‘దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు’.. విశ్వగర్భుడు విష్ణువు అర్భక (శిశు) రూపంలో గర్భస్థుడై ఆవిర్భవించే ప్రతి సందర్భంలో హిరణ్యగర్భునికి (బ్రహ్మదేవునికి) ఆయనను స్తోత్రం చేయడం అభ్యాసం- ఆనవాయితీ. ‘నేను అవతరించి అవనీ (భూ) భారాన్ని అంతరింప చేస్తా’ అని ఇచ్చిన మాటను సత్యం చేసినందులకు ఆనందించి బ్రహ్మరుద్ర నారదాది అమరులు నిత్య విభూతి స్వరూపుని నారాయణుని సత్య పరాయణునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో స్తుతించారు… స్వామీ! అసత్యమైనదైనా సత్యంగా తోచు ఈ ప్రపంచానికి నీవే అంతర్యామివి- చైతన్య ప్రదాతవు, అధిష్ఠానం- ఆధారం. ‘అనేకంగా కనిపించే ఈ లోకాలన్నీ, ఓ పన్నగశాయీ! నీ కన్నా భిన్నంగా లేనే లేవు’ అని విన్నవిస్తూ ద్వైత ప్రపంచాన్ని వృక్షరూపంగా నిరూపిస్తున్నారు…
సీ॥ ‘ప్రకృతి యొక్కటి పాదు ఫలములు సుఖదుఃఖ
ములు రెండు గుణములు మూడువేళ్లు
తగు రసంబులు నాల్గు ధర్మార్థముఖరంబు
లెరిఁగెడి విధములైదింద్రియంబు
లారు స్వభావంబు లాశోకమోహాదు
లూర్ములు ధాతువు లొక్కయేడు
పైపొర లెనిమిది ప్రంగలు భూతంబు
లైదు బుద్ధియు మనోహంకృతులును’
తే॥ ‘రంధ్రములు తొమ్మిదియుఁ గోటరములు ప్రాణ
పత్ర దశకంబు జీవేవ పక్షియుగము
గలుగు సంసార వృక్షంబు గలుఁగజేయ
గావ నడగింప రాజ వొక్కరుడ వీవ’
‘ఆది దేవా! సమష్టి (బ్రహ్మాండ), వ్యష్టి (పిండాండ) రూపమైన ఈ అనాది సంసారం ఆదివృక్షం. ఎప్పటికైనా అసంగ- వైరాగ్యమనే గొడ్డలిచే అడ్డంగా నరకబడేది కాన వృక్షం.. ఎలాంటిది? దీనికి ప్రకృతియే పాదు. సుఖదుఃఖాలనేవే ఫలాలు. సత్త, రజః, తమోగుణాలు మూలాలు- వేళ్లు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు పురుషార్థాలు రసాలు. పంచ జ్ఞానేంద్రియాలు వీనిని గ్రహించే సాధనాలు. షడూర్ములు- ఆకలి దప్పికలు, శోకమోహాలు, జరా (వృద్ధాప్య) మరణాలు- ఈ ఆరూ వృక్ష స్వభావం. సప్త ధాతువులు.. త్వక్ (చర్మం), రక్త, మాంస, మేద (కొవ్వు), అస్థి, మజ్జ (మూలగ), శుక్ర (వీర్య)ములే చెట్టు బెరడు. పంచభూతాలు, మనో బుద్ధి అహంకారాలు- ఈ ఎనిమిదీ కొమ్మలు. నవ ద్వారాలు ఈ తరువుకు ఉన్న తొమ్మిది తొర్రలు. పది ప్రాణాలు (ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయములు) ఆకులు. జీవుడు, ఈశ్వరుడు- వీరిద్దరూ ఈ వృక్షం మీద ఉండే పక్షులు. (ముండక ఉపనిషత్తులో ‘ద్వాసుపర్ణా సయుజా సఖాయా’ అని జీవ, ఈశ్వరులను రెండు పక్షులుగానే పేర్కొనడం జరిగింది.
