బాదరాయణి శుక బ్రహ్మ, పదేపదే స్వాద భరితమైన భాగవతాన్ని సాదరంగా బోధిస్తుండగా.. మేదినీపతి పరీక్షిత్తు మహామోదంతో ఆస్వాదిస్తున్నాడు. శుకుడు.. రాజా! శూరుని కుమారుడు పరమ ఉదారుడైన వసుదేవుడు కారాగృహం చేరి గారాము పట్టి యోగమాయను తన దార- భార్య పక్కన పరుండబెట్టి తన కాళ్లు, చేతులకు సంకెళ్లు తగిలించుకున్నాడు. మాయాపతి మాధవుని సంబంధం వలన సకల బంధవిముక్తి. ఇప్పుడు కారాగృహంలో యోగమాయా సంబంధం వలన జాయాపతులకు (భార్యాభర్తలకు) మరల బంధన ప్రాప్తి!
నందగృహంలో యశోద సాంద్ర(గాఢ) నిద్రలో ఉన్నందున తాను కన్నది కన్యనా, కన్నయ్యనా అన్న విషయం తెలుసుకోలేకపోయింది. ఇక్కడ కారాగృహంలో ఆడపిల్ల బిగ్గరగా ఏడవగా విని మేలుకొన్న కావలి వారు ఆవులిస్తూ కంసునికి పురిటివార్త అందించారు. అతడు తత్తరపడుతూ ఉత్తరీయం వ్రేలాడుతుండగా చెరసాలలో ప్రవేశించి మత్తుడై కత్తిదూసి, దేవకి గుండెకి హత్తుకొన్న మహత్తు (మహిమ)గల ఆడపిల్లను- యోగమాయను, లాగుకొని చంపబోయాడు. దేవకి అడ్డుతగిలి.. ‘అన్నా! మేనల్లుడు కాదు. ఇది నీ మేనకోడలు. చంపవద్దన్నా. మన్నన చేయుమన్నా. నీకు సోదరిని కదన్నా. నిన్ను శరణువేడుతున్నా. నన్ను కరుణించు’ అంటూ ఇలా ఎంత బతిమాలినా ఆలకించక అతి భీతి (భయం)తో మతి తప్పిన ఆ భోజపతి- కంసుడు పసికూన పాదాలు పట్టుకొని పైకెత్తి కసిగా నేలమీద విసిరికొట్టాడు. ఆ పాప కిందపడక పైకి లేచి అష్టభుజ మహాశక్తి స్వరూపిణిగా దర్శనమిచ్చి..
ఉ॥ ‘తెంపరివై పొరిం బొరిని దేవకిబిడ్డలఁ జన్నికుర్రలం
జంపితి వింకనైన నుపశాంతి వహింపక రాలమీద నొ
ప్పింపగ నిస్సిరో యిదియు బీరమె? నా సరసన్ జనించి నిన్
జంపెడి వీరుఁడొక్క దెస సత్కృతి నొందెడు వాడు దుర్మతీ!’
‘ఓరీ! దుర్మార్గుడా! ఈ మహాతల్లి కన్న నా ఆరుగురు అన్నలను మన్నించక వరుసగా చంపిన మొనగాడవు నీవు. ఆడుబిడ్డను చంపడం కూడా ఒక పౌరుషమా? నాకు తోడుగా- నా సరసనే పుట్టిన ఒక వీరుడు మరోచోట, ఓ దుష్టబుద్ధీ! అల్లారుముద్దుగా పెరుగుతున్నాడు. వాడి చేతిలో నీకు చావు మూడుతుందిలే!’ అని హెచ్చరించి ఆయమ (ఆమె) మాయమైపోయింది.
శుకుడు- రాజా! ఆ కలికి (యోగమాయ) పలుకులు చెవుల్లో ములుకులై గుచ్చుకొనగా కంసుడు ఉలికిపడ్డాడు. దేవకీ వసుదేవుల బంధాలు తొలగించి వారితో… ‘బావా! వసుదేవా! సోదరీ! దేవకీ! నేను మీ పసిబిడ్డలను పొట్టన పెట్టుకొన్న శిశు హంతకుడను. నా పాపాలు లెక్కచేయక నాపై కృప చూపండి. నిక్కముగా- నిజానికి నేను హంతనూ కాదు. మీ బిడ్డలు హతులూ కారు. ‘నాయం హంతి న హన్యతే’ (గీత). ఆత్మ సంహరించేది కాదు, సమసేదీ కాదు. అంతా భ్రాంతి మాత్రమే! ఇవన్నీ కర్మబంధాలే సుమా!’ అంటూ వేదాంత ధోరణి వెలిబుచ్చి వారికి పాదాక్రాంతుడయ్యాడు.
