శివే శృంగారార్ద్ర తదితర జనే కుత్సనపరా
సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతీ
హరాహిభ్యో భీతా సరసిరుహ సౌభాగ్య జయినీ
సఖీషు స్మేరా తే మయి జనని దృష్టిః సకరుణా!
(సౌందర్యలహరి – 51)
‘అమ్మా! నీ దృష్టి ఒక్కొక్కరి యందు ఒక్కోవిధంగా ప్రసరిస్తుంది. నీ చూపులు శివుడిపై ప్రసరించిన వేళ అవి ఆర్ద్రతాభరిత శృంగార విలాసములై ఉన్నాయి. చూసే దానిపై మక్కువ, ఆసక్తి కలిగి శోభాయమానమైన స్థాయి కలిగితే దానిని శృంగారం అంటాం. అది కాముకత్వం కాదు.. శృంగారం ధార్మికమైనది. శివం అంటే చిదానందం. ఆ అనుభవానికి అవరోధం కలిగిన వేళ ఆనందస్థితి భగ్నం అవుతుంది. అనుక్షణం శివుడిని దర్శిస్తూ ఆ ఆనందహేలలో తన్మయం అవుతున్న తన స్థితి భగ్నం అయ్యేందుకు కారణమైన ఇతర జనులపై చూపులు ప్రసరించిన వేళ అవే బీభత్స రసాన్ని (కుత్సనపరా) ప్రదర్శిస్తున్నాయి. ఎదురుగా శివ జటాజూటంపై అలల సవ్వడులతో, దూకుడును ప్రదర్శిస్తూ నర్తించే గంగాభవాని శివుడి ధ్యానస్థితి చెదిరిపోయేందుకు కారణమవుతున్నది. కాబట్టి ఆమెపై అమ్మ చూపులు రోషపూరితాలై రౌద్రరసాన్ని ప్రదర్శిస్తున్నాయి. అవే చూపులు శివుడి మాహాత్మ్యాన్నీ, గాథలను విన్నప్పుడు విస్మయంతో కూడిన అద్భుత రసాన్ని ప్రదర్శిస్తున్నాయి. శివుడి పక్కన కూర్చున్న వేళ ఆయన ధరించిన పాముల బుసలను విన్నప్పుడు అమ్మ చూపులు భయానక రసాన్ని ప్రదర్శించగా, ఎర్రని కాంతికలిగి కమల శోభలను జయించు కన్నులను చూడగా వీరరసం కనిపిస్తున్నది. ఇక చెలికత్తెల వినోద గోష్ఠిలో హాస్యరసం కనిపిస్తుంది. చివరగా అమ్మా! నీ బిడ్డనై నిన్ను ఆరాధించు, ఉపాసించు, సంస్తుతించు భక్తుడనైన నాపై మాత్రం కరుణారస ప్రసరితములై నీ చూపులు భాసిస్తున్నాయి’ అంటూ శంకరులు ఎనిమిది రసాలను అమ్మచూపులలో ఆవిష్కరించాడు. అభినయ ప్రధానం, భావోద్వేగాలకు పరిమితమైన ఎనిమిది రసాలను ప్రస్తావించి అమ్మకు సహజం, స్వాభావికం, అన్ని భావోద్వేగాలకు అతీతమైన తొమ్మిదో రసం శాంతం ఆమెలోనే మూర్తీభవించినదని చెప్తున్నాడు. నిజానికి రసాలు అంటే అనుభవాలు.. అనుభవ స్థాయిలో చెప్పినప్పుడు అది రసం అవుతున్నది.
భరతుడు ఎనిమిది రసాలను మాత్రమే ప్రస్తావించాడు. అయితే అన్ని రసాలకు చివరన కలిగేది శాంతమే కాబట్టి శంకరులూ శాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించ లేదనేది వ్యాఖ్యాతల భావన. శ్రీచక్రంలో భూపురం, షోడశదళం, అష్టదళం, చతుర్దశారం, బహిర్దశారం, అంతర్దశారం, అష్టారం, త్రికోణం, బిందువు ఇలా తొమ్మిది ఆవరణాలుంటాయి. వాటిని ఆశ్రయించి తొమ్మిది రసాలుంటాయి. సాధకులు ఈ నవావరణాలను అర్చిస్తుంటారు. వాటిలో వరుసగా శృంగారం, వీరం, కరుణ, భయానకం, రౌద్రం, బీభత్సం, హాస్యం, అద్భుతం, శాంత రసాలు ఆవిష్కృతమవుతాయి.
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు. మనోభావాలకు దర్పణమైనది కన్ను. ఉరిమే ధ్వని కన్నా ముందు మెరిసే మెరుపు కనిపిస్తుంది. అందుకే అమ్మ పలుకుల ధ్వనికన్నా ముందుగా అమ్మ కనులలో కనిపించే మెరుపు ఆమె ఆంతర్యాన్ని పట్టిస్తుంది. అమ్మ చూపుల వైవిధ్యాన్ని వివిధ గతులలో రసరూపంలో ప్రదర్శితమైన విధానాన్ని ఈ శ్లోకంలో వివరించాడు ఆది శంకరులు.
‘శివశక్త్యాయుక్తోయది భవతి శక్తః ప్రభవితుం’ శివశక్తుల కలయిక వల్ల లేదా వారి అభేద స్థితి వల్ల సృష్టి జరుగుతుంది. దానికి ఇరువురిలో ప్రధానంగా ఆవిష్కృతం కావలసినది శృంగారం. ఆమె చూపులు అందుకే శివునిపై నిలిచిన వేళ, నవరసాల్లో ఉన్నతమైనదిగా ప్రస్తుతిగాంచిన శృంగారం ఆవిష్కృతమైంది. దానివల్లనే జగత్తు సృజన జరిగింది. సాకార నిరాకార రూపిణియై, భక్తులపై ఎంత కరుణ కురిపించిననూ తృప్తిచెందని ఆ లలితా పరమేశ్వరి మనందరికీ భద్రప్రదాయినియై అనుగ్రహించుగాక.
–పాలకుర్తి రామమూర్తి