‘రత్నైః కల్పిన మానసం హిమజలైః స్నానం చ దివ్యాంబరం’ అని మొదలయ్యే ఆది శంకరుల శివ మానస పూజా స్తోత్రంలో అన్నీ హృత్కల్పితాలుగా పేర్కొన్నారు. ‘హే పశుపతీ! హిమజలంతో స్నానం చేసి, దివ్య వస్ర్తాలు ధరించినావని, రత్నాభరణాలతో అలంకరించుకున్నావని భావించాను. చందనం, కస్తూరి అలదుకుని రత్న సింహాసనంపై ఆసీనుడవై ఉన్నావని అనుకున్నాను. మల్లె, చంపక పుష్పాలు, బిల్వ పత్రాలు, ధూపం, దీపం స్వీకరించు..’ ఈ సేవలన్నీ భక్తితో మానసికంగా సమర్పిస్తున్నాను అని ఈ శ్లోకం భావం. ఇలాగే ఆ ప్రసిద్ధ స్తోత్రంలో మరో నాలుగు శ్లోకాలు కనిపిస్తాయి.
ఏ భౌతిక సరంజామా లేకున్నా, మానసికంగా చేసే అర్చన. తమిళనాడులోని తిరువోట్రియూరులో పూసలారు అనే మహాభక్తుడు ఉండేవాడు. తను నమ్మిన దైవం అయిన శివుడికి భవ్యమందిరం కట్టించాలని కోరికగా ఉండేది. అయితే, గుడి కట్టించే స్తోమత పూసలారుకు లేదు. ఆ భక్తుడు తన మనసునే ఆలయంగా భావించాడు. ఆ రోజుల్లోనే ఒక పల్లవరాజు సమీపంలో శివాలయాన్ని నిర్మింపజేశాడు.
పడింతులను సంప్రదించి ప్రతిష్ఠ ముహూర్తాన్ని నిర్ణయించాడు. ప్రతిష్ఠకు ముందురోజు ఆ రాజు కలలో శివుడు కనిపించి ‘రేపు తీరిక లేదు. పూసలారు అనే భక్తుడి గుడిలో నా ప్రతిష్ఠ ఉంది. ముహూర్తం మార్చుకో!’ అన్నాడట. రాజు కుతూహలంతో తిరువోట్రియూరుకు స్వయంగా వెళ్లాడు. అక్కడ పూసలారు ఏ గుడీ కట్టలేదు. విచారిస్తే.. తన మనసే మందిరం అన్నాడు పూసలారు. రాజు ఆ భక్తుడికి సాగిలపడ్డాడు. అందరూ పరమానందం చెందారు. మనోవాక్కాయాలలో మొదటిదైన మనసుకే ప్రాధాన్యమున్న మానస పూజతోనే పరమాత్ముడు ప్రీతిపాత్రుడు అవుతాడు.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