ఇదిలా ఉండగా మంద (వ్రేపల్లె)లో నందుడు తనకు నందనుడు పుట్టాడని అమంద (ఎంతో) ఆనందం పొందాడు. దూడలతో కూడిన రెండు లక్షల పాడి ఆవులను భాసురమైన బంగారు తొడుగులతో అలంకరించి పాత్రులైన భూసురులకు దానం చేశాడు. పన్నగశాయి కన్నయ్యను తానే కన్న అయ్యగా ఇయ్యకొని (అంగీకరించి) బీదసాదలకు అందరికీ కోరకనే గోవులను, సంపదలను దానమిచ్చాడు. పుత్ర- శ్రీకృష్ణ జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వల్లవులు- గోపకులు పశువులను పసుపు, కుంకుమలతోను, తమ ఇళ్లను పల్లవ- చిగురుటాకుల తోరణాలతోను అలంకరించారు. ఆ శుభ సమయాన వారందరూ నూతన వస్ర్తాలను, బంగారు ఆభరణాలను ధరించి మధుర పదార్థాలతో మధువైరి దర్శనానికి విచ్చేశారు. ఎల్లవారిలో ఆనందం వెల్లివిరిసింది. వారంతా సరస సల్లాపాలు కావిస్తూ, నీళ్లతో, నేతులతో, పాలు పెరుగులతో, నవనీతాలతో (వెన్నతో) తనివితీరా వసంతాలాడారు. గోప భామినులైతే ఓపికలు కోల్పోయి పరస్పరం పిలుచుకుంటూ ఇలా ముచ్చటించుకున్నారు…
ఆ॥ ‘ఏమి నోము ఫలమొ ఇంత ప్రొద్దొక వార్త / వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవానిఁ గనెనట / చూచి వత్తమమ్మ సుదతులార!’
‘చెలులారా! ఏ నోము ఫలమో కానీ ఈ ప్రొద్దున వీనుల విందుగా ఇంతమంచి వార్త విన్నాము. మన యశోదమ్మ చక్కని మగబిడ్డను కన్నదట ఆ చిన్నారిని కన్నులారా చూచివద్దాం. త్వరగా తరలి రండి’.
రాజా! గోపికలు కంగారు కంగారుగా సింగారాలు చేసుకొని మందగతులతో ముందుకు సాగుతూ నందుని గృహం చేరారు. వారి జడల నుండి పుష్పాలు కిందికి రాలుతూ.. ‘కృష్ణదర్శన లాలస గల మీరు భాగ్యవతులు. మేము మీ తలలపై ఉండి అలరించేటంత యోగ్యత కలవారం కాదు. మీ పాదాలపై పడి ఆ పవిత్ర ధూళి స్పర్శచే మేము పావనమవుతాము’ అని తలంచుచున్నట్లు అనిపించింది. చిన్నికృష్ణుని రూపంలో భ్రాజిష్ణు- ప్రకాశించు, జిష్ణు- జయశీలుడైన విష్ణుని కాంచి, సంతోషంతో స్వామికి కానుకలు సమర్పించి, చిరంజీవివై చిరకాలం మమ్ములను కాచి రక్షించవలసిందిగా ప్రార్థించారు. పిమ్మట గోపవనితలు నూనెతో చిన్నిపాపనికి తల అంటారు. పసుపు పూసి, స్నానం చేయించి ‘శ్రీరామ రక్ష’ అంటూ నీళ్లను చుట్టూ తిప్పి చల్లారు. శిశువును అలంకరించి ఊయలలో ఉంచి దీవించి…
కం॥ ‘జోజో కమలదళేక్షణ! / జోజో మృగరాజ మధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవ కరపద! / జోజో పూర్ణేందు వదన! జోజో యనుచున్’
‘పద్మపత్రాల వంటి నేత్రాలు, సింహపు నడుము వంటి సన్నని నడుము, చిగురుటాకుల వంటి హస్తపాదాలు, పూర్ణచంద్రుని వంటి ముఖము కల ఓ కృష్ణా! నీకు ‘జోజో’- అంటూ జోలపాటలు పాడారు.
కం॥ ‘పలు తోయంబుల జగములఁ / బలు తోయములందు ముంచి భాసిల్లెడి యా
పలుతోయగాడు వల్లవ / లలనా కరతోయములఁ జెలంగుచుఁ దడియన్’
శుకుడు- రాజా! లోకాలను కాపాడడానికి అనేక రకాలుగా అవతరించే మాధవుడు, సృష్టించిన ఆ లోకాలను పలుమారులు ప్రళయకాలంలో అపరిమిత జలాలలో ముంచే (లయింపజేసే), ఆ విరించి జనకుడు మహావిష్ణువు కపట శిశువై సమంచితం (ఒప్పిదం)గా వటపత్రశాయి అయి విరాజిల్లుతాడు. ఆ విష్ణువే ఇప్పుడు వృష్ణివంశ వర్ధనుడైన కృష్ణుడై గోపికల చేతులలో పరిమిత జలాలతోనే వడివడిగా తడిసిపోతున్నాడు.
కం॥ ‘లోకములు నిదుర వోవగ / జో కొట్టుచు నిదురవోని సుభగుడు రమణుల్
జోకొట్టి పాడ నిదురం / గైకొను క్రియ నూరకుండెఁ గను దెరవకయున్’
‘ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః’ (ఆదిత్య హృదయం).. లీలామానుష విగ్రహుడైన బాలకృష్ణుడు తన జోలపాటలతోనే సకల లోకాలను (జీవులను) నిద్రపుచ్చుతూ- తన మాయాశక్తితో ఆత్మజ్ఞానమనే జాగృతి లేకుండా చేస్తూ, తాను మాత్రం నిరంతరం జాగృతుడై (మేల్కొనే) ఉంటాడు. అట్టి నిత్య బుద్ధుడు (నిద్రా రహితుడు) శ్రీహరి గోపికల నిష్కామ ప్రేమకు బద్ధుడై- వశీభూతుడై, వారి జోలపాటల లాలింపులకు ఒళ్లు మరచి, కళ్లు మూసుకొని నిద్రలో ఓలలాడుతున్నట్లు నటిస్తున్నాడు నటన సూత్రధారి మురారి!
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006