కలియుగం ఆరంభంలో మానవులకు క్రమక్రమంగా తపస్సులు క్షీణిస్తూ ఉంటాయి. ఫలితంగా భౌతిక ప్రపంచం సత్యంగా, ఇంద్రియ సుఖాలు నిత్యమైన పరమార్థంగా భావించడం అధికమవుతుంది. భౌతిక ప్రపంచానికి అతీతంగా పాపపుణ్యాలను లెక్కవేసే భగవంతుడనే వాడు ఒకడున్నాడన్న సంగతి మరచిపోతారు. అలాంటి పరిస్థితుల్లో లోక క్షేమం కోరుకునే రుషులు లోక సంచారం చేస్తూ ధర్మం తిరిగి నెలకొనడానికి భగవంతుణ్ని ప్రార్థిస్తూ ఉంటారు. కలియుగంలో మనుషులు ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండటానికి అవసరమైన యజ్ఞయాగాలు అందరూ చేయలేరు. ఇక యోగాదులు చేయడానికి ఇంద్రియ నిగ్రహం కూడా లేదు. కాబట్టి యోగీశ్వరులు, జ్ఞానులు వారి శరీరాలు ఉన్నంతవరకు ఆ దివ్య శరీరాలతో సంచరిస్తూ భూమిని పవిత్రం చేస్తుంటారు. ‘తీర్థం కుర్వంతి తీర్థాని.. క్షేత్రం కుర్వంతి క్షేత్రాని’ అన్నారు నారద మహర్షి. అంటే యోగీశ్వరులు ఏ నీటిని ముట్టుకున్నా అది తీర్థమే, ఎక్కడ అడుగుపెడితే అది దివ్య క్షేత్రమే అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మహర్షుల సంచారం వల్లే తీర్థాలు, క్షేత్రాలు పవిత్రాలయ్యాయి.
అలా కలియుగంలో అనాచార, దురాచారాలు ప్రబలి ధర్మం క్షీణించి, ప్రకృతి క్షోభించే దోషాలను తొలగించడానికి అగస్త్యుడు లోక సంచారం చేశాడు. ఈ క్రమంలో సకల దేవతల నిలయమైన కాంచీపురం మహాక్షేత్రాన్నీ సందర్శించాడు. అక్కడ మానవ కల్యాణం కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అప్పుడు ఆయనకు ఒక దివ్య దర్శనం కలిగింది. తెల్లటి కాంతితో నిర్మల స్ఫటికంలా ప్రకాశిస్తూ, జ్ఞానానందభరితుడై, పై రెండు చేతులలో శంఖుచక్రాలు, కింది రెండు చేతులలో చిన్ముద్ర, పుస్తకంతో అశ్వవదనంతో హయగ్రీవుడు ప్రత్యక్షమయ్యాడు. అగస్త్యుని కోరిక మేరకు హయగ్రీవుడు ఒక దివ్య మహర్షిగా మారిపోయాడు. అలా బ్రహ్మ విద్యా స్వరూపంతో అగస్త్యుని శ్రోతగా చేసుకొని లలితాదేవి చరిత్రను లోకానికి ఉపదేశించాడు. అమ్మవారి విద్య పేరు శ్రీవిద్య. ఈ విద్యకు గురువు దక్షిణామూర్తి.
అమ్మవారి ఒక్కొక్క విద్యను ఒక్కో రూపంలో శివుడు బోధించాడు. శ్రీవిద్యను ఉపదేశించినప్పుడు శివుడు ధరించిన రూపం దక్షిణామూర్తి. విద్య అంటే జ్ఞానం. శ్రీ అంటే అమ్మవారు. అమ్మవారి గురించి వివరించేదే శ్రీవిద్య. అమ్మవారు అంటే శక్తి. ఆ శక్తిని చిచ్చక్తి అంటాం. చిత్ అంటే చైతన్యం. ఈ విశ్వమంతా శక్తిమయం. సత్ అంటే ఎప్పుడూ ఉండేది. సత్, చిత్ రెండింటి గురించి తెలుసుకున్నవారు పొందే ఆనందమే సచ్చిదానందం. ఈ శక్తి ఆద్యంతాలు లేనిది. అమ్మవారి దర్శనం కావాలంటే వాదనతో కాకుండా సాధనతోనే సాధ్యం. జ్ఞానం, విద్య ఈ రెండూ అమ్మవారి రూపాలు. కాబట్టి ఈ రెండింటిని మనం పొందినప్పుడు అమ్మవారు మనకు దర్శనమిస్తారు.
జ్ఞానం అంటే ఉప నిషత్తులలో చెప్పిన ఆత్మ తత్వానికి సంబంధించిన ఆత్మ విచారణ. అంతేగాని లౌకికజ్ఞానం కాదు. ఆ జ్ఞానం వేదాంతంలో చెప్పిన పరతత్వాన్ని అనుభూతిలోకి తెచ్చుకునేది. అది కేవలం సర్వవ్యాప్తమైన శక్తి మాత్రమే. ఇది నిరాకారం నిర్గుణం. ఇక రెండో మార్గం విద్య. ఇది కూడా లౌకిక విద్య కాదు. శాస్త్ర పరిభాషలో విద్య అంటే ఉపాసనా మార్గం. అంటే పరతత్వం ఒక్కటైనా రకరకాల రూపాలలో ఆ దేవతా మంత్రం, యంత్రం, రూపం, పూజా విధానం మొదలైనవాటిని తెలిపే శాస్త్రమే విద్య. అదే ఉపాసనా శాస్త్రం. ఉపాసన అంటే దివ్య దర్శనం. ఇది జ్ఞానమార్గం కంటే కొంత తేలిక. శ్రీవిద్య అంటే అమ్మవారిని సాకారంగా ఆరాధించి, ఉపాసన చేయడమే. అలా చేసిన తర్వాత క్రమక్రమంగా సాధకులకు జ్ఞానం సిద్ధిస్తుంది. ఆ జ్ఞానం వల్ల ధ్యానం, దానివల్ల అమ్మవారు నిర్గుణ నిరాకారంగా అయిపోయిన భావన కలుగుతుంది. అందుకే అమ్మవారి నామం చదివినా, ధ్యానం చేసినా ఏవో అక్షరాలు చదువుతున్నాం అనుకోవద్దు. ఆ అక్షరాలు సాక్షాత్తూ అమ్మవారి రూపాలే. మహర్షులు తపస్సు ద్వారా ఒక అతీంద్రియ స్థితికి వెళ్తే వాళ్లకు వినిపించిన దివ్య శబ్దాలు అమ్మవారి నామాలు. ఆ మంత్రాల గురించి తెలుసుకోవడం, ఆరాధించడం, మంత్ర స్వరూపిణి అయిన జగన్మాతను ఆరాధించడమే శ్రీవిద్య.
–వేముగంటి శుక్తిమతి