శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం-సఖ్యమాత్మ నివేదనం ..అంటుంది భాగవతం. భగవంతుడిని, భక్తుడిని అనుసంధానించేది పరమ భక్తి. దీనికి నవవిధ మార్గాలున్నాయి. పరీక్షిత్తులా శ్రవణం; నారద, తుంబుర, ప్రహ్లాదుల్లా కీర్తన విధానాలు ఆచరించవచ్చు. నామ, రూప, స్వరూప మిళితమైన స్మరణ పద్ధతీ ఉంది. ఈ భక్తితత్పరులు ధృవుడు, తులసీదాసు తదితరులు. పాద సేవ నానికి గుహుడు, దాస్యభక్తికి ఆళ్వార్లు పేరొందినవారు. సఖ్యతకు అర్జునుడు, ఆత్మ నివేదనా తత్వానికి ద్రౌపది ప్రతీకలు. వీటితో పాటు అర్చన, వందనాదులూ భగవద్ భక్తి ప్రపత్తికి మార్గాలు. వీటన్నిటి సమాహారమే.. భజన.
భజన అనే మూడక్షరాల పదానికి అనేక అర్థాలు. భగవానుడి సేవ, స్తుతి అని మూలభావం. ధీరత్వం అనే అర్థమూ ఉంది. నిజమే మరి. ఊరూ వాడా కలిసి చేసే భక్తి భజనలు ఎంతో కనువిందు, వీనులకూ పసందు. ‘శ్రీరామ నీ నామమెంతో రుచిరా.. కదళీ ఖర్జూరాది ఫలములకన్న, నవరస పరమాన్న నవనీతములకన్న ఎంతో రుచిరా’ – అంటూ భక్త జనులంతా రాగ తాళ భరితంగా, లయబద్ధంగా భజిస్తుంటే ఆ పరిసరాలంతటా భక్తి తరంగాలు వ్యాపిస్తాయి. ఒకప్పుడు ఏ పల్లెపట్టులోనైనా ఓ భజన మందిరం తప్పక ఉండేది. మధ్యలో ఏ కాస్త విరామం దొరికినా పెద్దలూ పిన్నలూ అక్కడే చేరేవారు. తాళాలూ, చిడతల శబ్ద మాధుర్యంతో చుట్టుపక్కల పవిత్ర వాతావరణం నెలకొనేది. అదంతా ఒక తన్మయత. ఆలాపనలు, నర్తనలు జమిలిగా సాగేవి. స్తుతులు, శ్లోకాలు, పాటలు, పద్యాలు, సామెతలు, జాతీయాలు, పద చమత్కారాలు- ఒకటా రెండా.. అనేకం. వాటిల్లోనూ పోటాపోటీ. పలు విధాలుగా వర్ణించడం, చింతనతో వేడుకోవడం, దైవాన్ని సూటిగా ప్రశ్నించడం, కష్టనష్టాలు చెప్పుకోవడం, ఆ భజనల్లోనే ఒక్కోసారి నిందా స్తుతి సాగించడం.. లెక్కలేనన్ని భక్తి మార్గాలు.
ఎంతో రుచిరా..
ఆంజనేయం మహావీరం,
బ్రహ్మ విష్ణు శివాత్మకం
బాలార్క సదృశాభాసం,
రామదూతం నమామ్యహం
అన్నట్టు- రామభక్త హనుమ భజనలకు తెలుగునాట ఏనాడూ కొదవ లేదు. ఆయనను త్రిమూర్త స్వరూపుడిగా కొలుస్తుంటారు. పలు రీతుల్లో రామకథాగానం చేసిన భక్త దూతగా భజిస్తారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృత మస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతీం.. అని కదా అంటారు. రామ భజన జరిగే ప్రతిచోటా మహదానంద బాష్ప లోచనాలతో ఆంజనేయ స్వామి ఉంటాడట! దైవ నామం అనగానే జ్ఞాన, నామదేవుల కథ గుర్తుకొస్తుంది. ఇద్దరూ పండరీనాథ భక్తులే. ఒకసారి యాత్రలకు పయనమయ్యారు. దారిలో దప్పికయింది. దగ్గరిలోని బావి దరికి చేరారు. నీళ్లు లోపల ఎక్కడో ఉన్నాయి. మహిమాన్విత శక్తి నిండిన జ్ఞానదేవుడు పక్షిగా మారి, లోపలికెళ్లి దాహం తీర్చుకొని వచ్చాడు. ‘నిన్నూ పిట్టగా మారుస్తాను. బావి నీళ్లు తాగి తిరిగి రా’ అన్నాడు నవ్వుతూ. వద్దని బదులిచ్చాడు నామదేవుడు.
నేను నమ్ముకున్న దేవుడే నాకు కావాల్సింది ఇస్తాడంటూ భగవన్నామ సంకీర్తన చేయగానే..
అప్పటిదాకా ఆ బావి అట్టడుగున ఉన్న జలం ఉబికి వచ్చి ఆయన దాహం తీర్చిందని పురాణ కథనం. అప్పుడు తెలిసొచ్చింది జ్ఞానదేవుడికి-లోకాన అన్నిటికన్నా నామ కీర్తనే మిన్న అని. భక్త జనాత్మను
భగవంతుడికి నివేదించడం అంటే ఏమిటో అవగతమైంది. ఇంతటి విశిష్ట తత్వం భజనతోనే పరిపూర్ణంఅవుతుందన్నది అనుభవమున్నవారి మాట.
‘హరే రామ హరే రామ..
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ..
కృష్ణ కృష్ణ హరే హరే’
.. ఇంతకు మించిన భజనగీతం లేనేలేదంటారు ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదులు. జానపద కళారూపాల సమాహారం భజనలు. ఏ ఒక్క ప్రాంతానికో ఇవి పరిమితం కాదు. ఇందులో సాహిత్య, సంగీత, నృత్యాభినయ నిపుణతలన్నీ కలగలిసి ఉన్నాయి. భజన.. వ్యాయామం, ధ్యానం, ప్రాణాయామం, నృత్యం.. ఇలా సమస్తమూ!
…? జంధ్యాల శరత్ బాబు