డిసెంబర్ 3 గీతా జయంతి
సర్వధర్మాన్ పరిత్యజ్య
మామేకం శరణం వ్రజ
అహం త్వా సర్వపాపేభ్యో
మోక్షయిష్యామి మా శుచః॥
(భగవద్గీత 18-66)ఈ శ్లోకాన్ని భగవద్గీత మూల సూత్రంగా పరిగణిస్తారు. శ్రీకృష్ణ పరమాత్ముడు తన భక్తులకు ‘నేనున్నాను’ అని పూర్తి భరోసా ఇచ్చిన శ్లోకం ఇది. ‘సర్వ విధాలైన ధర్మాలను త్యజించి నన్ను శరణుపొందు. నిన్ను సర్వపాపాల నుంచి నేను విముక్తుణ్ని చేస్తాను. భయపడాల్సిన అవసరం లేదు’ అని అర్జునుడి ద్వారా సమస్త లోకానికి ధైర్యం చెప్పాడు పరమాత్మ. జీవితంలో సంభవించే సకల భయాందోళనలు, గత పాపకర్మల ఫలితాల నుంచి ఉపశమనాన్ని కాంక్షించే వారైతే.. తక్షణం ఆ దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడి శరణు పొందడమే తరణోపాయం. అందుకు గీతోపదేశాన్ని అనుసరించడమే నిజమైన మార్గం.
జగద్గురువు శ్రీకృష్ణుడు సనాతనమైన భగవద్గీత విజ్ఞానాన్ని లోకానికి అందించిన తిథి మార్గశిర శుక్ల ఏకాదశి. ఈ పర్వదినమే గీతా జయంతిగా లోకప్రసిద్ధి. సకల దుఃఖాలను నిర్మూలించి పరిపూర్ణతను ప్రసాదించే మార్గం భగవద్గీత. హరేకృష్ణ ఉద్యమ సంస్థాపక ఆచార్యులైన శ్రీల ప్రభుపాదులవారు రచించిన ‘భగవద్గీత యథాతథము’ అనే గ్రంథంలో గీతాసార మాహాత్మ్యాన్ని అద్భుతంగా విశ్లేషించారు. ‘భగవద్గీతలో తెలిపిన నియమాలను అంగీకరించిన మనిషి తన జీవితానికి పరిపూర్ణత చేకూర్చుకోగలడు. తన సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరించుకోగలడు. అంతేకాదు అతని తదుపరి జన్మ ఆధ్యాత్మికతతో పరిపూర్ణం కాగలదు. ఇదే భగవద్గీత సారాంశం’ అని పేర్కొన్నారు.
దేవదేవుణ్ని ఆశ్రయిస్తే ఆపదలు తప్పకుండా తొలగిపోతాయి. సన్మార్గం వైపు మనసు మళ్లుతుంది. సజ్జనుల సాంగత్యం ప్రాప్తిస్తుంది. దుష్కర్మలు చేయాలనే తలంపు రాదు. ధర్మబద్ధమైన జీవనం అప్రయత్నంగా అలవడుతుంది. అయితే, భగవంతుణ్ని ఆశ్రయించడం ఎలా? పరమాత్మను శరణు కోరడం ఎలా? ఈ సందేహాలకూ భగవానుడే సమాధానం ఇచ్చాడు. తనను శరణు వేడటం ఎలాగో కూడా భగవద్గీతలో స్పష్టంగా వివరించాడు.
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామేవైష్యసి యుక్తైవమ్ ఆత్మానం మత్పరాయణః
‘ఎల్లప్పుడూ నన్నే స్మరించు, నా పట్ల భక్తితో ఉండు, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఇలా చేయటం వల్ల నీవు తప్పకుండా నన్నే చేరుతావు. ఇది నేను నీకు ఇస్తున్న వాగ్దానం. ఎందుకంటే.. నీవు నాకు చాలా ప్రియమైన మిత్రుడవు’ అని శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించే విధానాలనూ సూచించాడు. పై శ్లోకం శరణాగతిలోని నాలుగు అంగాలను వివరిస్తుంది.
