప్పుడు జాషువా లేచి తన జాకెట్ సర్దుకొని, ‘కొంతకాలం పాటు మరొకరిని ఎవర్నయినా ఎందుకు ఎంచుకోకూడదు తండ్రీ?’ అన్నాడు. ‘అటువంటి అద్భుత అవకాశం అందరికీ లభించదు. ఏ కొందరికో ఎందుకు లభిస్తుంది?’ ఎందుకంటే, గురువు ఒక వ్యక్తికాదు, ఒక ‘సంభావ్యత’. దీన్ని అర్థం చేసుకోవాలి.
నా ముఖం చూడని ఎందరికో ఈ ‘సంభావ్యత’ అందింది. ఒక వ్యక్తిగా నా గురించి మాట్లాడుతుంటే, దానికి అంత ప్రాధాన్యం లేదు. ‘గురువుతో దగ్గరగా ఉండటం’ అనేది ఎప్పుడూ సౌకర్యంగా ఉండదు. ఎందుకంటే, ఆయన మీ సిద్ధాంతాలనీ, పరిమితులనూ విచ్ఛిన్నం చేస్తారు. ఒక వ్యక్తిని తెలియడం లేదా వారితో దగ్గరగా ఉండటం అనేది అనేక స్థాయిల్లో ఉండవచ్చు. ‘సంభావ్యత’ అనేది కేవలం ఒక వ్యక్తికి ఉన్న తీవ్ర ఆకాంక్ష వల్లే సిద్ధిస్తుంది. ఎందరో గురువుకు ఎంతో సన్నిహితంగా ఉండవచ్చు. అయినా, ఆ అవకాశానికి మాత్రం దూరంగానే ఉంటారు. గౌతమబుద్ధుడు ఈ విషయాన్ని చాలా అందంగా ప్రకటించాడు. తన జీవితమంతా ఎల్లప్పుడూ తనతోనే ఉన్నా ఆనందతీర్థులకు చివరిదాకా ‘జ్ఞానోదయం’ కాలేదు. ‘ఎందుకిలా?’ అని ఇతరులు ఆయనను ప్రశ్నించినప్పుడు సమాధానంగా గౌతమబుద్ధుడు, ‘చెంచాకి సూపు రుచి తెలుస్తుందా?’ అనేవారు. దీన్నిబట్టి ప్రతి ఒక్కరికీ జీవితంలో ‘సున్నితత్వం’ అవసరం. అది జీవ సంబంధమైన సున్నితత్వం అయి ఉండాలి. అంతేకానీ, అహంకారంతో కూడిన ‘సున్నితత్వం’ ఉండకూడదు.
సద్గురు
జగ్గీ వాసుదేవ్