TTD | తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 17 నుంచి 21 వరకు ఐదురోజుల పాటు వార్షిక తెప్పోత్సవాలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు అమ్మవారు పద్మసరోవరంలో తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు. ఈ ఉత్సవాల్లో అలమేలు మంగమ్మ పద్మసరోవర తీరంలో పాంచరాత్ర ఆగమపూజలు అందుకుని భక్తులను అనుగ్రహిస్తారు.
ప్రతి సంవత్సరం అమ్మవారికి జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు రమణీయంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తెప్పోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి, మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. పద్మసరస్సులో బంగారు పద్మం నుంచి ఆవిర్భవించిన అలమేలు మంగ జీవకోటికి మాతృమూర్తిగా మారి భవజలధిలో మునిగిపోకుండా రక్షించి, సర్వసౌఖ్యాలు ప్రసాదిస్తారని తెప్పోత్సవాల అంతరార్థమని ఆలయ పండితులు తెలిపారు. ఇక ఉత్సవాల తొలిరోజైన 17న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి, రెండో రోజు సుందరరాజస్వామి, చివరి మూడు రోజులు పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు.
చివరి మూడు రోజుల పాటు పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మవారికి స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. అమ్మవారికి 20న రాత్రి 8.30 గంటలకు గజవాహనం, 21న రాత్రి 8.30 గంటలకు గరుడ వాహనసేవ నిర్వహిస్తారు. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజు ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. తెప్పోత్సవాల నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో ఐదు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్సేవ, జూన్ 21న లక్ష్మీ పూజను టీటీడీ అధికారులు రద్దు చేశారు.