శరీరమనే వృక్షంలో హృదయమనే గూటిలో జీవుడు, ఈశ్వరుడు అనే రెండు పక్షులున్నాయి. రెంటిలో ఒకటి (జీవపక్షి) ఫలభోక్త- పుణ్యపాప కర్మల ఫలములైన సుఖదుఃఖాలను అనుభవిస్తూ ఉంటుంది. మరొకటి (పరమాత్మ) ఏమీ తినకుండా సాక్షియై చూస్తూ ఉంటుంది. అయినా జీవపక్షి కన్నా అధిక ఐశ్వర్య సంపన్నంగా ఉంటుంది). ఇట్టి విచిత్రమైన సంసారమనే చెట్టును పుట్టించడానికి, పెంచడానికి మరల తుంచివేయడానికి పురుషోత్తమా! ఎంచగా నీవే ఏకైక ఏలికవు- ప్రభువువి! మూలంలోని ‘ఏకాయనోసౌ’ అనే శ్లోకానికి శ్రీధరుని టీక- వ్యాఖ్యానం కూడా మేళవించి చాలా మేలిమి (విశదం)గా తెనిగించాడు అసదృశ (సాటిలేని) కవి, పుణ్యశ్లోకుడు- పవిత్ర చరితుడు పోతన. బ్రహ్మాది దేవతలు ఇంకా ఇలా వేడుకొన్నారు… పద్మనాభా! నీ పుట్టుకతో ఈ పుడమి భారం తొలగిపోతుంది.
కం॥ ‘ముచ్చిరి యున్నది లోకము
నిచ్చలుఁ గంసాది ఖలులు నిర్దయు లేఁచన్
మచ్చిగఁ గావగఁ వలయును
విచ్చేయుము తల్లి కడుపు వెడలి ముకుందా!’
‘కంసాది ఖలులు- దుష్టులు క్రూరంగా కష్టాల పాలు చేస్తుంటే ఈ లోకమంతా శోకంలో మునిగి ఉంది. ముకుందా! మచ్చిక (ప్రేమ)తో లోకాన్ని రక్షించడానికి మాతృకుక్షి- తల్లికడుపు నుంచి వెంటనే బయటికి విచ్చేయవయ్యా’. ‘ముంచ కుంచ దదాతి ఇతి ముకుందః’- ఇహపరా (భుక్తిముక్తు)లను ఇచ్చువాడు ముకుందుడు. దేవతలు దేవకీదేవిని.. ‘తల్లీ! నీ ఉదరంలో పదిలంగా ఉన్న దామోదరుడు- నల్లనయ్య ఎల్లి- రేపే పుట్టబోతున్నాడు. కంసుని వల్ల నీకిక ఏ భయమూ లేదు. మా మాట కల్లకాదు. ఈ నాటి నుంచి మాకెల్లవారికి మేలు కలుగుతుంది. యాదవులందరూ ఆదమరచి మోదం (సంతోషం)తో ఉప్పొంగుతున్నారు. అమ్మా! ఎల్లవేళలా నీ కడుపు చల్లగా వర్ధిల్లాలి’ అని దీవించి విరించి, విరూపాక్షాదులతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
శుకుడు పరీక్షిత్తుతో… రాజా!
కం॥ ‘పంకజముఖి నీళ్లాడను
సంకటపడ ఖలుల మానసంబుల నెల్లన్
సంకటము దోఁచె మెల్లన
సంకటములు లేమి దోఁచె సత్పురుషులకున్’
పంకజం- పద్మం లాంటి ముఖం కలిగిన దేవకి ప్రసవించడానికి సంకట (వేదన) పడుతుంటే, దుష్టుల ఉల్లము (మనస్సు)లలో ఏదో ఆవేదన పెల్లుబికింది. మంచివారికి సంకటాలు- కష్టాలు, మెల్లగా తొలగుతున్న సూచనలు తొంగిచూశాయి.
