Srisailam | శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్మిక ఆరుద్ర మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసం ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బుధవారం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారు జామున ప్రాతఃకాల పూజల అనంతరం నందివాహన సేవ నిర్వహించారు. క్షేత్రంలో ప్రధాన పురవీధుల్లో నందివాహనంపై స్వామి, అమ్మవార్లు విహరిస్తూ భక్తులను కటాక్షించారు. వార్షిక ఆరుద్ర ఉత్సవం సందర్భంగా మంగళవారం రాత్రి గణపతిపూజ నిర్వహించారు. ఆ తర్వాత లోక కల్యాణార్థం సంకల్పం పఠించారు. అనంతరం మహన్యాసాన్ని జరిపి లింగోద్భవకాలంలో రుద్రాభిషేకం నిర్వహించారు.
పంచామృతాలు, పలు ఫలరసాలతో పాటు మల్లికాగుండంలోని జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం జరిపించి.. పలు రకాల పుష్పాలు, బిల్వదళాలతో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. బుధవారం వేకువ జామున సుప్రభాత సేవతో స్వామి, అమ్మవార్లను మేల్కొలిపారు. ప్రాతః కాల పూజల అనంతరం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖ మండపంలో నందివాహనంపై ఉత్తరముఖంగా వేంచేపు చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పురవీధుల్లో నందివాహన సేవ నిర్వహించారు. అనంతరం భక్తులను ఆర్జితసేవలు, దర్శనాలకు అనుమతించారు. కార్యక్రమంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి కొంటు సత్యనారాయణ, ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు.