యంహిన వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ
సమదుఃఖసుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే॥ (భగవద్గీత 2-15)
‘పురుష శ్రేష్ఠుడవైన ఓ అర్జునా! సుఖదుఃఖాల్లో సమబుద్ధి కలిగిన ఏ ధీరపురుషుణ్ని ఈ విషయ స్పర్శలు బాధించలేవో అటువంటి వ్యక్తే మోక్షార్హుడు’ అంటాడు గీతాచార్యుడు. సుఖాలు, దుఃఖాలు చలింపజేయని స్థితికి వ్యక్తులు ఎదగాలన్న ఈ భావన వెనుక మనిషి ప్రస్థానం దృఢమైన మనసును సాధించే దిశగా ఉండాలన్న సందేశం ఉంది. సాధారణంగా మనిషి సుఖాల్లో సంతోషాన్ని, దుఃఖాల్లో బాధను పొందడం సహజమే! కానీ, మనోనిగ్రహాన్ని సాధించిన ఏ వ్యక్తి అయినా ఈ భావాల నుంచి తనను తాను నిగ్రహించుకోగలడు. అయితే అంతటి నిగ్రహాన్ని సాధించాలన్నప్పుడు అతనిలో అపారమైన మానసిక ధైర్యం, శక్తి అవసరం అవుతాయి.
ఆ దిశగా సాగే వ్యక్తి సాధన సాధారణంగా ఉండదు. అది అంత సులభమైనది కూడా కాదు. దానికి ప్రతివ్యక్తి కఠోరంగా శ్రమించాలి. ఆ శ్రమ శారీరకం కాదు, మానసికమై ఉండాలి. అంటే సుఖదుఃఖాలలో కలత చెందకుండా, ఈ వ్యయాన్ని అవ్యయంగా భావించి ప్రవర్తించగలగాలి. అంటే అతనిలో ఏది బ్రహ్మమో తెలుసుకునే అవగాహన సంపూర్ణంగా ఉండాలి. ‘ఏతదమృతం ఏతదభయం ఏతద్బ్రహ్మ ఇతి’- అన్న శ్రుతి వచనాన్ని బట్టి ఏదైతే అమృతమో అది అభయస్థానం, అదే బ్రహ్మస్థానం అని తెలుసుకునే విజ్ఞత, మానసిక దృఢత్వం కలిగి ఉండాలి. అప్పుడే అతని వ్యక్తిత్వం ఉన్నతంగా ఎదుగుతుందని అర్జునుడికి శ్రీకృష్ణపరమాత్మ ఉపదేశించాడు.
– శ్యామ్ ప్రసాద్