ఒక గుడి పూజారికి కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయి. తాను ఇరవై నాలుగు గంటలూ దేవుడి సేవలోనే గడుపుతున్నా, స్వామి తనను ఈ కష్టాల కొలిమి నుంచి బయటపడేయడం లేదనే బాధ అతనిలో మొదలైంది. అదే సమయంలో గుడి ముందు ఒక చక్కటి పూల తోటను నిర్మించాలని భావించాడు ఆ రాజ్యం రాజు. ఆ పనిలో భాగంగా పూజారిని తన మందిరానికి పిలిపించాడు. రాజమందిరంలో రాజు, రాణి కూర్చుని పూజారితో తోట విషయమై మాట్లాడుతున్నారు. ఇంతలో బయట పెద్దగా గొడవ జరుగుతున్నట్లు కేకలు వినిపించాయి. దొంగతనం చేసి ఉంటాడనే అనుమానంతో ఒక యువకుడిని జనం రాళ్లతో కొడుతున్నారు. ఆ యువకుడు గట్టిగా, ‘రాజా, రక్షించు రాజా! నువ్వు తప్ప మాకింకెవ్వరూ లేరు రాజా, నువ్వే మాకు దిక్కు రాజా!’ అని దీనంగా అరుస్తున్నాడు. రాజు వెంటనే లేచి, ‘నేను వెళ్లాలి. నన్నే నమ్ముకున్న ఆ యువకుడిని కాపాడాలి’ అని చెప్పి బయలుదేరబోయాడు. వెళ్లే ముందు అసలు ఏం జరుగుతుందో చూద్దామని అంతఃపురం కిటికీ నుంచి తొంగి చూశాడు.
కానీ, మళ్లీ ఏమనుకున్నాడో ఏమో గానీ వెనక్కి వచ్చేసి, యథావిధిగా పూజారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. అది చూసి రాణి ఆశ్చర్యపోయింది. ఉండబట్టలేక, ‘ఆ యువకుడిని కాపాడాలని వెళ్లారు కదా మహారాజా! మరి ఎందుకని ఆగిపోయారు?’ అని అడిగింది. అందుకు రాజు, ‘మొదట ఆ యువకుడు రాళ్ల దెబ్బలు తింటూ నేనే సర్వస్వమని, రక్షించమని కోరాడు. కానీ, అతను నన్ను పూర్తిగా నమ్మినట్లు లేడు. నేను బయలుదేరి వెళ్లేలోపే, అతడు తన చేతిలోకి కొన్ని రాళ్లను తీసుకుని జనం మీద ఎదురుదాడి చేస్తున్నాడు. నన్ను పూర్తిగా నమ్మని వాడిని నేను రక్షించలేను’ అని బదులిచ్చాడు. అక్కడే ఉన్న పూజారికి ఈ మాటలతో అంతర్లీనంగా ఒక గొప్ప నిజం బోధపడింది. ‘నేను గుడి పూజారినైనా, ఎప్పుడూ దేవుడి ముందే ఉంటున్నా… నేను స్వామిని ‘సర్వస్య శరణాగతి’ వేడటం లేదు. నా సమస్యలను నేనే పరిష్కరించుకోవాలని చూస్తున్నాను. కానీ, ఆయనపై పూర్తిగా భారం వేయడం లేదు. అందుకే స్వామి దయ నాపై కలగలేదు’ అని తెలుసుకున్నాడు. భగవంతుడిని పూర్తిగా నమ్మి ఆయనపైనే భారం వేస్తే, అన్నీ ఆయనే చూసుకుంటాడని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత తోటకు సంబంధించిన మిగిలిన విషయాలన్నీ రాజుతో మాట్లాడి, ప్రశాంత మనసుతో అక్కడి నుంచి కదిలాడు.