ఒకసారి నారదుడికి తన కంటే గొప్పభక్తులు లేరని గర్వం పొడచూపిందట. అతడి మనసు తెలుసుకున్న మహావిష్ణువు ‘నారదా! భూలోకంలో నా పరమభక్తుడు ఒకరు ఉన్నాడు. అతణ్ని కలిసి రా! భక్తి అంటే ఏంటో తెలుస్తుంది’ అని చెప్పాడు. నారదుడు ‘నా కంటే స్వామికి గొప్ప భక్తుడు ఎవరు ఉంటారు?’ అని సంశయిస్తూనే భూమిపైకి వచ్చాడు. ఈ భక్తుడు ఓ రైతు.
ఉదయాన్నే లేచి ఓసారి హరి నామస్మరణ చేసుకొని, పొలానికి వెళ్లి రోజంతా పనులు చేసుకుంటున్నాడు. రాత్రి నిద్రపోయే ముందు మరోసారి మనస్ఫూర్తిగా శ్రీహరిని స్మరించుకుంటున్నాడు. ‘ఈ పల్లెటూరి రైతు మహావిష్ణువు భక్తుడెలా అవుతాడు? రోజంతా పొలం పనుల్లోనే ఉంటున్నాడు?’ అని మనసులో అనుకున్నాడు నారదుడు. అదే విషయాన్ని విష్ణుమూర్తి ముందు వెలిబుచ్చాడు. అప్పుడు వైకుంఠధాముడు ఆ త్రిలోక సంచారికి ఓ నూనె గిన్నె ఇచ్చి, ‘దీనిని ఒక్క బొట్టు కూడా ఒలకకుండా వైకుంఠమంతా ప్రదక్షిణ చేసిరా’ అన్నాడు.
ఆ మునీశ్వరుడు నిష్ఠగా నూనె చుక్క కూడా ఒలకకుండా ప్రదక్షిణ చేసి వచ్చాడు. అప్పుడు ఆ శేషశయనుడు ‘నారదా! ఈ ప్రదక్షిణ సమయంలో నన్ను ఎన్నిసార్లు తలచుకున్నావు?’ అని ప్రశ్నించాడు. ‘ఒక్కసారి కూడా లేదు స్వామీ! అయినా నిండుగా ఉన్న ఆ నూనె గిన్నె ఎక్కడ తొణుకుతుందో అన్న ఆలోచనలో మీ నామాన్ని తలచుకోవటం ఎలా కుదురుతుంది?’ అని బదులిచ్చాడు. అప్పుడు ఆ జగన్నాథుడు ‘ఓ నూనె గిన్నె నీ మనసును నా మీద నుంచి పక్కకు మరల్చి నన్నే మరచిపోయేలా చేసింది. కానీ, ఆ రైతు చూడు రోజంతా బండెడు కుటుంబ బాధ్యతల్ని మోస్తూ కూడా రోజుకు విధిగా రెండుసార్లు తలచుకుంటున్నాడు. ఆయన గొప్పభక్తుడే కదా!’ అన్నాడు. రామకృష్ణ పరమహంస తన శిష్యులకు ఈ కథ చెబుతూ గృహస్తుల భక్తి ఎంతో గొప్పదని కొనియాడారు.
– మనోజ్ఞ