సదా స్మరామి
ప్రతి ఒక్కరూ తమతమ జీవితాలను నిత్యం భగవంతుణ్ని స్మరించేందుకు అనుకూలంగా తీర్చిదిద్దుకోవాలి. శ్రీకృష్ణుడిని మనసులో నిలుపుకొంటే ఎలాంటి పాపభీతీ లేకుండా విశుద్ధంగా జీవించగలుగుతాం. సకల ఆపదల నుంచి తమను తాము రక్షించుకునే రహస్యమిదే. ఆపదలు, తాపత్రయాలు అన్నీ మొదలయ్యేది మనసు నుంచే! శ్రీకృష్ణుడిని సదా స్మరించడం వల్ల పాపకర్మలకు హేతువయ్యే మూల ఆలోచనలు రూపుమాసిపోతాయి. అందుకు అనువైన మార్గం ‘హరేకృష్ణ’ మహామంత్రాన్ని సదా జపించడం. ‘హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరేరామ హరేరామ రామ రామ హరే హరే’ ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108సార్లు జపించడం ద్వారా మనసు పునీతం అవుతుంది.
భక్తులుగా మారడం
కంసుడు ఎప్పుడూ కృష్ణుడి గురించే ఆలోచించేవాడు. అయితే అది శత్రుత్వంతో కూడిన ఆలోచన. భగవంతుణ్ని స్మరించే పద్ధతి ఇది కాదు. భగవంతుణ్ని భక్తిపూర్వకంగా సేవించాలి, స్మరించాలి. అందుకు అనువైన నవవిధ భక్తి మార్గాలను ఆచార్యుల ద్వారా నేర్చుకోవాలి. కుల, ప్రాంత, లింగ, జాతి, వర్ణ భేదాలేం లేకుండా ఈ భక్తి మార్గాలను ఆచరించవచ్చు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవ, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదన ఈ తొమ్మిది మార్గాల ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చు.
గీతా జయంతి సందర్భంగా, ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠించి తమ జీవితాలను పునీతం చేసుకోవాలి. ఐదేండ్ల వయసు నుంచే పిల్లలకు భగవద్గీత శ్లోకాలను, అర్థాన్ని నేర్పించాలి. ఇది వారిని కృష్ణ భక్తుడిగా, విలువలతో కూడిన సంస్కారవంతమైన పౌరుడిగా ఎదిగేలా చేస్తుంది. భగవద్గీత, శ్రీకృష్ణుడిపై అంకిత భావం పెంపొందించుకున్న వారికి జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా చక్కగా వ్యవహరించగల మనోధైర్యం కలుగుతుంది.
నిత్యం అర్చించటం
ప్రతిరోజూ శ్రీకృష్ణుడిని విధిగా పూజించాలి. గోవులు, రాధారాణి మొదలైన అనుచరులతో కూడిన గోపాలుడి చిత్రపటాన్ని ఏర్పాటుచేసుకొని ప్రతిరోజూ అర్చించాలి. ధూపం, పుష్పం మొదలైన ఉపచారాలతో పూజించాలి. భగవంతుడికి సమర్పించిన ధూపం ఇంటినంతా పవిత్రం చేయగలదు. స్వామికి అర్పించిన పూల సుగంధం మనసుకు ప్రశాంతత చేకూరుస్తుంది. కన్నయ్యకు సమర్పించిన జలాలు పుణ్యతీర్థమై శారీరక, మానసిక శుద్ధి చేస్తుంది. ఈ విధమైన నిత్య ఆరాధనతో మన ఇంటిని, జీవితాలను పవిత్రంగా తీర్చిదిద్దుకోవాలి.
వందన చందనం
శ్రీకృష్ణుడి పటానికి సాష్టాంగ వందనం చేయాలి. మగవారు సాష్టాంగ వందనాన్ని, స్త్రీలు పంచ అంగ వందనాన్ని సమర్పించవచ్చు. కేవలం నమస్సులు ఆచరించినంతనే భగవంతునికి ప్రియ భక్తులు కాగలం. భక్తునికి సకల శుభాలూ చేకూరుతాయి.
భగవద్గీతలోని ఈ సూత్రాలను ఆచరించిన భక్తులు శ్రీకృష్ణుడి దివ్యధామాన్ని చేరి శాశ్వతమైన నిత్యయౌవన జీవితాన్ని పొందగలరు. భగవత్ ధామంలో జన్మ, మృత్యు, జరా, వ్యాధులేవీ లేకుండా దుఃఖ రహిత స్థితిలో గోపాలుడి సన్నిధిలో ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించగలరని పెద్దల మాట. ప్రస్తుత జన్మలో తాపత్రయాల నుంచి విముక్తులై జీవిస్తూ, తదుపరి జన్మలో కృష్ణ లోకాన్ని చేరటమే భగవద్గీతలోని గుహ్యాతి గుహ్యమైన విజ్ఞానం.
శ్రీమాన్ సత్యగౌర
చంద్రదాస ప్రభూజీ
93969 56984