భారతదేశంలో అష్టాదశ శక్తి పీఠాల అమ్మవార్లు ఒకే దగ్గర కొలువైన క్షేత్రం ఆనందాశ్రమం. సిద్దిపేట జిల్లా కొండపాక సమీపంలో ఉన్న ఈ ఆనంద నిలయంలో ఎందరో వృద్ధులు విశేష జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి ప్రాంగణం ఇప్పుడు ఆధ్యాత్మిక క్షేత్రమై అలరారుతున్నది. దేశంలోని వివిధ రాష్ర్టాలలో భక్తుల కొంగుబంగారంగా పూజలు అందుకుంటున్న అమ్మవార్లు ఇక్కడ కొలువుదీరారు. హైదరాబాద్-కరీంనగర్ రాజీవ్ రహదారిలో కొండపాకలో ఉన్న ఈ సువిశాలమైన ప్రాంగణం ఇప్పుడు ఓ ఆధ్యాత్మిక కేంద్రం.
శక్తిపీఠాలు పద్దెనిమిది. వీటిలో పదిహేడు మనదేశంలో ఉండగా… శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. కామాక్షి (కంచి), శృంఖల (కోల్కతా), చాముండేశ్వరి (మైసూరు), జోగులాంబ (అలంపూర్), భ్రమరాంబ (శ్రీశైలం), మహాలక్ష్మి (కొల్హాపూర్), ఏకవీర (మాహుర్), మహాకాళి (ఉజ్జయిని), పురుహూతిక (పిఠాపురం), గిరిజ (జాజ్పూర్), మాణిక్యాంబ (ద్రాక్షారామం), కామరూపిక (కామాఖ్య), మాధవేశ్వరి (ప్రయాగ), వైష్ణవీదేవి (జమ్మూ), మంగళగౌరి (గయ), విశాలాక్షి (కాశి), సరస్వతీ దేవి (శ్రీనగర్) రూపాలను ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం.
కరీంనగర్కు వెళ్లే రాజీవ్ రహదారికి ఆనుకుని కొండపాక గ్రామ శివారులో ఆనంద నిలయం ఆవరణలో ఈ క్షేత్రం ఉంది. శక్తిపీఠాల ఆలయానికి కుడిపైపున శ్రీకల్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం కొలువైంది. అమ్మవారి మందిరానికి ఎదురుగా అరుదైన గోవులతో ఓ గోశాలనూ నిర్వహిస్తున్నారు. ఇది పిరమిడ్ ఆకృతిలో ఉండటం విశేషం. మరోపక్క ఆనంద్ నిషాంత్ బాలసదన్ చారిటబుల్ ట్రస్టు, ఆనంద నిలయం వృద్దాశ్రమం ఉండటంతో ఆ ప్రాంతం భక్తులు, సామాజిక సేవకుల సందర్శనలతో సందడిగా ఉంటుంది. గోశాల ప్రాంగణంలో శ్రీరాధాకృష్ణసమేత గోమాత మందిరం నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. సమీపంలోనే సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా చిన్నపిల్లల గుండె శస్త్రచికిత్సల దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. అంతేకాకుండా సత్యసాయి ట్రస్టు నిర్వహణలో పేద బాలికలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో నిర్మించిన జూనియర్ కళాశాల నడుస్తుండటం ఇక్కడి ప్రత్యేకత.
విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.వి.రమణాచారి నేతృత్వంలో పదమూడు సంవత్సరాలుగా ఆనంద నిలయం ఆశ్రమం నడుస్తున్నది. ఎంతోమంది అభాగ్యులకు ఆశ్రయం కలిపిస్తున్న ఈ ప్రాంగణంలో అష్టాదశ శక్తి పీఠాలను నెలకొల్పితే బాగుంటుందని సిద్దిపేటకు చెందిన 82 ఏండ్ల వృద్ధుడు గట్టు రామరాజేశం ఆలోచించారు. ఆయన సంకల్పం గురించి తెలుసుకున్న రమణాచారి ఆనంద నిలయంలో ఐదు ఎకరాల స్థలం ఇచ్చారు. వెంటనే ఆలయం నిర్మాణానికి స్వయంగా ఒక కోటి యాబైలక్షల రూపాయలను రామరాజేశం అందజేసి ఈ మహత్తర కార్యక్రమానికి అంకురార్పణ చేశారు. అలా ఆయన ఆలోచన, ఆశయం, సత్కర్మ అభిలాష వల్ల ఆలయం పూర్తయ్యింది. ఆనంద నిలయం సభ్యులతో ఈ విషయాన్ని చర్చించగా వారు కూడా స్పందించి దాతల సహకారంతో 10 కోట్ల రూపాయలను సమకూర్చారు.
ఈ ఆలయాన్ని ఇటీవలే శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. ఆలయ నిర్మాణం కోసం ఆనంద నిలయం సభ్యులతో చర్చించి ఓ కమిటీ ఏర్పాటుచేశారు. 23 మంది ఫౌండర్ ట్రస్టీ సభ్యుల కృషి, సహకారంతో అష్టాదశ శక్తి పీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్ల ప్రతిష్ఠ పూర్తయ్యింది. “దేశ విదేశాలలో పద్దెనిమిది స్థలాల్లో కొలువుదీరి ఉన్న అమ్మవారి రూపాలను ఒకేచోట నెలకొల్పడం అంటే… అది అమ్మవారి అనుగ్రహం, శంకరుడి కృపగా భావిస్తున్నాం. ఆనంద నిలయం ప్రాంగణంలో 22 దేవాలయాలను నిర్మాణానికి సహకరించిన వారికి శతకోటి వందనాలు” అంటున్నారు కేవీ రమణాచారి. భవిష్యత్తులో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా వర్ధిల్లుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు ఆయన.
…? కేసాని నరసింహారావు