ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కోరడానికేనా భగవంతుడున్నది! అసలు మనం కోరినవన్నీ ఆయనెందుకు ప్రసాదించాలి? కోరుకోకుండా ఉండలేమా!!
కోరేతీరుగా కోరితే భగవంతుడిచ్చే తీరుగా ఇస్తూనే ఉంటాడు. ఎప్పుడైనా సరే! కానీ, ఎన్నాళ్లీ కోరికలు-అని భక్తుడైనవాడు ఆత్మ పరిశీలన చేసుకోవాలి, చేసుకోకపోతే ఉన్నచోటే ఉంటాడు. సరే! ప్రాథమిక దశలో ఏవో కోరినా, అవి తీరినా, ఎన్నడో ఒకనాడు ఏదీ కోరని స్థితికి చేరుకోవలసి ఉంది.
‘నాకు వ్యాపారంలో బాగా లాభాలు రావాలి. కోట్ల రూపాయలు రాబడి వస్తే గుడి గోపురం కట్టిస్తాను. నాకీ పదవి వస్తే నీకీ పూజలు జరిపిస్తాను’ ఇలాంటివి అన్నీ హేతువుతో కూడుకున్న కోరికలు. ‘నాకిది ఇస్తే నీకిది ఇస్తా’- అనడం చిన్నపిల్లల మనస్తత్వమే కానీ మరొకటి కాదు. విధి లేక కొన్నేండ్లు ఏవో కోరికలు కోరి భగవంతుడి అనుగ్రహంతో నెరవేర్చుకోగలిగినా, యథార్థమైన భక్తుడు కోరికల పట్ల విసుగు చెందుతాడు. కోరడం మానుకుంటాడు. కానీ, భగవంతుడిని సేవించడం మాత్రం మానుకోడు. భగవంతుడి పట్ల ప్రేమ అంటే అదే! ‘సా పరమ ప్రేమ రూపా’ అని నారదుడు చెప్పిన భక్తి ప్రేమరూపం అటువంటిదే!కోరికల పట్ల విసుగు రాలేదంటే అతని భక్తి పరిపక్వ దశకు చేరుకోలేదని భావించాలి. అందుకే.. చైతన్య మహాప్రభువు తన ‘శిక్షాష్టకం’లో ఇలా పేర్కొన్నాడు.
న ధనం న జనం న సుందరీం
కవితాం వా జగదీశ కామయే
మమ జన్మని జన్మనీశ్వరో
భవతాద్ భక్తిః అహైతుకీ త్వయి
జగదీశ్వరా! నాకు ధనం వద్దు, సుందరులు వద్దు, కవిత్వం వద్దు, జన్మజన్మాంతరాల్లో నీయందు అహేతుకమైన భక్తి నెలకొని ఉండును గాక! అని దేవుడిని అర్థించాడు. ‘ఎందువల్లనో తెలియకుండానే భగవంతుణ్ని భజించడం కూడా ఉంది. ఈ స్థితి లభించిందా ఇక కోరదగ్గది ఏదీ ఉండదు. ఇలాంటి భక్తిని పొందిన వ్యక్తి ఇలా అంటాడు.. ‘పరమేశ్వరా! నాకు ఐశ్వర్యం వద్దు. కీర్తి వద్దు, సౌఖ్యం వద్దు, మరేమీ వద్దు- నీ పాదారవిందాల్లో నాకు వినిర్మల భక్తిని అనుగ్రహించు. అదే నాకు కావలసింది’ అంటారు రామకృష్ణ పరమహంస.
మనకేదో ఆపద కలిగితేనో, అవసరం ఏర్పడితేనో దేవుడు గుర్తుకువస్తాడు. అలాకాకుండా ఆపద కలిగినా, కలగకపోయినా, అవసరం ఏర్పడినా, ఏర్పడకపోయినా భగవంతుడు అనుకోకుండా గుర్తుకురావాలి. ఎప్పుడో ఒకసారి గుర్తుకురావడం కాదు. గుర్తులోనే ఉండాలి ఎప్పుడూ మరచిపోవడం అనేదే ఎప్పుడో ఒకసారి జరగవలసి ఉన్నది. అది కూడా జరగకపోతే మరీ మంచిది! భగవంతుడు తప్ప నాకు మరేదీ అక్కర లేదు..అనే స్థితి అదే! అటువంటి స్థితి ఆత్మారాములైన మునులకే సిద్ధిస్తుందని భాగవతం పేర్కొంటున్నది.
ధీరులు నిరపేక్షులు నా
త్మారాములునైన మునులు హరి భజనము ని
ష్కారణమ చేయుచుందురు
నారాయణుడట్టి వాడు నవ్య చరిత్రా!
ఆత్మారాముడు అంటే ఎప్పుడూ ఆత్మయందు రమించేవాడు, ఆత్మ చింతనమే చేసేవాడని. మునులు అంటే మౌనమే ప్రధానంగా అవలంబించే వారని అర్థం. అలాంటివారు నిష్కారణంగానే హరిని సేవిస్తూ ఉంటారు. ‘సా న కామయమానా నిరోధ రూపత్వాత్’ అనీ, ‘కామనా రహితం, ప్రతిక్షణ వర్ధమానం, అవిచ్ఛిన్నం’ అని నారదుడు భక్తి సూత్రాలలో ప్రతిపాదించిన పరాభక్తి అదే!
డా॥వెలుదండ సత్యనారాయణ
94411 62863