దేవకీదేవి దేవదేవుని కంటూ ఉండగా… ఏడుసముద్రాలు మింటికెగసి (ఉప్పొంగి)నాయి. మాధవుని ఆగమనాన్ని మోదంతో చాటుతున్నట్లు పయోదాలు- మేఘాలు ఉరిమాయి. గగనం గ్రహ, తారకలతో ఘనంగా వెలిగింది. దిక్కులన్నీ దివ్యకాంతుల వెల్లువలతో పిక్కటిల్లాయి- నిండాయి. చల్లగాలులు కమ్మని వాసనలతో మెల్లగా వీచాయి. అర్ధరాత్రి మహర్షుల ఆశ్రమాలలోని హోమకుండాలలో ధూమధ్వజుడు- అగ్ని జాజ్వల్యమానంగా వెలిగాడు. తామరపూలతోను, వాటిపై జుం జుం అంటూ తిరుగాడే తేట్ల- తుమ్మెదలతోను కొలనులు కళకళలాడాయి. నదులన్నీ నిర్మలమైన జలంతో నిండుగా పారాయి. ఇలా (భూ)దేవి ఆనంద విలాసాలతో ఉల్లాసభరితంగా ఉంది. పక్షుల కిలకిలారావాలతో, పుష్కలంగా ఫల పుష్పాలతో ఉద్యానవనాలు, కాననాలు (అరణ్యాలు) పులకరించాయి. అమ్మ దేవకి కొమరుని కంటూ ఉండగా అమరులు మురిపాలతో సుమ (పుష్ప) వర్షం కురిపించారు. గంధర్వులు తమ గుండెలలో బరువులు దిగిపోగా దరువులు వేస్తూ ఆనందంతో పాటలు పాడారు. రంభాది అప్సరసలు నాట్యాలు ఆడారు. సిద్ధులు, చారణులు భయం వీడి ఒకచోట గుమిగూడారు. దేవతల దుందుభులు మ్రోగాయి.
అది హర్షపులకితమైన వర్షరుతువు. కల్యాణ ప్రదమైన శ్రావణ మాసం. కృష్ణ పక్షం! స్వపక్షం! శుక్లపక్షాన్ని అందరూ ఆదరించి అభిలషిస్తారు. కాని, కృష్ణపక్షాన్ని అనుగ్రహించి అక్కున చేర్చుకోవడం వృష్ణి వంశ శిరోరత్నమైన కృష్ణునికే చెల్లింది. అష్టమి తిథి. తిథులకు సంధి- మధ్య తిథి. రెండు పక్షాలలో అష్టమి చంద్రుడు అష్టకళలతో సమరసంగా- సమానంగా ఉంటాడు. కాన, ‘సమచంద్రుడు’ అని పేరు. పరమాత్మ హాని వృద్ధి రహితుడు అని ధ్వని! అష్టమి చంద్రుడు ఆలస్యంగా పన్నెండు గంటలకు ఉదయిస్తాడు. బుధవారం, యోగులకు మిక్కిలి ప్రియమైన రాత్రి సమయం. పన్నెండు గంటల అభిజిత్ లగ్నం! శుకముని- రాజా! సర్వ శుభగుణ యుక్తమైన పరమ శోభన ముహూర్తం ఆసన్నమైంది. రోహిణి నక్షత్రం రోదసిలో ఓజస్సుతో అతి సౌమ్యంగా ఉంది. చంద్రవంశంలో అవతారం కాన, చంద్రునికి అతి ప్రియమైన సతి రోహిణి కనుక, హరి దానినే తన జన్మ నక్షత్రంగా వరించాడు.
కం॥ ‘సుతుఁగనె దేవకి నడురే
యతి శుభగతిఁ దారలును గ్రహంబులు నుండన్
దితిసుత నిరాకరిష్ణున్
శ్రిత వదనాలంకరిష్ణు జిష్ణున్ విష్ణున్’
ఇలా తారా, గ్రహగణాలు అన్నీ ధారాళంగా శుభస్థానాలలో ఉండగా సతి దేవకీదేవి కారాగృహంలో అర్ధరాత్రి అతి ప్రసన్నుడైన వెన్నుని- విష్ణుని సుతునిగా కన్నది. అతను దితి సుతులను- దైత్యులను, తునుమాడే (ఖండించే)వాడు. అతణ్ని ఆశ్రయించే వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోతాయి. దేవకి మేను (దేహం) మెరుపు తీగలాగ దేదీప్యమానంగా ప్రకాశించింది. పున్నమినాడు నిండైన ఉడురాజు- చంద్రుడు ఉదయించగానే కడు శోభతో వెలిగే తూర్పు దిక్కువలె దేవకి విరాజిల్లింది! ‘కను’ అనునది తెలుగులో చాలా వింతపదం. దీనికి చూడటం, ప్రసవించడం అని రెండు అర్థాలు. ఈ ప్రసంగంలో ప్రసవించడం కాక చూడటమనే అర్థం. విశ్వగర్భునికి గర్భవాసం లేదు. అజ్ఞానమనే గాఢ అంధకారంలో ఉజ్జల దివ్య విజ్ఞాన ప్రకాశోదయం- శ్రీకృష్ణచంద్రోదయం.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006