ఆ ఊరి మసీదు ఇమామ్కు ఒక్కొక్కరి ఇంట్లో విందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకరోజు గ్రామానికి చెందిన జైనుల్లా వంతు వచ్చింది. మొదటిసారి ఇమామ్ తమ ఇంటికి విందుకు వస్తున్నారని జైనుల్లా దంపతులు ప్రత్యేక వంటకాలను తయారుచేశారు. ఇమామ్ను ఘనంగా స్వాగతించారు. ఆయన్ను ఇంట్లో కూర్చోబెట్టి.. ఇప్పుడే వస్తానంటూ జైనుల్లా బయటికి వెళ్లాడు. ఏమీ తోచక అక్కడే బల్లమీద ఉన్న ఖురాన్ ప్రతిని తీసి చదవడం ఆరంభించాడు ఇమామ్. కాసేపటికి జైనుల్లా వచ్చి ఇమామ్ను భోజనానికి పిలిచాడు. అంతలో జైనుల్లా భార్య గదిలో బల్ల మీద ఉంచిన డబ్బులు కనిపించడం లేదని ఇల్లంతా వెదకసాగింది. ఎక్కడా కనిపించలేదు! అతిథిగా వచ్చిన ఇమామే డబ్బులు కాజేసి ఉంటాడని భర్తతో అన్నది. జైనుల్లా కూడా ఇమామ్ను అనుమానించాడు.
లోలోపల అసహ్యించుకున్నాడు. మర్నాటి నుంచి జైనుల్లా మసీదుకు వెళ్లినా ఇమామ్ను కలిసేవాడు కాదు. అందరికంటే చివరిగా వచ్చి, ముందుగా వెళ్లిపోయేవాడు. ఇలా కొన్ని నెలలు గడిచాయి. మళ్లీ ఇమామ్కు విందు ఏర్పాటు చేసేందుకు జైనుల్లా వంతు వచ్చింది. ఇష్టం లేకపోయినా ముభావంగానే విందు ఏర్పాటు చేశాడు. భోజనం చేస్తున్న ఇమామ్ జైనుల్లా వాలకం చూసి.. ‘నువ్వు చాలాకాలంగా నాతో మాట్లాడటం లేదు. మసీదుకు వచ్చినా కలవడం లేదు ఎందుకు?’ అని అడిగాడు. ‘మీరు గతంలో భోజనానికి వచ్చినప్పుడు మా ఇంట్లో డబ్బులు మాయమయ్యాయి. ఆ డబ్బు మీరే తీశారని మా అనుమానం’ అని మనసులో మాట చెప్పాడు. ఆ మాట వినగానే ఇమామ్ వెక్కివెక్కి ఏడ్చాడు.
జైనుల్లా ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశాడు. ‘నేను ఏడుస్తున్నది నా మీద మీరు దొంగతనం మోపినందుకు కాదు! ఇంతకాలంగా మీరు ఈ ఖురాన్ గ్రంథాన్ని ముట్టుకోనందుకు నా బాధంతా!’ అన్నాడు. ఇమామ్ చెబుతున్న మాటలు జైనుల్లాకు అర్థం కాలేదు. ‘ఆ రోజు నువ్వు వెళ్లగానే ఈదురుగాలులకు కిటికీలు తెరుచుకున్నాయి. పైకం గాలికి కొట్టుకుపోతుంటే వాటిని ఏరి ఖురాన్ గ్రంథంలో భద్రపరిచాను. ఆ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను’ అని చెప్పాడు. ఆ మాటలు వినడంతోనే జైనుల్లా దంపతులు పశ్చాత్తాపంతో కుంగిపోయారు. ‘ఖురాన్ గ్రంథం ఇంట్లో అందంగా, ఆకర్షణగా ఉంచడానికి కాదు. రోజూ ఖురాన్ పారాయణం చేస్తే ఇంట్లో శుభాలు కురుస్తాయి. ఎన్నో అనుమానాలు, భయాలు దూరమవుతాయి. సన్మార్గం చూపే గ్రంథాన్ని తెరవకుండా ఉంచితే ఇలాంటి అనుమానాలే వెంటాడుతాయి’ అని వారిద్దరి కళ్లు తెరిపించాడు ఇమామ్.
ముహమ్మద్ ముజాహిద్