Brahmotsvams | తిరుమల వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు వేద మంత్రోచ్ఛారణల శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం కార్యక్రమం నిర్వహించారు.
శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తొలుత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్ర ఛామర వ్యజన దర్పణాది నైవేద్యం, రాజోపచారం క్రతువులు జరిపారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో స్నపనం నిర్వహించారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో వైఖానస ఆగమోక్తంగా స్నపనం నిర్వహించారు. అనంతరం దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్త మంత్రాలు, దివ్యప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను పారాయణం చేశారు.
అభిషేకం అనంతరం పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్లు పాశురాలను పఠించారు. ఈ వేడుకలో రంగురాళ్లతో కూడిన గాజుల మాలలు, ఆప్రికాట్ మాలలు, వట్టివేరుమాలలు, కురువేరుమాలలు, రంగురంగుల రోజామాలలు, పసుపు రోజామాలలు, మిక్స్డ్ డ్రైఫ్రూట్స్ మాలలు, తెలుపు ముత్యాల మాలలు, కిరీటాలు, తులసి మాలలను స్వామి, అమ్మవార్లకు అలంకరించారు. టీటీడీ గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వేదికను తీర్చిదిద్దారు. తమిళనాడులోని తిరుపూర్కు చెందిన రాజేందర్ మాలలను విరాళంగా అందించారు. హైదరాబాద్కు చెందిన శ్రీహరి, శ్రీనివాస్ విరాళంతో రంగనాయకుల మండపంలో సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.