హైదరాబాద్ : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి కల్యాణోత్సనోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 2 నుంచి 16వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏప్రిల్ 10న భద్రాచలంలో భక్తుల జయజయధ్వానాల మధ్య సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా జరుగనున్నది. 11న సీతారాముల మహాపట్టాభిషేకం వేడుక నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
ఈ ఏడాది సీతారాముల కల్యాణోత్సవ వేడుకలో పాల్గొనేందుకు భక్తులను అనుమతించనున్నట్లు పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాలు కొవిడ్ నేపథ్యంలో ఏకాంతంగానే కల్యాణ వేడుకను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో భక్తుల మధ్య కల్యాణ మహోత్సవాన్ని కనులపండువలా నిర్వహించాలని నిర్ణయించినట్లు దేవస్థానం ఈవో తెలిపారు. కల్యాణోత్సవం టికెట్లు త్వరలోనే ఆన్లైన్లో విక్రయిస్తామని వివరించారు.