శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు కనుల పండువలా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం చండీశ్వరపూజ మండపారాధన కలశార్చన శివపంచాక్షరి జపానుష్టాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం చండీహోమం జరిపించినట్లు కార్యనిర్వాహణాధికారి ఎస్ లవన్న తెలిపారు. సాయంకాలార్చనలు హోమాల అనంతరం స్వామిఅమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై వేంచేబు చేసి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడషోపచార పూజలు నిర్వహించారు.
మంగళవాయిద్యాలు డప్పుచప్పుళ్లతో క్షేత్ర వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు, నందిమండపం నుండి బయలువీరభధ్ర స్వామి వరకు ఆద్యంతం నయనానందకరంగా సాగింది. స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారుల జానపదాలు, కోలాటాలు, రాజభటుల వేషాలు, జాంజ్ పథక్, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, బీరప్పడోలు, నందికోలసేవ, ఢమరుకం, చిడతలు, శంఖం, చెక్కబొమ్మలు వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపు కొనసాగింది.
ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతో పాటు స్వామిఅమ్మవార్లకు ఆస్థానసేవ జరిగింది. గ్రామోత్సవంలో ప్రత్యేక అధికారులు, కార్యనిర్వాహణాధికారి లవన్నతోపాటు, అసిస్టెంట్ కమీషనర్ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పౌర సంబంధాల అధికారి అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా మాఢవీధితో పాటు భ్రామరి కళావేదికతో పాటు పుష్కరణి, శివదీక్షా శిబిరాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.కూచుపూడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు వంటి కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
ఉత్సవాల సందర్భంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శనివారం ఉదయం శ్రీశైల దేవస్థాన ఈవో లవన్న దంపతులు పట్టువస్త్రాలు సమర్పించగా.. సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీశైల ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డిలతోపాటు రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్శాఖల అధికారులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు. రావణవాహన సేవ పూజా కార్యక్రమాల్లో పాల్గొని గ్రామోత్సవాన్ని ప్రారంభించారు.