అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడే కలియుగంలో మనిషికి మార్గనిర్దేశం కోసం ఉదయించిందే భాగవతం. అష్టాదశ పురాణాల సారాన్ని ఇముడ్చుకున్న భాగవతం నైమిశారణ్యలో ఉద్భవించింది. అంతకుముందు భాగవత భాస్కరుడు గంగాతీరంలో ప్రభవించాడని చెప్తారు. నైమిశారణ్యంలో జరిగింది రెండో ఉదయం. గంగాతీరంలో భాగవత ఉదయానికి శుకమహర్షి కారణం. నైమిశారణ్యంలో భాగవత ఉదయానికి సూతమహర్షి కారకులు. భూలోకంలో కలి ప్రభావం అంటని పుణ్యతీర్థంగా భావించే ఆధ్యాత్మిక క్షేత్రం నైమిశారణ్యం. ఈ పుణ్యస్థలిలో సూతమహర్షి, శౌనకాది రుషుల మధ్య భాగవత చర్చ జరిగింది. ‘నైమిశారణ్యం వేదికగా భాగవత కథా ప్రసంగం ఎందుకు జరిగింది?’ అని అడిగితే ఆ స్థల మహిమను చెప్పుకోవాలి.
సమస్త విశ్వం నిక్షిప్తమయ్యే రీతిలో ఒక గొప్ప చక్రాన్ని సృష్టికర్త బ్రహ్మ సృష్టించాడని వాయవీయ తంత్రం చెప్తుంది. ఆ మహాచక్రం పిడి నైమిశారణ్యంలో ప్రతిష్ఠితమైంది. అంటే, నైమిశారణ్యంలో పిడి తిప్పితే సమస్త విశ్వం ప్రభావితమవుతుందని విశ్వసిస్తారు. వరాహ పురాణం ప్రకారం నైమిశారణ్యంలో యజ్ఞం చేయడం ద్వారా దానవుల బలాన్ని నశింపజేయవచ్చు. అందుకే యజ్ఞాచరణకు నేటికీ నైమిశారణ్యాన్ని ఎంచుకోవడం కనిపిస్తుంది. కలియుగం ఆరంభమైందని అర్థం చేసుకొన్న శౌనకాది రుషులు కలి ప్రభావాన్ని శమింపజేయడానికి వేయేండ్లు కొనసాగే ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే, కొంతకాలం తర్వాత ఆ యజ్ఞ ప్రభావం గురించి వారికే అనుమానం కలిగింది. కలియుగ ప్రభావాన్ని నివారించడానికి మార్గం ఏమిటని వారు ఆలోచిస్తున్న సమయంలో సూత మహర్షి అక్కడికి వచ్చాడు. ఆ మహనీయుని చూడగానే రుషులందరూ సాదరంగా ఆహ్వానించి, పూజలు చేసి, ఉచితాసనాన్ని సమర్పించి వినమ్రంగా ఆరు ప్రశ్నలడిగారు. ఆ ప్రశ్నలే భాగవత ఉదయానికి నాంది పలికాయి.
‘జనులకు శ్రేయోదాయకమైనదేమిటి?’ ఇది శౌనకాది రుషుల మొదటి ప్రశ్న. ఆ విషయాన్ని తమకు అర్థమయ్యేరీతిలో చెప్పమని కోరారు. ‘నానారకాల శాస్ర్తాలలో రకరకాల విద్యుక్త ధర్మాల గురించి ప్రస్తావించారు. చాలాకాలం అధ్యయనం చేస్తేనే అవి కొంత బోధపడతాయి. ఇంతకూ ఆ శాస్ర్తాల సారమేమిటి?’ ఇది రుషుల రెండో ప్రశ్న. తమ హృదయం సంతృప్తిపడే రీతిలో ఆ విషయాన్ని వివరించమని అడిగారు. ‘శ్రీకృష్ణుడిని గురించి, ఆయన అవతారాల గురించి సంపూర్ణ వివరాలు తెలియజేయమ’ని మూడో ప్రశ్నగా కోరారు. శ్రీకృష్ణ అవతారాల విశేషాల శ్రవణం, ఉపదేశం మనిషికి క్షేమాన్ని కలిగిస్తాయి, ఉద్ధారాన్ని చేకూరుస్తాయి. ‘అద్భుతమైన, దివ్యమైన భగవంతుడి కర్మలేమిటి?’ ఇది వారి నాలుగో ప్రశ్న. భగవంతుడి సాహస కృత్యాలను తెలుసుకోవాలని రుషులంతా ఉత్సాహపడ్డారు. ‘భగవంతుడి అవతారాల లీలలేమిటి?’ అని ఐదవ ప్రశ్నగా అడిగారు రుషులు. ‘పరతత్త్వం, యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వధామానికి వెళ్లిపోయినప్పుడు ధర్మం ఎవరిని ఆశ్రయించింది?’ ఇది వారి ఆరో ప్రశ్న.
శౌనకాది రుషులు ఈ ఆరు ప్రశ్నలను తనముందు ఉంచగానే సూతమహర్షి భాగవత కథ ప్రసంగానికి నాంది పలికారు. అంటే నైమిశారణ్యంలో భాగవతం ఆరు ప్రశ్నల కారణంగా ఉదయించింది. నిజానికి భాగవత శ్రవణమే ఒక మహాయజ్ఞం. శ్రవణం ద్వారా భక్తియోగాన్ని నిర్వహించడమే భాగవత సంప్రదాయ విధి. ‘శ్రవణం, కీర్తనం, స్మరణం’ అనే మూడు దివ్యకర్మలతో నిండిన భాగవతాన్ని సూత మహర్షి ఆధ్వర్యంలో శౌనకాది రుషులు పరమానందంగా నిర్వహించి సమస్త ప్రపంచానికి మంగళాన్ని చేకూర్చారు. భాగవతం సాక్షాత్తుగా శ్రీకృష్ణుడి గ్రంథ స్వరూపం. ఇక భాగవతమంతా కృష్ణలీలామృతంతో నిండి ఉంటుంది. అందుకే జీవితంలో భాగవత ఉదయం కలిగిన మనిషి పరమానందంతో అలరారుతాడు.
డా॥వైష్ణవాంఘ్రిసేవకదాస్
98219 14642