శ్రీశైలం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైలంలో వచ్చే వారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఇందులో రాజీపడొద్దని ఈవో లవన్న అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. ఈ క్రమంలో క్షేత్రపరిధిలో వివిధ విభాగాలను సోమవారం పరిశీలించారు. ఉదయం అన్నదాన భవనం, వంటశాల, భోజనశాలలు, కోల్డ్ స్టోరేజ్, భక్తులు వేచివుండే కంపార్ట్మెంట్ గదులను తనిఖీ చేశారు.
అన్నదానానికి ఉపయోగించే ముడిసరుకులు, కురగాయల నాణ్యత విషయంలో రాజీపడేది లేదన్నారు. అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులతో మర్యాద పూర్వకంగా మేలగాలని సిబ్బందికి సూచించారు. వంటశాలలో ఎల్లప్పుడు పరిశుభ్రతను కనబరచాలన్నారు. అదేవిధంగా క్లాక్రూం, దేవస్థాన వైద్యశాలను పరిశీలించారు. అదే విధంగా కాలినడకతో వచ్చే భక్తులకు దారిపొడవునా మంచినీరు అల్పాహార వసతితోపాటు అత్యవసర వైద్యసేవలందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వివరించారు.