ఒక ప్రవచనకారుడు వివిధ దేశాలకు వెళ్లి ప్రవచనాలు ఇస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఓ దేశంలో ప్రవచన కార్యక్రమం ముగించుకుని విమానాశ్రయానికి వెళ్లాడు. వీడ్కోలు పలకడానికి కార్యక్రమ నిర్వాహకులు కూడా అక్కడికి వచ్చారు. వారిలో ఒకతను ఇటీవల మరణించిన తన స్నేహితుడిని తలచుకొని బాధపడటం ప్రారంభించాడు.
ప్రవచనకారుడు అతణ్ని అనునయిస్తూ.. అక్కడికి వస్తూ పోతూ ఉన్న విమానాలను చూడమన్నాడు. ‘చూశారా ఎన్ని విమానాలు వస్తున్నాయో! ఎవరు ఎక్కవలసిన విమానాన్ని వాళ్లు ఎక్కుతారు. చివరికి ప్రయాణికులు అందరూ వెళ్లిపోతారు. విమానాశ్రయంలో ఎవరూ ఉండరు కదా! మనిషి చావు పుట్టుకలు కూడా అంతే. ఇక్కడ ఎవ్వరికీ స్థిర నివాసం ఉండదు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ముందు పిలుపు అందుకున్న వాళ్లు.. ముందుగా వెళ్లిపోతారు. కొందరు కాస్త వెనుక. కానీ, ఎవరూ ఇక్కడ శాశ్వతంగా ఉండిపోలేరు! పుట్టినప్పటి నుంచీ మృత్యువు నీడలా వెంటాడుతుంది.
మనం పోయినప్పుడు ఆ నీడ కూడా మాయమవుతుంది. మృత్యువుకు భయపడి జీవన యానం ఆపడం లేదు కదా! మరి పోయినవారిని గుర్తు చేసుకోవడం మంచిదే! వారి జ్ఞాపకాలను తలచుకోవడమూ మంచిదే!! కానీ, వారి గురించి పదేపదే ఆలోచిస్తూ, కుంగిపోవడం సరికాదు! ఎప్పుడు పోతామో తెలియని ఈ జీవితాన్ని అనుక్షణం సద్వినియోగం చేసుకుంటూ, సంతోషంగా గడపడమే మనం చేయాల్సింది’ అని చెప్పాడు పండితుడు. స్నేహితుడి మరణానికి కుంగిపోతున్న ఆ మనిషి కొన్నాళ్లకు తేరుకున్నాడు. ఆనందంగా జీవనం కొనసాగించాడు.
…?ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821